
సింగర్ జూబిన్ కేసులో కీలక మలుపు
జుబిన్ గార్గ్ మరణానికి సంబంధించిన కేసులో కీలక సంఘటన చోటుచేసుకుంది. బుధవారం సింగపూర్లోని నార్త్ ఈస్ట్ మ్యూజిక్ ఫెస్టివల్ నిర్వాహకుడు శ్యామ్ కాను మహంత, జుబిన్ మేనేజర్ సిద్దార్థ శర్మలను పోలీసులు అరెస్ట్ చేశారు. దీనిపై జుబిన్ సోదరి పామ్ బోర్తాకూర్ స్పందించారు. ప్రజలు వ్యవస్థను విశ్వసించాలని, తమకు న్యాయం జరుగుతుందని, కేసుకు సంబంధించి పూర్తిగా పోలీసులకు సహకరిస్తామని తెలిపారు. వీరిద్దరి అరెస్ట్ తరువాత పోలీసులు, ప్రభుత్వంపై నమ్మకం పెరిగిందన్నారు. అందువల్ల ప్రజలు వ్యవస్థలను విశ్వసించాలని, ఆశలను వదులుకోవద్దని ప్రజలకు విజ్ఞప్తి చేశారు. వీరి అరెస్ట్ తరువాత కామరూప్ చీఫ్ జ్యూడిషియల్ మేజిస్ట్రేట్ ముందు హజరుపరిచారు. కోర్టు 14 రోజుల రిమాండ్ కు తరలించింది. దీంతో గౌహతిలోని సీఐడీ కార్యాలయం వద్ద భారీగా భద్రత సిబ్బందిని మోహరించారు.
సీఎం ఆదేశాలు
ప్రముఖ అస్సామీ సంగీత దిగ్గజం జుబిన్ గార్గ్ సెప్టెంబర్ 19న సింగపూర్లో స్కూబా డైవింగ్ చేస్తూ ప్రమాదంలో మరణించారు. ఆయన భౌతికకాయాన్ని మొదట ఢిల్లీకి, తర్వాత సెప్టెంబర్ 21న గౌహతికి తరలించారు. అయితే ఆయన మరణంలో ఎన్నో అనుమానాలు నెలకొన్నాయి. దీంతో అస్సాం ముఖ్యమంత్రి హిమంతబిశ్వ శర్మ ప్రత్యేక పోలీసు బృందాన్ని ఏర్పాటు చేశారు. నిందితులను అక్టోబర్ 6 లోగా సిఐడి ముందు లొంగిపోవాలని కోరారు. ఆ తర్వాత చట్టపరంగా కఠినమైన చర్యలు తీసుకుంటామని హెచ్చరించారు. అస్సామీ నటి నిషితా గోస్వామి జుబీన్ గార్గ్ సహ-సంగీతకారుడు శేఖర్ జ్యోతి గోస్వామి సెప్టెంబర్ 27న మరణంపై దర్యాప్తునకు సంబంధించి అస్సాం పోలీసుల క్రైమ్ ఇన్వెస్టిగేషన్ డిపార్ట్మెంట్ ముందు హాజరయ్యారు. వీరిపై బీఎన్ఎస్ ప్రకారం కేసులు నమోదు చేశారు. దీంతో గాయకుడి మరణం కేసులో అస్సాం పోలీసులు శ్యామ్కాను, సిద్ధార్థ శర్మలను బుధవారం ఉదయం అరెస్టు చేశారు.
