
ఇంటర్ ప్రవేశాలకు నేడే ఆఖరి గడువు
తెలంగాణ ఇంటర్మీడియట్ బోర్డు 11వ, 12వ తరగతి అడ్మిషన్లు, వాటిలో మార్పులు చేసుకోవడానికి గడువును పొడిగించింది. ఈ అడ్మిషన్లు జూనియర్ కళాశాలలు, రెండు సంవత్సరాల ఇంటర్మీడియట్ కోర్సులను జనరల్, వొకేషనల్ స్ట్రీమ్లలో అందిస్తున్న కాంపోజిట్ డిగ్రీ కళాశాలలకు సంబంధించినవి. విద్యార్థులు సెప్టెంబర్ 12 వరకు ఆన్లైన్ పోర్టల్ ద్వారా అడ్మిషన్ కోసం దరఖాస్తు చేసుకోవచ్చు.
2025-26 విద్యా సంవత్సరానికి సంబంధించిన విద్యార్థుల నమోదు వివరాల్లో తప్పులను సరిదిద్దుకోవడానికి బోర్డు సెప్టెంబర్ 12 వరకు అవకాశం ఇచ్చింది. ప్రైవేట్ కళాశాలలు అడ్మిషన్లు, సవరణలకు అపరాధ రుసుము చెల్లించవలసి ఉంటుంది. అయితే ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలకు మాత్రం అపరాధ రుసుము నుంచి మినహాయింపు ఉంటుంది. బోర్డు అనుబంధ గుర్తింపు పొందిన కళాశాలలు మాత్రమే అడ్మిషన్లకు అర్హులు.
అధికారిక నోటిఫికేషన్ ప్రకారం అన్ని ప్రభుత్వ, ప్రైవేట్, ఎయిడెడ్ కళాశాలల్లో జూన్ 2న కొత్త విద్యా సంవత్సరం ప్రారంభం అయ్యింది. కానీ చాలా మంది విద్యార్థులు, వారి తల్లిదండ్రులు, ప్రిన్సిపాళ్లు అడ్మిషన్ల ప్రక్రియ పూర్తి చేయడానికి మరింత సమయం కావాలని బోర్డును కోరారు. దీనిని దృష్టిలో ఉంచుకొని తెలంగాణ బోర్డు సెప్టెంబర్ 12 వరకు సవరణల కోసం మరోసారి విండోను తెరవాలని నిర్ణయించింది. కళాశాలలకు కూడా అడ్మిషన్ వివరాలను కళాశాల పోర్టల్ లో సవరించడానికి రెండు రోజులు సమయం లభించింది. ఇందుకోసం ప్రైవేట్ కళాశాలలు ప్రతి సవరణకు రూ.200 చెల్లించాల్సి ఉంటుంది. కానీ ప్రభుత్వ, ఎయిడెడ్ కళాశాలలు ఎటువంటి రుసుము చెల్లించనవసరం లేదు.
తెలంగాణ బోర్డు ఒక విషయం స్పష్టంగా తెలిపింది. అదేమిటంటే ప్రిన్సిపాళ్లు అందరూ అడ్మిషన్ వివరాలను జాగ్రత్తగా పరిశీలించి అప్డేట్ చేయాలి. చివరి తేదీ తర్వాత ఎటువంటి మార్పులకు అనుమతి ఉండదు. ఏదైనా కళాశాల పొరపాటు చేస్తే లేదా పేర్కొన్న నిబంధనలను పాటించడంలో విఫలమైతే బోర్డు జరిమానా విధించవచ్చు లేదా వారి అనుబంధ ధృవపత్రాన్ని రద్దు చేయవచ్చు. అనుబంధ గుర్తింపు పొందిన జూనియర్ కళాశాలల్లో మాత్రమే అడ్మిషన్లు చెల్లుబాటు అవుతాయని బోర్డు పేర్కొంది. ఈ కళాశాలల పూర్తి జాబితా అధికారిక వెబ్సైట్లైన acadtgbie.cgg.gov.in, tgbie.cgg.gov.inలలో అందుబాటులో ఉంది.
