
అంతా రాజకీయ డ్రామా: కవిత కొత్త పార్టీపై బీజేపీ నేత ఎన్.వి. సుభాష్ విమర్శలు
మాజీ ముఖ్యమంత్రి కల్వకుంట్ల చంద్రశేఖర్ రావు కుమార్తె, కల్వకుంట్ల కవిత 'తెలంగాణ రాష్ట్ర సేనస (టీఆర్ఎస్) అనే కొత్త రాజకీయ పార్టీని ప్రకటించడంపై బీజేపీ తీవ్రంగా స్పందించింది. ఇది కేవలం కల్వకుంట్ల కుటుంబం ఆడుతున్న "రాజకీయ డ్రామా" అని బీజేపీ తెలంగాణ రాష్ట్ర విభాగం శనివారం కొట్టిపారేసింది.
బీజేపీ రాష్ట్ర ప్రధాన ప్రతినిధి ఎన్.వి. సుభాష్ ఒక అధికారిక ప్రకటన విడుదల చేస్తూ.. కేసీఆర్ కుటుంబంలో జరుగుతున్న పరిణామాలు కేవలం ప్రజలను మభ్యపెట్టడానికి ఆడుతున్న నాటకాలని విమర్శించారు. 2014 నుంచి దశాబ్ద కాలం పాటు అధికారంలో ఉండి, 2023 ఎన్నికల్లో ఎదురుదెబ్బ తగిలిన తర్వాత.. ఇప్పుడు కుటుంబంలో విభేదాలు ఉన్నట్లు చిత్రీకరించడం హాస్యాస్పదమని ఆయన పేర్కొన్నారు.
పేరు మార్పుపై విమర్శలు
తెలంగాణ సెంటిమెంట్ను వాడుకోవడానికి గతంలో 'తెలంగాణ రాష్ట్ర సమితిస (టీఆర్ఎస్)ని స్థాపించారని, జాతీయ రాజకీయాల కోసం దానిని 'భారత్ రాష్ట్ర సమితిస (బీఆర్ఎస్)గా మార్చారని సుభాష్ గుర్తుచేశారు. ఇప్పుడు మళ్లీ అదే తరహా పేరుతో (టీఆర్ఎస్ - తెలంగాణ రాష్ట్ర సేన) పార్టీని తీసుకురావడం వెనుక ఉద్దేశం ఏంటని ఆయన ప్రశ్నించారు. కవితను పార్టీ నుంచి బహిష్కరించడం, ఆపై ఆమె కొత్త పార్టీ పెట్టడం అంతా ఒక ముందుగా రాసుకున్న స్క్రిప్ట్ ప్రకారం జరుగుతోందని ఆరోపించారు.
పక్క రాష్ట్రం ఆంధ్రప్రదేశ్లో వై.ఎస్. షర్మిల రాజకీయ ప్రస్థానాన్ని ఉదాహరణగా చూపుతూ.. సొంతంగా పార్టీ పెట్టి చివరికి వేరే పార్టీలో విలీనం కావడం లేదా సర్దుబాటు చేసుకోవడం వంటి ప్రయోగాలు ప్రజలు ఇప్పటికే చూశారని సుభాష్ అన్నారు. ఓటర్లను అయోమయానికి గురిచేయడానికే ఈ చీలిక డ్రామాలు ఆడుతున్నారని ఎద్దేవా చేశారు.
తెలంగాణ రాష్ట్ర ఏర్పాటును బీజేపీ వ్యతిరేకించిందన్న ఆరోపణలను సుభాష్ తోసిపుచ్చారు. పార్లమెంట్లో తెలంగాణ రాష్ట్ర ఏర్పాటుకు బీజేపీ మొదటి నుంచి మద్దతు ఇచ్చిందని, రాష్ట్రం ఏర్పడటంలో నిర్మాణాత్మక పాత్ర పోషించిందని ఆయన పునరుద్ఘాటించారు. ప్రజలు పారదర్శకమైన పాలన కోరుకుంటున్నారని, ఇలాంటి రాజకీయ నాటకాలు బీజేపీ ఎదుగుదలను ఆపలేవని ఆయన ధీమా వ్యక్తం చేశారు.
