
హోరాహోరీగా జల్లికట్టు
ఎద్దులు కాలు దువ్వాయి. రంకెలు వేశాయి. తమను అదుపులో పెట్టేందుకు ప్రయత్నించే తమర్ (ఎద్దును అదుపు చేసేవాడు)ను కింద పడేశాయి. తప్పించుకునేందుకు ప్రయత్నించగా వదిలిపెట్టాయి. అయినా పొగరుపట్టిన, కొమ్ములు తిరిగిన ఎద్దులను తమర్లు చాకచక్యంగా కిందపడేసి విజేతలుగా నిలిచారు. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన అలంగానల్లూరు జల్లికట్టు పోటీలు శనివారం హోరాహోరీగా సాగాయి. ఉగ్ర స్వభావం గల ఎద్దులు తమ శక్తిసామర్థ్యాలను ప్రదర్శిస్తూ క్రీడాకారులను వణికించాయి. సంప్రదాయ క్రీడ అసలైన ఉత్సాహం ఈ పోటీల్లో స్పష్టంగా కనిపించింది. ఈ వేడుకలను ప్రత్యక్షంగా తమిళనాడు ముఖ్యమంత్రి ఎం.కే. స్టాలిన్ వీక్షించారు. జల్లికట్టుకు మరింత ప్రోత్సాహం ఇచ్చే కీలక ప్రకటన చేశారు. పోటీల్లో అత్యధిక ఎద్దులను అదుపులోకి తీసుకున్న ఉత్తమ క్రీడాకారుడికి పశుసంవర్ధక శాఖలో ప్రభుత్వ ఉద్యోగం కల్పిస్తామని ప్రకటించారు. అలంగానల్లూరులోనే రూ.2 కోట్ల వ్యయంతో ఆధునిక జల్లికట్టు శిక్షణ, చికిత్స కేంద్రం ఏర్పాటు చేయనున్నట్లు కూడా సీఎం వెల్లడించారు.
మదురై నేల వీరత్వానికి ప్రతీక. ప్రపంచ ప్రసిద్ధి గాంచిన జల్లికట్టును చూస్తే మనలో ధైర్యం ఉప్పొంగుతోంది. బలమైన ఎద్దులే తమిళనాడుకు గర్వకారణమని స్టాలిన్ అన్నారు. వీరత్వాన్ని ప్రదర్శించిన క్రీడాకారులకు, అలాగే క్రీడాకారుల్ని లెక్కచేయకుండా అరేనా(పోటీ స్థలం)ను విడిచిపెట్టిన ఎద్దుల యజమానులకు సీఎం బంగారు ఉంగరాలు అందజేశారు. ఇది మీకు ఆనందం కలిగిస్తుందని ఆశిస్తున్నానని ఆయన పేర్కొన్నారు.
కలకలం సృష్టించిన ఎద్దు
ఈ జల్లికట్టు పోటీల్లో 14 మంది గాయపడగా, వారిలో నలుగురిని ఆసుపత్రిలో చేర్చి చికిత్స అందిస్తున్నారు. ఇదే సమయంలో ముఖ్యమంత్రిని స్వాగతించేందుకు విమానాశ్రయానికి చేరుకున్న జనంలోకి ఒక ఎద్దు దూసుకెళ్లడంతో కొద్దిసేపు ఉద్రిక్తత నెలకొంది. అయితే యజమానులు వెంటనే తాళ్లతో అదుపులోకి తీసుకున్నారు. పోటీల్లో ఎద్దులు తలలు ఊపుతూ, స్థిరంగా నిలబడి క్రీడాకారులకు చిక్కకుండా పోవడంతో అనేక ఎద్దులు విజేతలుగా నిలిచాయి. ఒక సందర్భంలో ధైర్యవంతుడైన క్రీడాకారుడిపై ఎద్దు పడిపోయినా, అతడు ఎలాంటి గాయాలు కాకుండా బయటపడ్డాడు. మాజీ మంత్రి సీ.విజయభాస్కర్, నటుడు సూరి, శ్రీలంక రాజకీయ నాయకుడు సెంటిల్ తొండైమాన్కు చెందిన ఎద్దులు అడ్డుకోలేనివిగా నిలిచి, ఆయా యజమానులకు బంగారు నాణేలు అందేలా చేశాయి. పొంగల్–2026 సీజన్లో చివరి ప్రధాన పోటీగా జరిగిన ఈ జల్లికట్టులో 465 మంది క్రీడాకారులు, 825 ఎద్దులు ‘వాడి వాసల్’ నుంచి అరేనాలోకి విడుదలయ్యాయి. రాష్ట్ర వాణిజ్య పన్నులు, నమోదు శాఖ మంత్రి పీ.మూర్తి ఈ క్రీడలను ప్రారంభించగా, మధురై జిల్లా కలెక్టర్ ప్రవీణ్ కుమార్ తదితర అధికారులు హాజరయ్యారు.
