
సర్దార్ వల్లభభాయ్ పటేల్ జయంతిని ఘనంగా నిర్వహిస్తాం: యూపీ
బీజేపీ నేతృత్వంలో భారత ఐక్యతకు ప్రతీకగా పేరుపొందిన ఉక్కు మనిషి సర్దార్ వల్లభభాయ్ పటేల్ 150వ జయంతిని పురస్కరించుకుని అక్టోబర్ 31న ఘనంగా వేడుకలు నిర్వహించనున్నారు. ఈ సందర్భంగా రాష్ట్ర వ్యాప్తంగా ‘రన్ ఫర్ యూనిటీ’ అనే కార్యక్రమాలు నిర్వహించడానికి ప్రభుత్వం ఏర్పాట్లు చేస్తోంది. ఉత్తర ప్రదేశ్ పట్టణాభివృద్ధి, విద్యుత్ శాఖ మంత్రి ఏ.కే. శర్మ మాట్లాడుతూ సర్దార్ పటేల్ దూరదృష్టి, అచంచలమైన సంకల్పం వల్లే బ్రిటీషర్లు విభజించాలనుకున్న 563 దేశీయ రాజ్యాలు భారత్లో కలిసిపోయాయని గుర్తు చేశారు. నేటి అఖండ భారత్ ఆయన కృషి ఫలితమేనని చెప్పారు.ప్రధాన మంత్రి నరేంద్ర మోదీ నాయకత్వంలో 11 ఏళ్లుగా అక్టోబర్ 31ను జాతీయ ఐక్యత దినంగా జరుపుకుంటున్నారని శర్మ వివరించారు.‘ఏక భారత్, శ్రేష్ఠ భారత్’ అనే సర్దార్ పటేల్ స్వప్నాన్ని నిజం చేయడమే తమ లక్ష్యమని ఈ సందర్భంగా వివరించారు.
కార్యక్రమ వివరాలు
• అక్టోబర్ 31న రాష్ట్రంలోని ప్రతి జిల్లాలో సర్దార్ పటేల్ విగ్రహం వద్ద ‘రన్ ఫర్ యూనిటీ’ నిర్వహిస్తాం.
• నవంబర్ 1 నుంచి 26 వరకు ప్రతి నియోజకవర్గంలో 8 నుంచి 10 కిలోమీటర్ల ‘ఏకతా పాదయాత్ర’ చేపడతారు.
• మాజీ సైనికులు, రైతులు, కార్మికులు, యువమోర్చా సభ్యులు, ఎన్ఎస్ఎస్, ఎన్ సీసీ, స్కౌట్ గైడ్లు మొదలైనవారు పాల్గొంటారు.
• ప్రతి రెండు కిలోమీటర్లకు ఒకసారి దారిలో వచ్చే గ్రామ ప్రజలతో మాట్లాడి ఐక్యత సందేశాన్ని తెలుపుతాం.
• ప్రతి జిల్లాకు చెందిన ఐదుగురు ప్రతినిధులు గుజరాత్లోని కరంసాద్ (సర్దార్ పటేల్ జన్మస్థలం) వద్ద ప్రారంభమయ్యే జాతీయ పాదయాత్రలో పాల్గొంటారు.
• యువమోర్చా నాయకులతో పాటు స్థానిక యువ ప్రతిభావంతులు కూడా ఇందులో పాల్గొంటారు.
• ఈ పాదయాత్ర కరంసాద్ నుంచి స్టాట్యూ ఆఫ్ యూనిటీ వరకు 150 కిమీ దూరం ఉంటుంది.
ఇతర కార్యక్రమాలు
పాఠశాలలు, వ్యాసరచన, ప్రసంగం, రంగోలి, పెయింటింగ్ పోటీలు. ప్రతి బూత్ స్థాయిలో సర్దార్ పటేల్ చిత్రపటానికి నివాళి అర్పిస్తారు.
