Let's talk: editor@tmv.in
హీరోల కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు: రజనీకాంత్

హీరోల కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు: రజనీకాంత్

Pinjari Chand
9 ఏప్రిల్, 2026

అభిమాన హీరోల కోసం తమ ప్రాణాలకు ప్రమాదం కలిగేలా ప్రవర్తించకూడదని సూపర్ స్టార్ రజినీ కాంత్ అభిమానులకు సూచించారు. హీరోలను కలుసుకునేందుకు లేదా దగ్గరగా ఉండేందుకు ప్రయత్నంలో గాయపడితే బాధపడేది అభిమానులేనని ఆయన హెచ్చరించారు. చెన్నై విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన రజనీకాంత్, ముఖ్యంగా నటుడు–రాజకీయ నాయకుడు విజయ్‌ ప్రచార ర్యాలీల్లో అభిమానులు అతని వాహనం ముందు పడిపోవడం వంటి ప్రమాదకర చర్యలు తీసుకుంటున్నారని వ్యాఖ్యానించారు. అభిమానులు జాగ్రత్తగా ఉండాలని, తమ భద్రతకు ప్రాధాన్యం ఇవ్వాలని సూచించారు. ఇటీవల తమిళనాడులోని కరూర్‌‌లో విజయ్ నిర్వహించిన ర్యాలీలో జరిగిన తొక్కిసలాటలో 41 మంది మృతి చెందిన ఘటనను ఆయన గుర్తుచేశారు. ఇలాంటి ఘటనలు మళ్లీ జరగకుండా అభిమానులు అప్రమత్తంగా ఉండాలని తెలిపారు.

యువత ముఖ్యంగా తమ చదువుపై దృష్టి పెట్టాలని రజనీకాంత్ సూచించారు. విద్యార్థి దశలో చదువును నిర్లక్ష్యం చేస్తే భవిష్యత్తులో తీవ్రంగా నష్టపోవాల్సి వస్తుందని అన్నారు. అలాగే మత్తు పదార్థాలకు దూరంగా ఉండాలని యువతకు ఆయన సూచించారు. అలాంటి అలవాట్లు వ్యక్తి జీవితానికే కాకుండా కుటుంబానికీ నష్టం కలిగిస్తాయని హెచ్చరించారు. ఇక తన సినిమాల విషయానికి వస్తే, ప్రస్తుతం తన కొత్త చిత్రానికి సుమారు 20 శాతం షూటింగ్ మాత్రమే మిగిలి ఉందని రజనీకాంత్ తెలిపారు. నటుడు కమల్‌హసన్‌తో కలిసి చేయనున్న ప్రాజెక్ట్ గురించి వివరాలు దర్శకులు, నిర్మాతల దగ్గర ఉన్నాయని చెప్పారు.

హీరోల కోసం ప్రాణాలు పణంగా పెట్టొద్దు: రజనీకాంత్ - Tholi Paluku