
సోయా రైతులకు నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపట్టాలి: కిషన్రెడ్డికి జూపల్లి వినతి
జిల్లా పర్యటనలో ఉన్న కేంద్ర బొగ్గు, గనుల శాఖ మంత్రి జి. కిషన్ రెడ్డిని ఆదిలాబాద్లోని పెన్ గంగా గెస్ట్ హౌస్లో రాష్ట్ర మంత్రి జూపల్లి కృష్ణారావు మర్యాదపూర్వకంగా కలిశారు. ఈ సందర్భంగా, జిల్లా రైతులు ఎదుర్కొంటున్న ప్రధాన సమస్యలపై సుదీర్ఘంగా చర్చించిన్నట్లు మంత్రి జూపల్లి కృష్ణారావు తెలిపారు. ముఖ్యంగా సోయాబీన్ రైతులకు తక్షణమే న్యాయం చేయాలని, నాఫెడ్ ద్వారా ప్రభుత్వ కొనుగోళ్లు చేపట్టాలని కేంద్ర మంత్రిని కోరారు.
సోయా రైతుల ఆవేదన - కేంద్రం చొరవకు విన్నపం
ఈ సందర్భంగా రాష్ట్ర మంత్రి మాట్లాడుతూ, అకాల వర్షాల కారణంగా సోయాబీన్ పంట తీవ్రంగా దెబ్బతిందని వివరించారు. పంట నాణ్యత తగ్గడంతో పాటు రంగు మారిపోవడం వల్ల మార్కెట్లో సరైన ధర లభించడం లేదన్నారు. దీంతో రైతులు తీవ్ర ఆర్థిక సంక్షోభంలోకి నెట్టబడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు. మార్కెట్ యార్డుల్లో కొనుగోళ్లు సక్రమంగా జరగకపోవడంతో రైతులు తమ పంటను విక్రయించేందుకు రోజుల తరబడి ఎదురుచూడాల్సిన పరిస్థితి నెలకొందని ఆయన తెలిపారు. కొనుగోళ్లు నిలిచిపోవడంతో గ్రామాల్లో రైతుల ఇళ్లలోనే సోయాబీన్ నిల్వలు పేరుకుపోయి, మరిన్ని నష్టాలకు దారితీస్తున్నాయని ఆయన చెప్పారు.
కేంద్ర ప్రభుత్వం చొరవ తీసుకుని నాఫెడ్ ద్వారా కొనుగోళ్లు చేపడితేనే రైతులకు మద్దతు ధర దక్కుతుందని, అది రైతులకు పెద్ద ఊరటనిస్తుందని ఆయన తెలిపారు. రైతుల సమస్యల పరిష్కారంలో రాష్ట్ర ప్రభుత్వం చిత్తశుద్ధితో పనిచేస్తోందని, కేంద్ర సహకారం అవసరమని ఈ సందర్భంగా ఆయన పేర్కొన్నారు.
ఇదే పర్యటనలో నేరడిగొండ మార్కెట్ యార్డును సందర్శించిన నాయకులు, అక్కడ రైతులు ఎదుర్కొంటున్న ఇబ్బందులను ప్రత్యక్షంగా తెలుసుకున్నారు. కొనుగోళ్లలో జాప్యం, సరైన మౌలిక వసతుల లేమి వంటి అంశాలపై రైతులు చేసిన ఫిర్యాదులను విన్నారు. రైతుల సమస్యలను దశలవారీగా పరిష్కరించేందుకు రాష్ట్ర ప్రభుత్వం కట్టుబడి ఉందని వారికి భరోసా ఇచ్చారు.
రిమ్స్లో మెరుగైన వైద్య సేవలు ప్రారంభం
తదుపరి కార్యక్రమంగా ఆదిలాబాద్ రిమ్స్ ఆస్పత్రిలో నిర్మించిన అత్యాధునిక క్రిటికల్ కేర్ యూనిట్ భవనాన్ని కేంద్ర మంత్రి కిషన్ రెడ్డితో కలిసి మంత్రి జూపల్లి కృష్ణారావు ప్రారంభించారు. ఈ క్రిటికల్ కేర్ యూనిట్ ప్రారంభంతో అత్యవసర స్థితిలో ఉన్న రోగులకు మెరుగైన ఆక్సిజన్ సదుపాయాలు, సూపర్ స్పెషాలిటీ సేవలు అందుబాటులోకి వచ్చాయని ఆయన తెలిపారు. ఇకపై అత్యవసర చికిత్స కోసం హైదరాబాద్ లేదా ఇతర పెద్ద నగరాలకు వెళ్లాల్సిన అవసరం ఉండదని తెలిపారు. ఈ యూనిట్ ఆదిలాబాద్తో పాటు పరిసర జిల్లాల ప్రజలకు ఎంతో ఉపయోగపడనుందని ఆయన అన్నారు.
ఆరోగ్య తెలంగాణే లక్ష్యం
ఆరోగ్య రంగంలో ప్రభుత్వం తీసుకుంటున్న చర్యలను మంత్రి జూపల్లి వివరిస్తూ, హైదరాబాద్లోని చారిత్రాత్మక ఉస్మానియా ఆస్పత్రిని రూ. 2,700 కోట్ల భారీ వ్యయంతో అత్యున్నత ప్రమాణాలతో పునర్నిర్మించేందుకు ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి ఇప్పటికే శంకుస్థాపన చేసిన విషయాన్ని గుర్తు చేశారు. కేవలం భవనాల నిర్మాణంతోనే కాకుండా, ఆస్పత్రుల్లో రోగులకు మెరుగైన సేవలు అందించేందుకు అవసరమైన సిబ్బంది కొరత లేకుండా చర్యలు తీసుకుంటున్నామని ఆయన తెలిపారు.
రిమ్స్ సహా రాష్ట్రవ్యాప్తంగా ఉన్న అన్ని ప్రభుత్వ ఆస్పత్రుల్లో ఖాళీగా ఉన్న వైద్యులు, నర్సులు, పారామెడికల్, ఇతర సిబ్బంది పోస్టులను యుద్ధప్రాతిపదికన భర్తీ చేయడానికి ప్రభుత్వం కృతనిశ్చయంతో ఉందన్నారు. వైద్య ఆరోగ్య రంగంలో విప్లవాత్మక మార్పులు తీసుకురావడం ద్వారా “ఆరోగ్య తెలంగాణ”ను నిర్మించడమే ప్రభుత్వ ధ్యేయమని మంత్రి జూపల్లి పేర్కొన్నారు.
