
101 ఏళ్ల ఒలింపిక్ లెజెండ్ కోస్టే కన్నుమూత
ప్రపంచంలోనే అతి పురాతన ఒలింపిక్ ఛాంపియన్, సైక్లిస్ట్ చార్లెస్ కోస్టే 101 ఏళ్ల వయసులో కన్నుమూశారు. 1948 లండన్ ఒలింపిక్స్లో టీమ్ పర్సూట్ సైక్లింగ్ ఈవెంట్లో ఫ్రాన్స్ తరపున బంగారు పతకం గెలిచిన ఆయన, గతేడాది పారిస్ ఒలింపిక్స్ ఓపెనింగ్ సెరిమోనీలో ఆఖరి ముందు టార్చ్బేరర్గా ఒలింపిక్ ఫ్లేమ్ను మోసి చరిత్ర సృష్టించారు.
అక్టోబర్ 31 గురువారం కోస్టే మరణించారు. సెర్జ్ బ్లూసన్, ఫెర్నాండ్ డెకనాలి, పియర్ ఆడమ్లతో కలిసి 1948లో పురుషుల టీమ్ పర్సూట్లో ఫ్రాన్స్కు బంగారు పతకం సాధించిన ఘనత ఆయనది. జనవరి 2025లో హంగేరీ జిమ్నాస్ట్ ఆగ్నెస్ కెలెటి మరణించిన తర్వాత, జీవించి ఉన్న అతి పురాతన ఒలింపిక్ ఛాంపియన్గా కోస్టే నిలిచారు.
ఫ్రాన్స్లోని వార్ ప్రాంతంలోని ఒలియుల్స్లో 1924 ఫిబ్రవరి 8న జన్మించిన కోస్టే చిన్నప్పటి నుంచే స్పోర్ట్స్, సైక్లింగ్ పట్ల మక్కువ పెంచుకున్నారు. 1947లో ఫ్రెంచ్ నేషనల్ పర్సూట్ ఛాంపియన్గా నిలిచి, మరుసటి ఏడాది టీమ్ ఫ్రాన్స్ లీడర్గా గ్రేట్ బ్రిటన్ను సొంత గడ్డపై సెమీఫైనల్లో, ఇటలీని ఫైనల్లో చిత్తు చేసి ఒలింపిక్ బంగారు పతకం సాధించారు.
పారిస్ 2024 ఒలింపిక్స్లో కోస్టే నుంచి ఒలింపిక్ ఫ్లేమ్ అందుకున్న ఐదుసార్లు జూడో ఒలింపిక్ ఛాంపియన్ టెడ్డీ రినర్, సోషల్ మీడియాలో ఇలా అన్నారు.. ‘చార్లెస్ కోస్టే మనల్ని విడిచిపెట్టారు. పారిస్ 2024లో ఆయన నుంచి ఫ్లేమ్ అందుకోవడం నాకు చాలా గౌరవమైనది. ఆ క్షణం ఆయనలోని నిబద్ధత, గౌరవం, ప్రేమను ప్రతిబింబించాడు. కోస్టే అంకితభావం, గౌరవం, క్రీడల పట్ల ప్రేమకు ప్రతీక. ఆయన కెరీర్ ఆరాధనకు అర్హం, ఆయన చరిత్ర రాబోయే తరాలకు స్ఫూర్తిని ఇస్తుంది.’
