Let's talk: editor@tmv.in
సీషెలస్ అధ్యక్షుడిగా ప్యాట్రిక్ హెర్మిని విజయం

సీషెలస్ అధ్యక్షుడిగా ప్యాట్రిక్ హెర్మిని విజయం

Yekkirala Akshitha
13 అక్టోబర్, 2025

హిందూ మహాసముద్రంలోని ద్వీప దేశం సీషెలస్ అధ్యక్ష ఎన్నికల్లో డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని ఘన విజయం సాధించారు. ఈ సందర్భంగా భారత ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ ఆయనకు హృదయపూర్వక అభినందనలు తెలియజేశారు. హెర్మిని నాయకత్వంలో ఇరు దేశాల మధ్య ద్వైపాక్షిక సంబంధాలు మరింత బలోపేతం అవుతాయని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు.

ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ సోషల్ మీడియా వేదిక 'ఎక్స్'లో పోస్ట్ చేస్తూ, "సీషెలస్ అధ్యక్ష ఎన్నికల్లో విజయం సాధించిన డాక్టర్ ప్యాట్రిక్ హెర్మినికి హృదయపూర్వక అభినందనలు. హిందూ మహాసముద్ర జలాలు మన ఉమ్మడి వారసత్వం. ఇవి మన ప్రజల ఆకాంక్షలు, అవసరాలను తీరుస్తున్నాయి. మీ అధ్యక్ష పదవీకాలంలో ఇరు దేశాల మధ్య ఉన్న సంబంధాలు మరింత వేగంగా పురోగమిస్తాయని నేను విశ్వసిస్తున్నా. మీ రాబోయే పదవీకాలం విజయవంతం కావాలని కోరుకుంటున్నా" అని రాశారు.

రాజకీయ మార్పు, హెర్మిని విజయం

సీషెలస్ అధ్యక్ష ఎన్నికల్లో ప్రతిపక్ష నాయకుడైన డాక్టర్ ప్యాట్రిక్ హెర్మిని, అధికారంలో ఉన్న వేవెల్ రామ్‌కళావన్‌ను ఓడించి విజయం సాధించారు. 1977 నుండి 2020 వరకు సుదీర్ఘకాలం పాలించిన 'యూనైటెడ్ సీషెలస్' పార్టీ, నాలుగు సంవత్సరాల విరామం తర్వాత తిరిగి అధికారంలోకి వచ్చింది. ఈ విజయాన్ని సీషెలస్ రాజకీయాల్లో కీలక మార్పుగా పరిగణిస్తారు. సీషెలస్, హిందూ మహాసముద్రంలో భారతదేశానికి ఒక వ్యూహాత్మక భాగస్వామిగా ఉంది. రక్షణ, భద్రత, మౌలిక సదుపాయాల అభివృద్ధి వంటి రంగాలలో భారతదేశం సీషెలస్‌‌కు ఎల్లప్పుడూ అండగా నిలుస్తోంది.

తన విజయోత్సవ ప్రసంగంలో, హెర్మిని సీషెలస్ ప్రజలకు కృతజ్ఞతలు తెలుపుతూ, "మనమంతా కలిసి మరింత బలమైన, సుసంపన్నమైన సీషెలస్‌ను నిర్మిద్దాం" అని ప్రతిజ్ఞ చేశారు. జీవన వ్యయాన్ని తగ్గించడం, ప్రజా సేవలను పునరుద్ధరించడం, పర్యావరణ, ఆర్థిక సవాళ్లను పరిష్కరించడం వంటి అంశాలకు ఆయన ప్రాధాన్యతనిచ్చారు.

గతంలో హెర్మినిపై ఉన్న వివాదం

వైద్యం, రాజకీయాలలో సుదీర్ఘ అనుభవం ఉన్న డాక్టర్ హెర్మిని, 2023లో మంత్రవిద్య ఆరోపణలను ఎదుర్కొన్నారు. అయితే వాటిని రాజకీయ ప్రేరేపిత ఆరోపణలుగా ఆయన తోసిపుచ్చారు. సుదీర్ఘ న్యాయ ప్రక్రియ తర్వాత 2024 ఫిబ్రవరిలో విక్టోరియా పబ్లిక్ ప్రాసిక్యూటర్ కార్యాలయం హెర్మినిపై ఉన్న అన్ని ఆరోపణలను ఉపసంహరించుకోవడంతో ఆయన అధ్యక్ష ఎన్నికల్లో పోటీ చేయడానికి మార్గం సుగమమైంది.

భారత్-సీషెలస్ వ్యూహాత్మక సంబంధాలు

హిందూ మహాసముద్రంలో 115 ద్వీపాలతో కూడిన సీషెలస్, 1976లో యునైటెడ్ కింగ్‌డమ్ నుండి స్వాతంత్య్రం పొందింది. అప్పటి నుండి భారత్, సీషెలస్ మధ్య దృఢమైన సముద్ర, భద్రతా సంబంధాలు ఏర్పడ్డాయి. మరోవైపు, మౌలిక సదుపాయాల ప్రాజెక్టుల ద్వారా చైనా కూడా ఇక్కడ ఒక ప్రధాన ఆర్థిక భాగస్వామిగా ఉంది.

చారిత్రకంగా భారతదేశానికి స్నేహపూర్వక పార్టీగా పేరొందిన 'యూనైటెడ్ సీషెలస్'కు నాయకత్వం వహిస్తున్న హెర్మిని పాలనలో, సీషెలస్ హిందూ మహా సముద్ర ప్రాంతంలో తటస్థ విధానాన్ని కొనసాగిస్తూనే, భారతదేశంతో వ్యూహాత్మక సహకారాన్ని బలోపేతం చేస్తుందని విశ్లేషకులు అంచనా వేస్తున్నారు. సీషెలస్ స్వాతంత్య్రం పొందిన వెంటనే ఇరు దేశాలు దౌత్య సంబంధాలను ఏర్పరచుకున్నాయి. భారతదేశం తన దౌత్య కార్యాలయాన్ని 1979లో విక్టోరియాలో స్థాపించింది. అయితే ప్రారంభంలో హై కమిషనర్ దార్-ఎస్-సలాంలో ఉంటూ, అదనంగా సీషెలస్‌కు కూడా బాధ్యతలు నిర్వహించేవారు. మొదటి రెసిడెంట్ హై కమిషనర్‌ను 1987లో నియమించారు. కాగా సీషెలస్‌ తన దౌత్య కార్యాలయాన్ని న్యూఢిల్లీలో 2008లో ప్రారంభించింది.

సీషెలస్ అధ్యక్షుడిగా ప్యాట్రిక్ హెర్మిని విజయం - Tholi Paluku