Let's talk: editor@tmv.in
అనంతపురంలో ఆపిల్ సాగు.. దక్షిణ భారత హార్టికల్చర్‌లో కొత్త అధ్యాయం

అనంతపురంలో ఆపిల్ సాగు.. దక్షిణ భారత హార్టికల్చర్‌లో కొత్త అధ్యాయం

Panthagani Anusha
27 ఏప్రిల్, 2026

ఉత్తర భారతదేశంలోని జమ్మూ, కాశ్మీర్, హిమాచల్ ప్రదేశ్ రాష్ట్రాలు ఇప్పటివరకు భారత ఆపిల్ మార్కెట్‌లో ఆధిపత్యం కొనసాగిస్తున్న నేపథ్యంలో ఆంధ్రప్రదేశ్‌లోని అనంతపురం జిల్లా నుంచి ఒక అసాధారణ వ్యవసాయ పరిణామం వెలుగులోకి వచ్చింది. ఎండపాటు, తక్కువ వర్షపాతం వంటి ప్రతికూల పరిస్థితులకు పేరుగాంచిన ఈ జిల్లాలో ఆపిల్ సాగు విజయవంతం కావడం వ్యవసాయ రంగంలో కొత్త చర్చకు దారితీసింది.

గార్లదిన్నె మండలం కోటంక గ్రామానికి చెందిన రైతు కె.వి.రమణా రెడ్డి తన 2.5 ఎకరాల భూమిలో ఇజ్రాయెల్ నుంచి తీసుకొచ్చిన ‘కేఎల్డీ’ ఆపిల్ వేరైటీ మొక్కలను నాటి ప్రయోగాత్మకంగా సాగు ప్రారంభించారు. సుమారు రూ.4.2లక్షల పెట్టుబడితో 1,500 మొక్కలు నాటిన ఆయన 12x6 అడుగుల దూరం పద్ధతిని అనుసరించారు. ఈ ప్రయోగాత్మక తోట మొదటి పంటలోనే సుమారు ఒక టన్ను దిగుబడిని ఇచ్చి ఆశ్చర్యపరిచింది.

కాగా ప్రారంభ దశలోనే ఈ ఆపిల్ పంట మార్కెట్‌లో మంచి స్పందనను పొందుతోంది. కిలోకు రూ.120 నుంచి రూ.170 వరకు ధరలు లభించడం విశేషం. ఇది సంప్రదాయ ఆపిల్ సాగు ప్రాంతాలైన హిమాచల్ ప్రదేశ్, జమ్మూ, కాశ్మీర్ రైతులు పొందుతున్న ధరల కంటే ఎక్కువగా ఉండటం గమనార్హం. మధ్యస్థ పరిమాణంలో ఉన్నప్పటికీ మంచి రుచి, నాణ్యత కారణంగా వినియోగదారుల నుంచి డిమాండ్ పెరుగుతోంది.

ప్రస్తుతం అనంతపురం జిల్లాలో గార్లదిన్నె, కుందుర్పి, పెద్దపప్పూరు మండలాల్లో సుమారు 15 ఎకరాల్లో ఆపిల్ సాగు విస్తరించింది. ఎండ ప్రాంతంగా గుర్తింపు పొందిన రాయలసీమలో ఇలాంటి పంట విజయవంతం కావడం వ్యవసాయ నిపుణుల్లో ఆసక్తిని రేకెత్తిస్తోంది.

వ్యవసాయ నిపుణుల విశ్లేషణ ప్రకారం అనంతపురం ఆపిల్ సాగుకు కొన్ని ప్రత్యేకతలు ఉన్నాయి. ఉత్తర భారత ఆపిల్స్ సెప్టెంబర్ నుంచి నవంబర్ మధ్య మార్కెట్లోకి రాగా అనంతపురం పంట డిసెంబర్ కాలంలో పండి భిన్నమైన మార్కెట్ విండోను అందిస్తోంది. దీంతో ఆఫ్-సీజన్ ప్రీమియం ధరలు పొందే అవకాశం ఉంది. అంతేకాకుండా సంప్రదాయ తోటలు 7–8 సంవత్సరాల్లో దిగుబడి ఇస్తే ఈ కేఎల్డీ వేరైటీ రెండో సంవత్సరం నుంచే ఫలాలు ఇస్తోంది.

హై-డెన్సిటీ సాగు విధానం ఈ ప్రయోగానికి ప్రధాన బలం. సంప్రదాయంగా హెక్టార్‌కు 250 చెట్లు మాత్రమే నాటే విధానానికి భిన్నంగా ఇక్కడ సుమారు 3,700 మొక్కలు నాటే అవకాశం ఉంది. దీని ద్వారా భూమి వినియోగ సామర్థ్యం గణనీయంగా పెరిగి ఎకరాకు 3 నుంచి 5 టన్నుల వరకు దిగుబడి వచ్చే అవకాశం ఉంది. కిలోకు సగటు రూ.140 ధరతో చూస్తే ఎకరాకు రూ.4.2 లక్షల నుంచి రూ.7 లక్షల వరకు ఆదాయం సాధ్యమవుతుందని అంచనా వేస్తున్నారు.

అయితే ఈ సాగులో కొన్ని సవాళ్లు కూడా స్పష్టంగా కనిపిస్తున్నాయి. ప్రధానంగా నీటి లభ్యత సమస్య మైట్స్ వంటి పురుగు దాడులు అదేవిధంగా ఆపిల్ సాగుపై రైతులకు తగిన సాంకేతిక పరిజ్ఞానం లేకపోవడం కీలక అడ్డంకిగా నిలుస్తున్నాయి. ఈ కారణంగా డ్రిప్ ఇరిగేషన్ వంటి ఆధునిక నీటి నిర్వహణ పద్ధతులు తప్పనిసరి అవుతాయని నిపుణులు సూచిస్తున్నారు.

ఈ నేపథ్యంలో రాష్ట్ర ప్రభుత్వం సమగ్ర సాధ్యతా అధ్యయనం చేపట్టాలని డెమో ప్లాట్లు ఏర్పాటు చేయాలని నీటి వసతులు మెరుగుపరచాలని అదేవిధంగా రైతులకు పురుగు నియంత్రణ ప్రత్యేక శిక్షణ కార్యక్రమాలు ప్రారంభించాలని వ్యవసాయ నిపుణులు సూచిస్తున్నారు. మొత్తానికి అనంతపురం జిల్లాలో ప్రారంభమైన ఈ ప్రయోగాత్మక ఆపిల్ సాగు విజయవంతమైతే దక్షిణ భారత వ్యవసాయ రూపురేఖలనే మార్చే సామర్థ్యం కలిగి ఉందని నిపుణులు అభిప్రాయపడుతున్నారు.