
హైదరాబాద్లో ఆటో ఎల్పీజీ కొరత
నగరంలో ఆటోలకు వినియోగించే ఎల్పీజీ గ్యాస్ సరఫరాలో ఏర్పడిన అంతరాయం వల్ల పట్టణ రవాణా వ్యవస్థపై ప్రభావం పడకుండా ప్రభుత్వం ముందస్తు జాగ్రత్తలు తీసుకుంటోంది. మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి మార్గదర్శకత్వంలో సంబంధిత అధికారులతో సంప్రదింపులు జరుపుతూ, సరఫరాను త్వరితగతిన పునరుద్ధరించేందుకు రద్దీని తగ్గించేందుకు సమన్వయంతో కృషి చేస్తున్నారు.
ఎల్పీజీ కొరతను అధిగమించేందుకు ఆయిల్ కంపెనీలు, ఇతర భాగస్వామ్య పక్షాలతో నిరంతరం చర్చలు జరుపుతున్నారు. సరఫరాలో అంతరాయం కనిష్టంగా ఉండేలా చర్యలు తీసుకుంటున్నారు.ఆటోల లభ్యత తగ్గడం వల్ల ప్రయాణికులకు ఇబ్బందులు కలగకుండా హైదరాబాద్ మెట్రో రైలు, ఆర్టీసీ బస్సు సర్వీసులను అదనంగా నడపాలని ప్రభుత్వం నిర్ణయించింది. ప్రధాన మార్గాల్లో బస్సుల ట్రిప్పులను పెంచడం ద్వారా రవాణా ఇబ్బందులు లేకుండా చూస్తున్నారు. ఆటో యూనియన్లు, గ్యాస్ డీలర్లతో సమావేశాలు ఏర్పాటు చేసి, ప్రస్తుత పరిస్థితులపై వారికి అవగాహన కల్పిస్తూ సమన్వయంతో ముందుకు వెళ్తున్నారు. పౌరుల సౌకర్యమే పరమావధిగా, నగరవ్యాప్తంగా సాఫీగా, నమ్మదగిన ప్రజా రవాణా వ్యవస్థను నిర్ధారించడానికి ప్రభుత్వం కట్టుబడి ఉందని మంత్రి స్పష్టం చేశారు. ఎల్పీజీ కొరతను పరిష్కరిస్తామని, అంతవరకు ప్రజలు సహకరించాలని ఆయన కోరారు.
