Let's talk: editor@tmv.in
అమరావతిపై జగన్ మాటలన్నీ అబద్ధాలే: ఏపీ టీడీపీ చీఫ్

అమరావతిపై జగన్ మాటలన్నీ అబద్ధాలే: ఏపీ టీడీపీ చీఫ్

Shaik Mohammad Shaffee
16 ఏప్రిల్, 2026

రాష్ట్ర రాజధాని అమరావతి నిర్మాణంపై వైఎస్సార్ కాంగ్రెస్ పార్టీ నేతలు చేస్తున్న అసత్య ప్రచారాలపై తెలుగుదేశం పార్టీ ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర అధ్యక్షుడు పల్లా శ్రీనివాసరావు తీవ్రస్థాయిలో విరుచుకుపడ్డారు. అమరావతి నిర్మాణానికి రూ.2 లక్షల కోట్లు అవసరమంటూ మాజీ ముఖ్యమంత్రి జగన్ మోహన్ రెడ్డి, ఆ పార్టీ నేతలు చేస్తున్న వాదనలు కేవలం ప్రజలను, పెట్టుబడిదారులను గందరగోళానికి గురిచేయడానికేనని ఆయన మండిపడ్డారు. విజయవాడలో జరిగిన మీడియా సమావేశంలో ఆయన మాట్లాడుతూ.. వైసీపీ నేతల మాటలను ప్రజలు ఎవరూ నమ్మవద్దని కోరారు.

అమరావతి ఒక ‘సెల్ఫ్ సస్టైనబుల్’ మోడల్

అమరావతి అంటే కేవలం ప్రభుత్వం డబ్బులు ఖర్చు పెట్టే నగరం మాత్రమే కాదని, తన ఖర్చులకు అవసరమైన నిధులను తానే సృష్టించుకోగల శక్తి (సెల్ఫ్ సస్టైనబుల్) ఆ నగరానికి ఉందని పల్లా వివరించారు. "అమరావతి నిర్మాణానికి లక్షల కోట్లు ఖర్చవుతాయని ప్రచారం చేస్తూ వైసీపీ నేతలు సోషల్ మీడియా వేదికగా నిత్యం మాటలు మారుస్తున్నారు. వారి వైఖరి వల్ల రాష్ట్రానికి పెట్టుబడులు వచ్చే అవకాశం దెబ్బతింటోంది. ఇది కేవలం రాష్ట్రానికే కాదు, తెలుగు ప్రజలందరికీ తీరని నష్టం కలిగిస్తుంది" అని ఆయన ఆవేదన వ్యక్తం చేశారు. గత ప్రభుత్వం సృష్టించిన గందరగోళాన్ని చెరిపివేసి, రాజధాని నిర్మాణాన్ని వేగవంతం చేస్తామని ఆయన ధీమా వ్యక్తం చేశారు.

మూడు రాజధానుల ముసుగులో విధ్వంసం

అంతకుముందు వైసీపీ అధినేత జగన్ మోహన్ రెడ్డి మాట్లాడుతూ.. చంద్రబాబు నాయుడు కేవలం కమిషన్ల కోసమే అమరావతిపై మొండిగా వెళ్తున్నారని ఆరోపించారు. విశాఖను పాలనా రాజధానిగా, కర్నూలును న్యాయ రాజధానిగా, అమరావతిని శాసన రాజధానిగా ఉంచాలనే తమ ఆలోచనను ప్రభుత్వం పట్టించుకోలేదని ఆయన మండిపడ్డారు. మచిలీపట్నం, విజయవాడ, గుంటూరు ప్రాంతాలను కలిపి ఒక పెద్ద అభివృద్ధి మండలిగా (మావిగన్) మార్చాలని తాము అనుకున్నామని.. అమరావతిపై పెట్టే భారీ ఖర్చులో కేవలం 10 శాతం పెట్టినా రాష్ట్రం ఆర్థికంగా ఎంతో బాగుపడేదని జగన్ అభిప్రాయపడ్డారు.

చట్టబద్ధంగా అమరావతి ఒక్కటే రాజధాని

రాజకీయ విమర్శలు ఎలా ఉన్నా, తాజాగా పార్లమెంటు ఉభయ సభలు ఆమోదించిన ‘ఆంధ్రప్రదేశ్ పునర్వ్యవస్థీకరణ (సవరణ) చట్టం - 2026’కు రాష్ట్రపతి ద్రౌపది ముర్ము ఆమోదముద్ర వేయడంతో ఆంధ్రప్రదేశ్ ఏకైక రాజధానిగా అమరావతికి పూర్తిస్థాయి చట్టబద్ధత లభించింది. ఈ నేపథ్యంలో రాజధాని విషయంలో ఇంకా దుష్ప్రచారం చేయడం వైసీపీ నేతల దిగజారుడు రాజకీయాలకు నిదర్శనమని టీడీపీ నేతలు విమర్శిస్తున్నారు. ఇప్పటికైనా వై.ఎస్.జగన్ తన పంతం వీడి రాష్ట్ర అభివృద్ధికి సహకరించాలని పల్లా శ్రీనివాసరావు హితవు పలికారు.