Let's talk: editor@tmv.in
పీ4లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి

పీ4లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి

FL - SUNL
13 సెప్టెంబర్, 2025

రానున్న సంక్రాంతి పండుగ నాటికి అద్దంకి నియోజకవర్గంలోని ప్రతీ ఉన్నత పాఠశాల విద్యార్థులకు ఉచితంగా సైకిళ్లు అందజేస్తామని ఇంధన శాఖ మంత్రి గొట్టిపాటి రవి కుమార్ తెలిపారు. శుక్రవారం నాడు బాప‌ట్ల జిల్లా జే. పంగ‌లూరు మండ‌లంలోని బూద‌వాడ జిల్లా ప‌రిష‌త్ ఉన్న‌త పాఠ‌శాల విద్యార్థుల‌కు 205 సైకిళ్ల‌ను ఉచితంగా మంత్రి గొట్టిపాటి అందించారు. మేఘా కంపెనీతో పాటు నెద‌ర్లాండ్స్ కు చెందిన మోర్ ఫౌండేష‌న్ సీఎస్ఆర్ నిధుల‌తో పీ4 ప‌థ‌కంలో భాగంగా ఈ సైకిళ్ల‌ను విద్యార్థుల‌కు ఉచితంగా అందించామ‌ని మంత్రి పేర్కొన్నారు.

రానున్న నాలుగు నెల‌ల్లో మ‌రిన్ని సైకిళ్లు

పారిశ్రామిక‌వేత్త‌లు, వ్యాపార‌స్తులతో పాటు అవ‌కాశం ఉన్న‌వారంద‌రూ పీ4 కార్య‌క్ర‌మంలో భాగ‌స్వాములు కావాల‌ని మంత్రి గొట్టిపాటి రవి కుమార్ పిలుపునిచ్చారు. సైకిళ్ల పంపిణీ అనంతరం పాఠశాల విద్యార్థులతో మంత్రి గొట్టిపాటి మాట్లాడారు. పాఠశాల‌లో సౌక‌ర్యాలు ఎలా ఉన్నాయ‌ని విద్యార్థుల‌ను అడిగి తెలుసుకున్నారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ.. అద్దంకి నియోజ‌క‌వ‌ర్గ ప‌రిధిలోని 6 నుంచి 10వ త‌ర‌గ‌తి విద్యార్థినీ, విద్యార్థులంద‌రికీ వ‌చ్చే సంక్రాంతి నాటికి ఉచితంగా సైకిళ్ల‌ను అందిస్తామ‌ని హామీ ఇచ్చారు. ఇప్ప‌టికే కొన్ని మండ‌లాల్లోని పాఠ‌శాల‌ల్లో సైకిళ్ల పంపిణీని పూర్తి చేశామ‌ని, మిగిలిన వారికి కూడా రాబోయే నాలుగు నెల‌ల్లో ఉచితంగా సైకిళ్ల‌ను అందిస్తామ‌ని తెలిపారు. మంత్రి లోకేష్ ఆధ్వ‌ర్యంలో విద్యార్థుల‌కు నాణ్య‌మైన యూనిఫార్మ్ లు, పుస్త‌కాలు అందించామ‌న్నారు. విద్యార్థుల‌ మ‌ధ్యాహ్న భోజ‌న విష‌యంలోనూ ప్ర‌త్యేక శ్ర‌ద్ధ తీసుకునే విధంగా చ‌ర్య‌లు తీసుకున్నామ‌ని తెలిపారు. విద్యార్థులు ఎవ‌రూ స‌రైన ర‌వాణ సౌక‌ర్యాలు లేక చ‌దువుకు దూరం కాకూడ‌ద‌నే అంద‌రికీ సైకిళ్ల‌ను ఉచితంగా అందిస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి వెల్ల‌డించారు. సైకిళ్ల‌పై పాఠ‌శాల‌ల‌కు వ‌చ్చేప్పుడు త‌గు జాగ్ర‌త్తలు తీసుకోవాల‌ని, త‌ల్లిదండ్రులు కూడా పిల్ల‌ల‌కు ప్రయాణ‌ జాగ్ర‌త్త‌లు చెప్పాల‌ని సూచించారు.

ప్ర‌జారోగ్యంపై ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి

అనంతరం అద్దంకి పట్టణంలోని మున్సిపల్ కార్యాలయంలో లబ్ధిదారులకు ముఖ్యమంత్రి సహాయనిధి చెక్కులను పంపిణీ చేశారు. 218 మంది ల‌బ్ధిదారుల‌కు రూ.1,18,43,916 విలువైన సీఎంఆర్ఎఫ్ చెక్కుల‌ను అందజేశారు. వీటితో పాటు తొమ్మిది ల‌క్ష‌ల రూపాయిల విలువైన (ఎల్ఓసీ) లెట‌ర్ ఆఫ్ క్రెడిట్ల‌ను ఐదుగురు ల‌బ్ధిదారుల‌కు అందించారు. ఈ సంద‌ర్భంగా మంత్రి గొట్టిపాటి మాట్లాడుతూ ప్ర‌జారోగ్యంపై కూట‌మి ప్ర‌భుత్వం ప్ర‌త్యేక దృష్టి కేంద్రీక‌రించింద‌ని తెలిపారు. ముఖ్య‌మంత్రి చంద్ర‌బాబు నాయుడు ఆధ్వ‌ర్యంలో ప్ర‌వేశ‌పెడుతున్న కొత్త హెల్త్ ఇన్సూరెన్స్ పాల‌సీ విధానం రాష్ట్ర చ‌రిత్ర‌లో మైలురాయిగా నిలిచిపోతుంద‌ని స్ప‌ష్టం చేశారు. రాష్ట్రంలోని ఎక్కువ‌ మంది పేద‌ల‌కు మ‌రింత‌ మెరుగైన వైద్య సేవ‌ల‌ను అందించాల‌నే ల‌క్ష్య‌తోనే కొత్త హెల్త్ పాల‌సీని ప్ర‌భుత్వం తీసుకొస్తుంద‌న్నారు. గ‌త వైసీపీ ప్ర‌భుత్వ అరాచ‌కాల‌తో రాష్ట్ర ఆర్థిక ప‌రిస్థితి అస్త‌వ్య‌స్థ‌మ‌యినా., ప్ర‌జా సంక్షేమం కోస‌మే సూప‌ర్ 6 ప‌థ‌కాల‌ను పూర్తి స్థాయిలో అమ‌లు చేస్తున్నామ‌ని ఈ సంద‌ర్భంగా మంత్రి వివ‌రించారు. అనంత‌రం ప్ర‌జ‌ల నుంచి అర్జీల‌ను స్వీక‌రించారు. వారి స‌మ‌స్య‌ల‌ను వెంట‌నే ప‌రిష్క‌రించాల‌ని సంబంధిత అధికారుల‌కు మంత్రి గొట్టిపాటి ఆదేశాలు జారీ చేశారు.

పీ4లో అంద‌రూ భాగ‌స్వాములు కావాలి - Tholi Paluku