
సీఎం అభ్యర్థిగా విజయ్కు మద్దతు పెరుగుతోంది: సెంగొట్టియన్
తమిళనాడులో ప్రముఖ నటుడు-రాజకీయ నాయకుడు విజయ్ ముఖ్యమంత్రిగా ఎదగాలని ప్రజల్లో మద్దతు పెరుగుతోందని తమిళగా వెట్రి కళగం (టీవీకే) కార్యనిర్వాహక కమిటీ ప్రధాన సమన్వయకర్త సెంగొట్టియన్ తెలిపారు. ప్రజల కోసం సేవ చేయాలనే లక్ష్యంతో విజయ్ సినీ రంగాన్ని విడిచిపెట్టిన నిర్ణయం ఓటర్లలో మంచి స్పందన తెచ్చిందని ఆయన పేర్కొన్నారు. కోయంబత్తూరు నుంచి చెన్నైకి వచ్చిన అనంతరం విమానాశ్రయంలో మీడియాతో మాట్లాడిన సెంగొట్టియన్, ఎన్నికల ప్రవర్తనా నియమావళి సహా అన్ని నిబంధనలను టీవీకే కచ్చితంగా పాటిస్తుందని చెప్పారు. ఎన్నికల నియమావళి అన్ని రాజకీయ పార్టీలకు సమానంగా వర్తిస్తుంది. ఎన్నికల నిబంధనలతో పాటు ప్రభుత్వ చట్టాలను కూడా మా పార్టీ పూర్తిగా పాటిస్తోంది. విజయ్ నాయకత్వంలో జరుగుతున్న అన్ని కార్యకలాపాలు ఈ నియమాల ప్రకారమే సాగుతున్నాయని ఆయన తెలిపారు.
ఇటీవల విజయ్ నిర్వహించిన బహిరంగ సభ సందర్భంగా కొన్ని పరిమితులు విధించిన విషయాన్ని ప్రస్తావిస్తూ, అవి ప్రత్యేకంగా టీవీకే నేతపైనే అమలు చేసినట్లుగా అనిపించిందని సెంగొట్టియన్ వ్యాఖ్యానించారు. ‘ఒక్క విజయ్కే 51 ఆంక్షలు విధించినట్టుగా కనిపించింది. ఇతర రాజకీయ పార్టీలు కూడా అదే ఎన్నికల నిబంధనలు పాటిస్తున్నాయా అనే ప్రశ్న ప్రజల్లో వస్తోందని అన్నారు. తమిళనాడు ప్రజల్లో విజయ్ ముఖ్యమంత్రిగా రావాలని ఆశాభావం పెరుగుతోందని, అది త్వరలో ఎన్నికల ఫలితాల్లో కూడా ప్రతిఫలిస్తుందని ఆయన విశ్వాసం వ్యక్తం చేశారు. అలాగే రాజకీయ కూటములపై టీవీకే నాయకులు చేసే వ్యాఖ్యలు వ్యక్తిగత అభిప్రాయాలేనని చెప్పారు. కూటముల ఏర్పాటు అనేది పార్టీ అధినేత తీసుకునే వ్యూహాత్మక నిర్ణయమని స్పష్టం చేశారు.
ఇదిలా ఉండగా భారత ఎన్నికల సంఘం ఇటీవల ఐదు రాష్ట్రాలు మరియు ఒక కేంద్రపాలిత ప్రాంతంలో అసెంబ్లీ ఎన్నికల షెడ్యూల్ ప్రకటించింది. ఇందులో తమిళనాడులో ఏప్రిల్ 23న ఒకే దశలో పోలింగ్ జరగనుండగా, మే 4న ఓట్ల లెక్కింపు చేపట్టనున్నారు. షెడ్యూల్ ప్రకటించిన వెంటనే రాష్ట్రవ్యాప్తంగా ఎన్నికల ప్రవర్తనా నియమావళి అమల్లోకి వచ్చింది. దీంతో అన్ని రాజకీయ పార్టీలు ఎన్నికల సన్నాహాలను వేగవంతం చేశాయి.
