
సీబీఎస్ఈ 10, 12వ తరగతి పరీక్ష తేదీలొచ్చేశాయ్
//cbse.gov.inలో ఈ షెడ్యూల్ అందుబాటులో ఉంది. ఈ షెడ్యూల్ ప్రకారం పరీక్షలు ఫిబ్రవరి 17 నుంచి ప్రారంభమవుతాయి.
వచ్చే ఏడాది నుంచి పదో తరగతి పరీక్షలు ఏడాదికి రెండుసార్లు నిర్వహిస్తామని గతంలోనే ప్రకటించిన సీబీఎస్ఈ అందుకనుగుణంగానే తాత్కాలిక డేట్షీట్లను రూపొందించింది. పదో తరగతి పరీక్షలను తొలి విడతలో ఫిబ్రవరి 17 నుంచి మార్చి 6 వరకు, రెండో విడతలో మే 15 నుంచి జూన్ 1 వరకు నిర్వహించనున్నట్లు సీబీఎస్ఈ వెల్లడించింది. మరోవైపు సీబీఎస్ఈ 12వ తరగతి పరీక్షలు ఫిబ్రవరి 17న ప్రారంభమై ఏప్రిల్ 9 వరకు జరగనున్నట్లు బోర్డు పేర్కొంది. సీబీఎస్ఈ అంచనా ప్రకారం, భారతదేశం, విదేశాలలో ఉన్న 26 దేశాల నుండి దాదాపు 45 లక్షల మంది విద్యార్థులు 204 సబ్జెక్టులలో ఈ బోర్డు పరీక్షలకు హాజరుకానున్నారు.
పరీక్ష ముగిసిన తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం వేగంగా ప్రారంభించడానికి బోర్డు ప్రణాళికలు రూపొందించింది. ప్రతి సబ్జెక్టు పరీక్ష అనంతరం దాదాపు పది రోజుల తర్వాత సమాధాన పత్రాల మూల్యాంకనం ప్రారంభమై.. 12 రోజుల్లో పూర్తవుతుందని పేర్కొంది. ఉదాహరణకు, 12వ తరగతి ఫిజిక్స్ పరీక్ష ఫిబ్రవరి 20న జరిగితే, మూల్యాంకనం మార్చి 3న ప్రారంభమై మార్చి 15 నాటికి ముగుస్తుంది. అయితే సీబీఎస్ఈ విడుదల చేసిన ఈ తేదీలు తాత్కాలికమైనవి మాత్రమే. పాఠశాలలు తుది విద్యార్థుల జాబితాను సమర్పించిన తర్వాతే ఫైనల్ డేట్షీట్లను విడుదల చేయనున్నట్లు బోర్డు స్పష్టం చేసింది.
