
జగిత్యాల కేంద్రీయ విద్యాలయానికి 10 ఎకరాలు కేటాయించాలి: సీఎంకు ధర్మపురి అర్వింద్ లేఖ
జగిత్యాల జిల్లా చెల్గల్ గ్రామంలో కేంద్రీయ విద్యాలయం ఏర్పాటు కోసం జులై 2న జరిగిన రాష్ట్ర మంత్రివర్గ సమావేశంలో 5 ఎకరాల భూమిని కేటాయించడాన్ని నిజామాబాద్ ఎంపీ ధర్మపురి అర్వింద్ స్వాగతించారు. అయితే, విద్యార్థుల భవిష్యత్తును దృష్టిలో ఉంచుకుని ఈ కేటాయింపును 5 ఎకరాల నుంచి 10 ఎకరాలకు పెంచాలని కోరుతూ ఆయన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డికి లేఖ రాశారు.
కేంద్రీయ విద్యాలయ సంఘటన్ నిబంధనల ప్రకారం.. మెట్రో నగరాల వెలుపల ఆదర్శవంతమైన క్యాంపస్ ఏర్పాటుకు కనీసం 10 ఎకరాల భూమి అవసరమని ఎంపీ తన లేఖలో గుర్తుచేశారు. విద్యార్థుల భవిష్యత్ అవసరాలు దృష్టిలో ఉంచుకుని విశాలమైన క్యాంపస్ ఉండాలని పేర్కొన్నారు. తరగతి గదులు, ప్రయోగశాలలు, క్రీడా మైదానాలు, భవిష్యత్ విస్తరణకు తగిన స్థలం ఉండాలంటే 10 ఎకరాల భూమి అవసరమని వివరించారు. జగిత్యాల విద్యార్థులకు కేవలం కనీస ప్రమాణాలతో కూడిన స్థలం కాకుండా, అత్యుత్తమ విద్యా వాతావరణాన్ని కల్పించాల్సిన బాధ్యత ప్రభుత్వంపై ఉందని ఆయన పేర్కొన్నారు. జగిత్యాల పిల్లల భవిష్యత్తు కోసం "కనీసం కాదు… అత్యుత్తమం కావాలి" అని స్పష్టం చేస్తూ, భూమి కేటాయింపును పెంచేలా సానుకూల నిర్ణయం తీసుకోవాలని సీఎం రేవంత్ రెడ్డికి ఎంపీ ధర్మపురి అర్వింద్ విజ్ఞప్తి చేశారు.
