
సర్ ఆందోళనతో బెంగాల్లో ఆత్మహత్యల కలకలం: మమతా బెనర్జీ తీవ్ర ఆరోపణలు
పశ్చిమ బెంగాల్ రాజకీయాల్లో సర్ ( ప్రత్యేక సమగ్ర సవరణ) వ్యవహారం పెను దుమారం రేపుతోంది. రాష్ట్రంలో ఓటర్ల జాబితా సవరణ ప్రక్రియ పట్ల నెలకొన్న ఆందోళన కారణంగా ప్రతిరోజూ ముగ్గురు నుండి నలుగురు వ్యక్తులు ఆత్మహత్య చేసుకుంటున్నారని ముఖ్యమంత్రి మమతా బెనర్జీ సంచలన వ్యాఖ్యలు చేశారు. నేతాజీ సుభాష్ చంద్రబోస్ 129వ జయంతిని పురస్కరించుకుని కోల్కతాలోని రెడ్ రోడ్లో నిర్వహించిన అధికారిక కార్యక్రమంలో ఆమె పాల్గొన్నారు. ఈ సందర్భంగా కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘం తీరుపై ఆమె నిప్పులు చెరిగారు.
మరణాలకు కేంద్రమే బాధ్యత వహించాలి
ఓటర్ల జాబితా సవరణ పేరుతో ప్రజలను తీవ్ర భయాందోళనలకు గురి చేస్తున్నారని మమతా బెనర్జీ మండిపడ్డారు. "సర్ ప్రక్రియ ప్రారంభమైనప్పటి నుండి రాష్ట్రంలో ఇప్పటివరకు 110 మందికి పైగా ప్రాణాలు కోల్పోయారు. నిత్యం సగటున 3 నుండి 4 మంది ఆత్మహత్యలకు పాల్పడుతున్నారు. మరో 45 మంది ఆసుపత్రుల్లో చావుబతుకుల మధ్య పోరాడుతున్నారు. ఈ మరణాలకు కేంద్ర ప్రభుత్వం, ఎన్నికల సంఘమే పూర్తి బాధ్యత వహించాలి" అని ఆమె డిమాండ్ చేశారు. స్వతంత్ర భారత దేశంలో ఇన్ని ఏళ్ల తర్వాత కూడా తాము ఈ దేశ పౌరులమేనని ప్రజలు నిరూపించుకోవాల్సిన పరిస్థితి రావడం దురదృష్టకరమని ఆమె ఆవేదన వ్యక్తం చేశారు.
నోటీసుల వెనుక కుట్ర?
రాష్ట్రవ్యాప్తంగా దాదాపు 1.38 కోట్ల మందికి 'తార్కిక వ్యత్యాసాల' పేరుతో నోటీసులు పంపడంపై ఆమె ఆగ్రహం వ్యక్తం చేశారు. బెంగాలీ సంస్కృతిలో ఇంటిపేర్లను (ఉదాహరణకు బెనర్జీ, బందోపాధ్యాయ్) వివిధ రకాలుగా రాయడం సహజమని, కానీ అధికారులు వీటినే తప్పులుగా పరిగణించి వేధిస్తున్నారని ఆరోపించారు. నోబెల్ గ్రహీత అమర్త్యసేన్ వంటి మహనీయులకు కూడా నోటీసులు పంపడాన్ని ఆమె తీవ్రంగా తప్పుబట్టారు. ఇప్పటికే 58 లక్షల మంది పేర్లు ముసాయిదా జాబితా నుండి తొలగించబడ్డాయని, ఇది బెంగాల్ ఓటర్లను అణచివేసేందుకు చేస్తున్న కుట్రని ఆమె పేర్కొన్నారు.
నేతాజీ వారసత్వంపై దాడి
నేతాజీ జయంతి రోజున మమతా బెనర్జీ మాట్లాడుతూ, కేంద్ర ప్రభుత్వం దేశ చరిత్రను వక్రీకరిస్తోందని మమత ఆరోపించారు. నేతాజీ ఆలోచనల నుంచి పుట్టిన 'ప్లానింగ్ కమిషన్'ను రద్దు చేసి, అర్థం లేని 'నీతి ఆయోగ్'ను తీసుకువచ్చారని ఎద్దేవా చేశారు. నేతాజీ పుట్టినరోజును నేటికీ జాతీయ సెలవుదినంగా ప్రకటించకపోవడం ఆయనను అవమానించడమేనని అన్నారు. "ఒకవేళ నేతాజీ ఈరోజు జీవించి ఉండి ఉంటే, ఆయనకు కూడా సర్ నోటీసు ఇచ్చి పౌరసత్వాన్ని నిరూపించుకోమనేవారేమో" అంటూ వ్యంగ్యాస్త్రాలు సంధించారు.
మానవత్వం కోసం 'ఢిల్లీ చలో* *'
బీజేపీ బెంగాల్ సంస్కృతిని, భాషను అవమానిస్తోందని మమత విమర్శించారు. ఎన్నికల సమయంలో టెలిప్రాంప్టర్లు చూసి బెంగాలీ మాట్లాడే నాయకులు, ఇక్కడి మేధావులను గౌరవించడం లేదని అన్నారు. ప్రస్తుతం జరుగుతున్న పోరాటాన్ని మహాభారతంలోని 'పాండవ-కౌరవ' యుద్ధంతో పోలుస్తూ, తాము అధర్మానికి వ్యతిరేకంగా పోరాడుతున్నామని చెప్పారు. నేతాజీ ఇచ్చిన 'ఢిల్లీ చలో' నినాదాన్ని స్మరించుకుంటూ.. దేశంలో మానవత్వాన్ని, ప్రజాస్వామ్యాన్ని కాపాడుకోవడానికి మరోసారి పోరాటానికి సిద్ధం కావాలని ఆమె పిలుపునిచ్చారు.
