
41 మంది మావోయిస్టుల లొంగుబాటు
నిషేధిత సీపీఐ (మావోయిస్టు) పార్టీకి తెలంగాణలో గట్టి ఎదురుదెబ్బ తగిలింది. వీరిలో కంపెనీ ప్లాటూన్ కమిటీ, డివిజనల్ కమిటీ స్థాయిలకు చెందిన ఆరుగురు సీనియర్ నాయకులతో సహా మొత్తం 41 మంది అండర్గ్రౌండ్ క్యాడర్ సభ్యులు శుక్రవారం తెలంగాణ పోలీసుల ముందు లొంగిపోయారు. వీరంతా హింసా మార్గాన్ని వీడి జనజీవన స్రవంతిలో కలిశారని రాష్ట్ర డీజీపీ బి. శివధర్ రెడ్డి ఒక ప్రకటనలో వెల్లడించారు.
తెలంగాణ డీజీపీ బి. శివధర్ రెడ్డి శుక్రవారం విడుదల చేసిన ప్రకటనలో ఈ విషయాన్ని వెల్లడించారు. లొంగిపోయిన మావోయిస్టులు మొత్తం 24 ఆయుధాలను పోలీసులకు అప్పగించారు. ఇందులో ఒక ఇన్సాస్ ఎల్ఎమ్జీ, మూడు ఏకే-47 రైఫిళ్లు, ఐదు ఎస్ఎల్ఆర్ రైఫిళ్లు ఉన్నాయని. అదనంగా వివిధ రకాల కాలిబర్లకు చెందిన 733 సజీవ గోలీలు కూడా స్వాధీనం చేసుకున్నామని పేర్కొన్నారు.
ఈ లొంగుబాటు సీపీఐ (మావోయిస్టు) సంస్థ యొక్క బలాన్ని, మనోధైర్యాన్ని, నాయకత్వ విశ్వసనీయతను తీవ్రంగా దెబ్బతీసిందని పోలీసులు తెలిపారు. మావోయిస్టు నాయకత్వం తమ క్యాడర్లను వారి అనుమతి లేకుండా, పరిచయం లేని దూర ప్రాంతాలకు పంపుతుండటమే ప్రధాన అసంతృప్తికి కారణమని పేర్కొన్నారు. భౌగోళిక పరిజ్ఞానం లేకపోవడం, స్థానిక మద్దతు లేమి కారణంగా అక్కడ పనిచేయడం వారికి తీవ్ర కష్టంగా మారిందని తెలిపారు.
అలాగే, నిత్యావసరాల కొరత, కదలికలపై పరిమితులు, లాజిస్టిక్ సమస్యలు వంటి ఇబ్బందులు క్యాడర్లను తీవ్రంగా నిరుత్సాహానికి గురి చేశాయని డీజీపీ వివరించారు. ఈ పరిస్థితులే అనేక మందిని మావోయిస్టు సంస్థను వీడి, సాధారణ జీవితానికి తిరిగి రావడానికి దోహదపడ్డాయని ఆయన చెప్పారు.
పునరావాసం
లొంగిపోయిన క్యాడర్లకు రాష్ట్ర, కేంద్ర ప్రభుత్వాల పునరావాసం, పునరుద్ధరణ విధానం కింద మొత్తం రూ.1.46 కోట్ల రివార్డు మంజూరు చేయనున్నట్లు పోలీసులు తెలిపారు. అవసరమైన పత్రాల పరిశీలన, బ్యాంక్ ఖాతాల ప్రారంభం అనంతరం ఈ మొత్తం పంపిణీ చేయబడుతుందని ఆయన పేర్కొన్నారు.
రికార్డు స్థాయిలో లొంగుబాట్లు
2025 ఏడాది ఒక్కటే చూసుకుంటే, తెలంగాణలో మొత్తం 509 మంది సీపీఐ (మావోయిస్టు) క్యాడర్లు లొంగిపోయారు. వీరిలో రెండు సెంట్రల్ కమిటీ సభ్యులు, 11 రాష్ట్ర కమిటీ సభ్యులు, ముగ్గురు డివిజనల్ కమిటీ కార్యదర్శులు ఉండటం విశేషం. ఇది మావోయిస్టు సంస్థ క్రమంగా బలహీనపడుతున్నదానికి స్పష్టమైన సంకేతమని పోలీసులు అభిప్రాయపడ్డారు.
డీజీపీ రెడ్డి తెలిపిన వివరాల ప్రకారం, కేంద్ర ప్రభుత్వం మావోయిస్టు సమస్యను పూర్తిగా నిర్మూలించేందుకు నిర్ణయించిన మార్చి 2026 గడువుకు ముందే, చత్తీస్గఢ్ నుంచి ఇతర ప్రాంతాలకు చెల్లాచెదురుగా వెళ్లాలని మావోయిస్టు నాయకత్వం క్యాడర్లకు ఆదేశాలు జారీ చేసింది. ఆ తరువాత భద్రతా దళాల చర్యలు తగ్గుతాయనే హామీ ఇచ్చిందని చెప్పారు. అయితే ఈ హామీ పూర్తిగా తప్పుదోవ పట్టించే తప్పుడు ప్రచారమని పోలీసులు స్పష్టం చేశారు. మావోయిస్టు సిద్ధాంతంపై విశ్వాసం కోల్పోయి, హింసతో మార్పు రాదని భావిస్తున్న సభ్యులందరూ జనజీవన స్రవంతిలోకి రావాలని డీజీపీ ఈ సందర్భంగా పిలుపునిచ్చారు.
