Let's talk: editor@tmv.in
స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రికార్డు: సీఎం ఫడ్నవీస్

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రికార్డు: సీఎం ఫడ్నవీస్

Pinjari Chand
22 డిసెంబర్, 2025

మహారాష్ట్రలో జరిగిన మున్సిపల్ కౌన్సిళ్లు, నగర్ పంచాయతీల ఎన్నికల్లో బీజేపీ రికార్డు స్థాయి విజయాన్ని సాధించిందని ముఖ్యమంత్రి దేవేంద్ర ఫడ్నవీస్ ఆదివారం ప్రకటించారు. మొత్తం కౌన్సిలర్లలో 48 శాతం మంది బీజేపీ గుర్తుపై గెలుపొందడం చరిత్రలోనే తొలిసారిగా జరిగిందని ఆయన తెలిపారు. అలాగే బీజేపీ నుంచి 3,300 మందికి పైగా కౌన్సిలర్లు ఎన్నికయ్యారని చెప్పారు. 286 మున్సిపల్ కౌన్సిళ్లు, నగర్ పంచాయతీలకు జరిగిన ఎన్నికల ఫలితాల లెక్కింపు ఆదివారం ప్రారంభమైంది. ఈ ఎన్నికల్లో బీజేపీ అభ్యర్థులు 129 మున్సిపల్ కౌన్సిళ్లలో అధ్యక్షులుగా ఎన్నికయ్యారని ఫడ్నవీస్ వెల్లడించారు. మొత్తం స్థానిక సంస్థల్లో 75 శాతం వరకు మహాయుతి కూటమి అభ్యర్థులే అధ్యక్ష పదవులు దక్కించుకున్నారని తెలిపారు.ఈ విజయం వెనుక పార్టీ సంస్థాగత బలం, అభివృద్ధి కార్యక్రమాలే ప్రధాన కారణమని చెప్పారు.

ఇది సమష్టి విజయం

పార్టీ, ప్రభుత్వం కలిసి ప్రజల ముందుకు అభివృద్ధి ఎజెండాతో వెళ్లాం. నేను ఎవరినీ వ్యక్తిగతంగా విమర్శించలేదు. ప్రభుత్వం చేసిన పనులు, భవిష్యత్ ప్రణాళికలపైనే ప్రజల మద్దతు కోరామని సీఎం మీడియా సమావేశంలో చెప్పారు. ఈ ఎన్నికల్లో మహాయుతి కూటమిలోని బీజేపీ, ఏకనాథ్ షిండే నేతృత్వంలోని శివసేన, అజిత్ పవార్ నేతృత్వంలోని ఎన్సీపీ కొన్ని చోట్ల పరస్పరం పోటీ పడగా, మరికొన్ని చోట్ల పొత్తులతో పోటీ చేశాయి. అలాగే మహా వికాస్ ఆఘాడీ (ఎంవీఏ)లోని శివసేన (యూబీటీ), కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) పార్టీల మధ్య కూడా స్నేహపూర్వక పోటీలు జరిగాయి.

ఎన్నికల సంఘం ప్రభుత్వానికి అనుకూలంగా వ్యవహరించింది

అయితే ప్రతిపక్షాలు ఈ ఫలితాలపై తీవ్ర అభ్యంతరాలు వ్యక్తం చేశాయి. కాంగ్రెస్, శివసేన (యూబీటీ) నేతలు ఈ ఎన్నికల్లో తమ ఓటమిని అంగీకరిస్తూనే, ఎన్నికల సంఘం పాలక కూటమికి అనుకూలంగా వ్యవహరించిందని ఆరోపించారు. కాంగ్రెస్ రాష్ట్ర అధ్యక్షుడు హర్షవర్ధన్ సప్కల్ గెలిచిన పార్టీ అభ్యర్థులకు అభినందనలు తెలిపారు. అదే సమయంలో మహాయుతి విజయానికి సహకరించిన రాష్ట్ర ఎన్నికల సంఘానికి అభినందనలు అంటూ వ్యంగ్యంగా వ్యాఖ్యానించారు.

శివసేన (యూబీటీ) ఎంపీ సంజయ్ రౌత్ ఈవీఎంలలో మేనిప్యులేషన్ జరిగిందని ఆరోపించారు. డబ్బు వరద, అధికార బలం ముందు ప్రతిపక్షం నిలబడలేకపోయిందని అన్నారు. అదే పార్టీ నేత అంబాదాస్ దాన్వే కూడా డబ్బు కారణంగానే మహాయుతి విజయం సాధించిందని ఆరోపించారు.

ప్రజలు ప్రతిపక్షాలను తిరస్కరించారు

మహారాష్ట్ర బీజేపీ అధ్యక్షుడు రవీంద్ర చవాన్ మాత్రం ప్రజలు ప్రతిపక్షాల నకిలీ కథనాలను తిరస్కరించారని చెప్పారు. మొత్తం 288 స్థానిక సంస్థల్లో 250కి పైగా మహాయుతి గెలిచిందని, బీజేపీ ఒక్కటే 134 మున్సిపల్ అధ్యక్ష పదవులు, 3,000కి పైగా కౌన్సిలర్ స్థానాలు సాధించిందని పేర్కొన్నారు. రాబోయే బృహన్‌ ముంబై మున్సిపల్ కార్పొరేషన్ (బీఎంసీ) ఎన్నికల్లో కూడా ప్రతిపక్షాన్ని ముంబై ప్రజలు తిరస్కరిస్తారని ఆయన అన్నారు.

కేంద్ర మంత్రి నితిన్ గడ్కరీ ఈ విజయాన్ని పార్టీ కార్యకర్తల కృషికి అంకితం చేశారు. ఇది కార్యకర్తల విజయం. అభివృద్ధి దృక్పథంపై ప్రజలు విశ్వాసం చూపించారని ఆయన తెలిపారు. వివిధ జిల్లాల్లో కూడా మహాయుతి ఆధిపత్యం కొనసాగింది. లాతూర్, బీడ్, నాందేడ్, రత్నగిరి జిల్లాల్లో బీజేపీ, శివసేన, ఎన్సీపీ కలిపి గణనీయమైన విజయాలు సాధించాయి. అయితే చంద్రపూర్, సంగ్లీ జిల్లాల్లో కాంగ్రెస్, ఎన్సీపీ (ఎస్‌పీ) తమ పాత బలమైన స్థానాలను నిలుపుకున్నాయని ప్రతిపక్ష నేతలు పేర్కొన్నారు.

నాగ్‌పూర్ జిల్లా కాంప్టీ మున్సిపల్ కౌన్సిల్‌లో బీజేపీ అభ్యర్థి కేవలం 116 ఓట్ల తేడాతో గెలవడంతో కాంగ్రెస్ అభ్యంతరం తెలపడంతో, ఓట్ల పునఃలెక్కింపునకు అధికారులు ఆదేశించారు. మొత్తంగా చూస్తే, స్థానిక సంస్థల ఎన్నికల ఫలితాలు మహారాష్ట్ర రాజకీయాల్లో మహాయుతి కూటమి బలాన్ని స్పష్టంగా చాటగా, ప్రతిపక్షాలు మాత్రం ఈవీఎంలు, డబ్బు బలం అంటూ తీవ్ర ఆరోపణలు చేయడం రాష్ట్ర రాజకీయ వాతావరణాన్ని మరింత వేడెక్కించింది.

స్థానిక సంస్థల ఎన్నికల్లో బీజేపీ రికార్డు: సీఎం ఫడ్నవీస్ - Tholi Paluku