
గోదావరి ఆర్చ్ బ్రిడ్జి పునరుద్ధరణలో కీలక మైలురాయి.. 500 హ్యాంగర్ కేబుళ్ల మార్పిడి పూర్తి
ఆంధ్రప్రదేశ్లోని రాజమండ్రి - కొవ్వూరు మధ్య నిరంతరం ప్రవహించే గోదావరి నదిపై ఉన్న ఐకానిక్ ‘బో స్ట్రింగ్ ఆర్చ్ రైల్వే బ్రిడ్జి’ (గోదావరి ఆర్చ్ బ్రిడ్జి - బ్రిడ్జి నెం. 248) పునరుద్ధరణ పనుల్లో దక్షిణ కోస్తా రైల్వే జోన్ ఒక అసాధారణమైన ఇంజనీరింగ్ మైలురాయిని అధిగమించింది. ఈ చారిత్రాత్మక వంతెనకు ఉన్న మొత్తం 672 తుప్పు పట్టిన హ్యాంగర్ కేబుళ్లలో.. రైళ్ల రాకపోకలకు ఎలాంటి అంతరాయం కలగకుండానే 500 కేబుళ్లను (74 శాతం) విజయవంతంగా మార్చినట్లు విజయవాడ రైల్వే డివిజన్ శుక్రవారం ఒక అధికారిక ప్రకటనలో తెలిపింది.
తీవ్ర రద్దీతో కూడిన విజయవాడ - విశాఖపట్నం రైల్వే సెక్షన్లోని ఈ పునరుద్ధరణ ప్రాజెక్టు దాదాపు 30 ఏళ్ల నాటి ఈ వంతెన భద్రతను పెంచేందుకు.. పాతబడిపోయిన 'డినా' కేబుళ్ల స్థానంలో అంతర్జాతీయ ప్రమాణాలకు అనుగుణంగా ఉండే ఆధునిక, తుప్పు-నిరోధక కేబుల్ వ్యవస్థను అమర్చారు. వంతెనకు ఉన్న మొత్తం 28 స్పాన్లలో ఇప్పటికే 20 స్పాన్లలో (71 శాతం) కేబుళ్ల మార్పిడి పూర్తయింది. ప్రయాణీకుల, సరుకు రవాణా రైళ్లు యథావిధిగా నడుస్తుండగా, వంతెన యొక్క నిర్మాణ స్థిరత్వాన్ని కాపాడుతూ ఈ పనులు చేయడం భారతీయ రైల్వే చరిత్రలోనే అత్యంత సంక్లిష్టమైన ప్రాజెక్టులలో ఒకటిగా నిలిచింది.
కొత్తగా అమర్చిన హ్యాంగర్ కేబుళ్లలో హై-యూటీఎస్ బలం కలిగిన పీఎస్సీ స్ట్రాండ్స్ ఉన్నాయి. వీటికి యూరప్ దేశం నుంచి దిగుమతి చేసుకున్న అధునాతన నాలుగు-పొరల తుప్పు నిరోధక రక్షణ వ్యవస్థ, వ్యాక్స్-ఫిల్డ్ యాంకరేజ్లను అమర్చారు. ఇటలీకి చెందిన అంతర్జాతీయ కేబుల్-స్టేడ్ బ్రిడ్జి నిపుణులు దీని స్ట్రెస్సింగ్ విధానాన్ని రూపొందించగా.. ఐఐటీ ముంబై ఇంజనీర్ల పర్యవేక్షణలో ఈ పనులను విజయవంతంగా పూర్తి చేశారు. దీనివల్ల ఈ ఐకానిక్ వంతెన యొక్క మన్నిక, సేవా కాలం, భద్రత గణనీయంగా పెరుగుతాయి.
స్మార్ట్ సెన్సార్లతో నిరంతర నిఘా
వంతెన యొక్క భద్రతను మరింత బలోపేతం చేయడానికి, ముందస్తు నిర్వహణ కోసం.. ఆస్ట్రేలియాకు చెందిన ఇన్స్ట్రుమెంటేషన్ నిపుణుల సహాయంతో అత్యంత ఆధునిక ‘బ్రిడ్జి హెల్త్ మానిటరింగ్ సిస్టమ్’ ను ఇక్కడ ఏర్పాటు చేశారు. ఈ 2.8 కిలోమీటర్ల పొడవైన వంతెన యొక్క నిర్మాణ తీరును 24 గంటల పాటు నిజసమయంలో పర్యవేక్షించడానికి 272 కంటే ఎక్కువ స్మార్ట్ సెన్సార్లను అమర్చారు.
ఈ క్లౌడ్ ఆధారిత మానిటరింగ్ సిస్టమ్.. ఆర్చ్ కదలికలు, హ్యాంగర్లపై పడే ఒత్తిడి, డెక్ ప్రవర్తన, గాలి ప్రభావం, పర్యావరణ పరిస్థితులను నిరంతరం విశ్లేషిస్తుంది. ఏవైనా మార్పులు ఉంటే ముందే హెచ్చరిస్తుంది. ఇందుకోసం రాజమండ్రి వైపు ఒక శాశ్వత ‘బీహెచ్ఎమ్ఎస్ ల్యాబ్’ ను కూడా ఏర్పాటు చేశారు.
ఈ పునరుద్ధరణ పనులను ఈపీసీ కాంట్రాక్ట్ కింద నిర్దేశిత గడువులోగా పూర్తి చేయడానికి ప్రణాళికలు సిద్ధం చేశారు. ఈ ప్రాజెక్టు పూర్తిగా పూర్తయిన తర్వాత, భారతదేశంలోని అత్యంత ప్రతిష్టాత్మకమైన రైల్వే వంతెనలలో ఒకటైన గోదావరి ఆర్చ్ బ్రిడ్జి యొక్క నిర్మాణ విశ్వసనీయత పెరగడమే కాకుండా, రాబోయే తరాలకు దీని వారసత్వ విలువను భద్రపరిచినట్లవుతుందని దక్షిణ కోస్తా రైల్వే జోన్ స్పష్టం చేసింది.
