Let's talk: editor@tmv.in
11 నెలల్లో టీటీడీకి 918 కోట్ల విరాళాలు!

11 నెలల్లో టీటీడీకి 918 కోట్ల విరాళాలు!

FL - SUNL
22 అక్టోబర్, 2025

తిరుమల తిరుపతి దేవస్థానం నిర్వహిస్తున్న ట్రస్టులకు విరాళాలు వెలువెత్తాయి. టిడిపి కూటమి ఏర్పడిన తర్వాత 11 నెలల్లో 918.6 కోట్ల రూపాయలు వివిధ ట్రస్టుల ద్వారా (2024 నవంబర్ ఒకటో తేదీ నుంచి 2025 అక్టోబర్ 16 వ తేదీ వరకు) దాతలు విరాళాలు అందించారు. టీటీడీ చరిత్రలో ఇది రికార్డు స్థాయి లో విరాళాలు అందించినట్లు అంచనా వేస్తున్నారు. టీటీడీకి ఆన్ లైన్ లో రూ 579.38 కోట్లు, ఆఫ్ లైన్ ద్వారా 339.20 కోట్లు విరాళాలు అందాయి.

విరాళాల వెల్లువ

రాష్ట్రంలో టీడీపీ కూటమి ప్రభుత్వం ఏర్పడిన తర్వాత టిటిడి పాలకమండలి చైర్మన్ బి.ఆర్ నాయుడు వచ్చిన తర్వాత టీటీడీ నిర్వహించే ట్రస్టులకు విరాళాలు వెల్లువెత్తాయి. కేవలం 11 నెలల వ్యవధిలోనే టీటీడీకి 918.6 కోట్లు విరాళాలు అందడం గమనార్హం. దీనికి ప్రధాన కారణం వసతి, దర్శనం, లడ్డూ ప్రసాదాలు, అన్నదానంలో నాణ్యత మెరుగు పరచడమే అనే మాట తిరుమలలో ప్రధానంగా వినిపిస్తోంది.

"పారిశ్రామికవేత్తలే కాదు. మధ్యతరగతి వారు కూడా ట్రస్టులకు విరాళాలు అందించారు. మానవసేవగా భావించాలి" అని టీటీడీ చైర్మన్ బి.ఆర్ నాయుడు వ్యాఖ్యానించారు. మనకు ఉన్న దాంట్లో కొంత పేదలకు దానం చేస్తే అదే పెద్ద సంతృప్తి కలిగిస్తుందని ఆయన అన్నారు. టిటిడి ట్రస్టులకు విరాళాలు అందించడానికి పారిశ్రామికవేత్తలు ముందుకు రావడం అభినందనీయం అని కూడా ఆయన పేర్కొన్నారు.

ఈ విరాళాలతో..

తిరుమల తిరుపతి దేవస్థానం కేవలం ఆధ్యాత్మిక కార్యక్రమాలకు మాత్రమే పరిమితం కాలేదు. ధార్మిక కార్యక్రమాలను విస్తృతం చేయడానికి హిందూ ధర్మ ప్రచార పరిషత్ తో పాటు రోజుకు 2.50 మందికి అన్న ప్రసాదాలు అందిస్తుంది.

తిరుమలలో ప్రధాన అన్నదాన సత్రం తో పాటు కాటేజీలలో పది చోట్ల, తిరుపతి గోవిందరాజస్వామి ఆలయం, తిరుచానూరు పద్మావతి అమ్మవారి ఆలయంతో పాటు కడప జిల్లాలోని ఒంటిమిట్ట కోదండ రామస్వామి ఆలయం లో కూడా నిత్య అన్నదాన పథకాన్ని విస్తరింపజేశారు.

టీటీడీ ఈ పథకాలతో పాటు పేదలకు కార్పొరేట్ స్థాయి వైద్య సేవలు అందించడానికి వీలుగా శ్రీ వెంకటేశ్వర ఇన్స్టిట్యూట్ ఆఫ్ మెడికల్ సైన్సెస్, శ్రీ బాలాజీ వికలాంగుల శాస్త్ర చికిత్స పునరాగ కేంద్రం బర్డ్ ఆస్పత్రులు నిర్వహిస్తోంది. ఇక్కడి రోగులకు సేవలు అందించడానికి ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్ ఏర్పాటు చేసింది. గోవుల సంరక్షణ ఎస్వీ సర్వ శ్రేయస్ ట్రస్ట్ వేద పరిరక్షణ విద్యా దాన ట్రస్టులు కూడా టిటిడి ఏర్పాటు చేసి, దాతల విరాళాలతో ఈ కేంద్రాలు నిర్వహించడంతోపాటు పేద రోగులు, విద్యార్థులు, శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికులకు అన్నప్రసాదాలు వడ్డించడానికి టిటిడి ఏర్పాటు చేసిన వ్యవస్థ ప్రపంచంలోనే ఆదర్శంగా నిలుస్తుంది అనడంలో సందేహం లేదు.అని

"టీటీడీకి ఆన్లైన్ ద్వారానే ఎక్కువ సంఖ్యలో దాతలు విరాళాలు అందిస్తున్నారు" అని టిటిడి చైర్మన్ బి.ఆర్ నాయుడు వెల్లడించారు.

ఏ ట్రస్టుకు ఎంత..

టీటీడీ ధార్మిక కార్యక్రమాల తోపాటు విద్య, వైద్యం, ఆరోగ్యం, గోవుల సంరక్షణ తోసహా నిత్యాన్నదాన పథకాల కోసం ట్రస్టులు నిర్వహిస్తోంది. తిరుమల శ్రీవారి దర్శనానికి వచ్చే యాత్రికుల్లో అనేక మంది వీఐపీలు, పారిశ్రామికవేత్తలు భారీగా ట్రస్టులకు విరాళాలు అందించారు.

"ఈ ఆర్థిక సంవత్సరం ముగిసే నాటికి మరింతగా విరాళాలు అందే అవకాశం ఉంది" అని టీటీడీ చైర్మన్ బీఆర్. నాయుడు ఆశాభావం వ్యక్తం చేశారు. తిరుమలలోని మాతృశ్రీ తరగొండ వెంబమాంబ నిత్యాన్నదాన ట్రస్టుకు అధికంగా విరాళాలు అందాయి.

టీటీడీ ఎస్వీ నిత్యాన్నదాన ట్రస్టుకు 338.8 కోట్లు విరాళం అందింది.

శ్రీవాణి ట్రస్ట్: రూ 252.83 కోట్లు

శ్రీబాలాజీ ఆరోగ్య వరప్రసాదిని స్కీమ్: రూ 97.97 కోట్లు

ఎస్వీ ప్రాణదాన ట్రస్ట్: రూ 66.53 కోట్లు

ఎస్వీ గోసంరక్షణ ట్రస్ట్ : రూ 56.77 కోట్లు

ఎస్వీ విద్యాదాన ట్రస్ట్ :రూ 33.47 కోట్లు

బర్డ్ ట్రస్ట్:రూ 30.02 కోట్లు

ఎస్వీ సర్వశ్రేయాస్ ట్రస్ట్: రూ 20.46 కోట్లు

ఎస్వీ వేదపరిరక్షణ ట్రస్ట్: రూ 13.87 కోట్లు

ఎస్వీబిసీ: రూ 6.29 కోట్లు

స్విమ్స్: రూ 1.52 కోట్లు

ఈ విరాళాలపై స్పందించిన టీటీడీ ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ "టీటీడీ నిర్వహించే ట్రస్టులకు దాతల నుంచి పెద్ద ఎత్తున సహకారం అందుతోంది. మాధవ సేవ అంటే ఇదే" అని ఈఓ అనిల్ కుమార్ సింఘాల్ చెప్పారు. ఆఫ్ లైన్ కంటే ఆన్ లైన్ ద్వారా విరాళాలు ఎక్కువ వచ్చాయని ఆయన చెప్పారు. తిరుమలలో కియోస్క్ యంత్రాలతో పాటు టీటీడీ వెబ్ సైట్ ద్వారా కూడా దాతలు విరాళాలు ఇచ్చారని ఆయన వివరించారు. ఆన్ లైన్ లో రూ 579.38 కోట్లు, ఆఫ్ లైన్ ద్వారా 339.20 కోట్లు విరాళాలు అందాయని ఆయన చెప్పారు. దాతలకు శ్రీవారి దర్శనంతో పాటు వసతి సదుపాయం కల్పించడంలో కూడా టీటీడీ అధికారులు ప్రత్యేక శ్రద్ధ తీసుకుంటున్న విషయాన్ని ఆయన ప్రస్తావించారు. ఈ విరాళాల వడ్డీతో యాత్రికుల సదుపాయం కోసం భవనాల నిర్మాణం, యంత్రాల కొనుగోలు వంటివి కూడా చేస్తున్నారు.