Let's talk: editor@tmv.in
సిటీ పోలీసులకు ‘ఎక్స్‌ట్రా మైల్’ అవార్డులు అందజేసిన వి.సి. సజ్జనార్

సిటీ పోలీసులకు ‘ఎక్స్‌ట్రా మైల్’ అవార్డులు అందజేసిన వి.సి. సజ్జనార్

Gaddamidi Naveen
9 ఫిబ్రవరి, 2026

విధి నిర్వహణలో అసాధారణ ప్రతిభ కనబరిచిన పోలీసులను ప్రోత్సహించేందుకు నగర పోలీస్ కమిషనరేట్ వినూత్న కార్యక్రమానికి శ్రీకారం చుట్టింది. ఆదివారం బంజారాహిల్స్‌లోని తెలంగాణ స్టేట్ ఇంటిగ్రేటెడ్ కమాండ్ అండ్ కంట్రోల్ సెంటర్ వేదికగా జరిగిన కార్యక్రమంలో, సిటీ పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, ఐపీఎస్ మొత్తం 1,446 మంది పోలీస్ సిబ్బందికి అవార్డులు, రివార్డులను అందజేశారు. నగర పోలీస్ చరిత్రలో మొదటిసారిగా ప్రవేశపెట్టిన ‘ఎక్స్‌ట్రా మైల్’ అవార్డులతో పాటు, ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులను కమిషనర్ చేతుల మీదుగా సిబ్బంది అందుకున్నారు.

సమావేశంలో మాట్లాడిన పోలీస్ కమిషనర్ వి.సి. సజ్జనార్, పోలీసింగ్ అనేది కేవలం ఉద్యోగం కాదని, అది ఒక సామాజిక బాధ్యత అని అన్నారు. విధి నిర్వహణలో భాగంగా మాత్రమే కాకుండా ప్రజల సమస్యలను అర్థం చేసుకుని, బాధితులకు ధైర్యం నింపే విధంగా వ్యవహరించాలని ఆయన పోలీసు సిబ్బందికి సూచించారు. బాధ్యత, పారదర్శకత, నవీన ఆలోచనలు మానవీయ దృక్పథం పోలీసింగ్‌లో అత్యంత కీలకమని ఆయన పేర్కొన్నారు.

ఒక పనిని పూర్తి చేయడమే విజయానికి ప్రమాణం కాదని, ఆ పని ద్వారా ప్రజల్లో విశ్వాసం పెరగడం ముఖ్యమని కమిషనర్ అన్నారు. విధి పరిమితులను దాటి సమాజానికి సేవ చేసినప్పుడు పోలీస్ వ్యవస్థపై ప్రజల నమ్మకం మరింత బలపడుతుందని ఆయన అభిప్రాయపడ్డారు.

‘ఎక్స్‌ట్రా మైల్’ అవార్డు లక్ష్యాన్ని వివరిస్తూ, తమ కేటాయించిన బాధ్యతలకు మించి విశేష ప్రతిభ చూపించిన సిబ్బందిని గుర్తించి ప్రోత్సహించడమే ఈ కార్యక్రమం ఉద్దేశమని తెలిపారు. ఈ గుర్తింపు ద్వారా పోలీస్ సిబ్బందిలో ఉత్తేజం పెరిగి, మరింత నిబద్ధతతో పనిచేయడానికి ప్రేరణ లభిస్తుందని ఆయన అన్నారు. సాంకేతిక పరిజ్ఞానం ఎంత అభివృద్ధి చెందినా, నిజాయితీ, నిబద్ధత, కరుణ వంటి మానవ విలువలకు ప్రత్యామ్నాయం లేదని సజ్జనార్ స్పష్టం చేశారు. నగరంలో శాంతిభద్రతలను కాపాడడంలో హోం గార్డుల నుంచి ఉన్నతాధికారుల వరకు ప్రతి ఒక్కరి పాత్ర కీలకమని ఆయన ప్రశంసించారు.

ఇకపై ఈ గుర్తింపు ప్రక్రియను నిరంతరంగా కొనసాగిస్తామని, ప్రతి నెల జోనల్ స్థాయిలో ఎస్హెచ్ఓలు, ఎస్సైలు, కానిస్టేబుళ్లకు విశిష్ట సేవల ఆధారంగా అవార్డులు అందజేయనున్నట్లు కమిషనర్ ప్రకటించారు. గత ఆర్థిక సంవత్సరంలోని రెండో, మూడో, నాలుగో త్రైమాసికాల్లో చేసిన పనితీరును ఆధారంగా చేసుకుని ఈ అవార్డులను ఖరారు చేశారు. మొత్తం 271 మంది సిబ్బందికి ‘ఎక్స్‌ట్రా మైల్’ అవార్డులు, 1,175 మందికి ‘గుడ్ వర్క్ డన్’ రివార్డులు ప్రదానం చేశారు.

అవార్డు గ్రహీతల్లో అదనపు డీసీపీలు, ఏసీపీలు, ఇన్‌స్పెక్టర్లు, ఎస్సైలు, ఏఎస్సైలు, హెడ్ కానిస్టేబుళ్లు, కానిస్టేబుళ్లు, హోం గార్డులు, మినిస్టీరియల్ సిబ్బంది, పబ్లిక్ ప్రాసిక్యూటర్లు ఉన్నారు. ఈ కార్యక్రమంలో అదనపు పోలీస్ కమిషనర్ ఎం. శ్రీనివాసులు, ఐపీఎస్; జాయింట్ కమిషనర్ శ్వేత, ఐపీఎస్ తదితర ఉన్నతాధికారులు పాల్గొన్నారు. పోలీస్ సిబ్బందిలో సేవాభావాన్ని ప్రోత్సహించే ఈ కార్యక్రమం నగర పోలీస్ విభాగంలో కొత్త దిశను సూచిస్తున్నదని అధికారులు పేర్కొన్నారు.