
స్విస్ ఓపెన్లో భారత షట్లర్లకు నిరాశ
స్విస్ ఓపెన్ సూపర్ 300 బ్యాడ్మింటన్ టోర్నమెంట్లో భారత షట్లర్లకు బుధవారం మిశ్రమ ఫలితాలు ఎదురయ్యాయి. పురుషుల సింగిల్స్లో ఆయుష్ శెట్టి, మహిళల విభాగంలో ఉన్నతి హుడా, తన్వి శర్మ తొలి రౌండ్లోనే ఓటమిపాలై టోర్నీ నుంచి నిష్క్రమించారు. అదే సమయంలో పురుషుల డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ శుభారంభం చేసి తదుపరి రౌండ్కు దూసుకెళ్లింది.
సింగిల్స్లో చతికిలబడ్డ ఆయుష్, ఉన్నతి
పురుషుల సింగిల్స్ తొలి రౌండ్లో యూఎస్ ఓపెన్ విజేత ఆయుష్ శెట్టి పోరాడి ఓడిపోయారు. కెనడాకు చెందిన బ్రయాన్ యాంగ్తో జరిగిన ఉత్కంఠ పోరులో ఆయుష్ 18-21, 19-21 తేడాతో పరాజయం పాలయ్యారు. మహిళల సింగిల్స్లో యువ క్రీడాకారిణి ఉన్నతి హుడాకు నిరాశే ఎదురైంది. చైనీస్ తైపీ షట్లర్ చియు పిన్-చియాన్ చేతిలో 14-21, 14-21 తేడాతో ఉన్నతి ఓటమి చెందారు. మరో మ్యాచ్లో భారత క్రీడాకారిణి తన్వి శర్మ.. టాప్ సీడ్ పుత్రి కుసుమ వర్దాని (ఇండోనేషియా) చేతిలో చిత్తుగా ఓడారు. కేవలం 30 నిమిషాల్లోనే ముగిసిన ఈ ఏకపక్ష పోరులో తన్వి 11-21, 10-21 తేడాతో పరాజయం పాలయ్యారు.
ప్రణయ్ వాకోవర్.. మిక్స్డ్ డబుల్స్లోనూ పరాజయం
భారత స్టార్ షట్లర్ హెచ్.ఎస్. ప్రణయ్ అనూహ్యంగా టోర్నీ నుంచి తప్పుకోవడం జట్టుకు పెద్ద ఎదురుదెబ్బగా మారింది. 2023 ప్రపంచ ఛాంపియన్షిప్ కాంస్య విజేత అయిన ప్రణయ్, జపాన్కు చెందిన కోకి వతనాబేతో జరగాల్సిన మ్యాచ్కు వాకోవర్ ఇచ్చారు. అటు మిక్స్డ్ డబుల్స్లోనూ భారత్కు చేదు అనుభవమే ఎదురైంది. రోహన్ కపూర్-రుత్విక శివాని గద్దె జంట 19-21, 14-21 తేడాతో థాయ్లాండ్కు చెందిన ఐదో సీడ్ రుత్తనపాక్-జెనిచా జోడీ చేతిలో పరాజయం పొందింది.
డబుల్స్లో సాత్విక్-చిరాగ్ జోడీ ముందడుగు
సింగిల్స్లో నిరాశ ఎదురైనా, పురుషుల డబుల్స్లో భారత జంటలు సత్తా చాటాయి. ప్రపంచ నాలుగో నంబర్ జోడీ సాత్విక్సాయిరాజ్ రంకిరెడ్డి-చిరాగ్ శెట్టి రౌండ్ ఆఫ్ 16కు చేరుకున్నారు. మంగళవారం అర్థరాత్రి దాటాక జరిగిన పోరులో సింగపూర్ జంట ఎంగ్ కీత్ వెస్లీ కో-జున్సుకే కుబోపై 21-19, 21-19 తేడాతో విజయం సాధించారు. మరో డబుల్స్ మ్యాచ్లో హెచ్. అమ్సకరుణన్-ఎం.ఆర్. అర్జున్ జోడీ కూడా సత్తా చాటింది. చైనీస్ తైపీకి చెందిన చెన్ జి రే-లిన్ యు చియేపై 21-16, 24-22 తేడాతో గెలుపొంది తదుపరి రౌండ్లోకి అడుగుపెట్టింది.
