
సుందర నగరంగా అమరావతి
ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు నాయకత్వంలో అమరావతి రాజధాని దేశంలోనే అత్యంత అందమైన నగరంగా మారనుందని విజయవాడ ఎంపీ కేశినేని శివనాథ్ తెలిపారు. నగరంలోని ఎ కన్వెన్షన్ సెంటర్లో నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షోను శుక్రవారం ఎంపీ కేశినేని శినవాథ్, ఎమ్మెల్యే గద్దె రామ్మోహన్ ప్రారంభించారు. అనంతరం జ్యోతి ప్రజ్వలన చేశారు. మూడు రోజుల పాటు ఈ ప్రాపర్టీ షో జరగనుంది. ఈ ప్రాపర్టీ షోలో ఏర్పాటు చేసిన స్టాల్స్ను సందర్శించారు. అలాగే కొన్ని స్టాల్స్ను ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి విచ్చేసిన ఎంపీ కేశినేని శివనాథ్ను నిర్వహకులు ఘనంగా సత్కరించారు.
ఈ సందర్భంగా ఎంపీ కేశినేని శివనాథ్ మాట్లాడుతూ నారెడ్కో ఆధ్వర్యంలో అమరావతి ప్రాపర్టీ షో నిర్వహించడం సంతోషకరమని, సొంతింటి కలను సాకారం చేసుకోవాలనుకునే వారికి ఇది ఒక అద్భుతమైన వేదికగా ఉపయోగపడుతుందని పేర్కొన్నారు. అమరావతి నగరం భవిష్యత్తులో భారతదేశంలోనే అత్యంత అందమైన నగరంగా మారబోతోందని, ఈ ప్రాంతంలో పెట్టుబడులు పెట్టడం వలన పెట్టుబడిదారులకు మంచి భవిష్యత్తు లభిస్తుందని విశ్వాసం వ్యక్తం చేశారు.
రియల్ రంగానికి కూటమి అండ
రియల్ ఎస్టేట్ రంగానికి కూటమి ప్రభుత్వం ఎల్లప్పుడూ అండగా ఉంటుందని, ఇప్పటికే నాలా చట్టంలో బిల్డర్లకు సౌలభ్యం కల్పించేలా మార్పులు చేశామని గుర్తుచేశారు. రియల్ ఎస్టేట్ రంగం వేలాదిమందికి ఉపాధి కల్పించడమే కాకుండా దేశ జీడీపీలో కీలక పాత్ర పోషిస్తుందని ఆయన చెప్పారు. ఈ రంగానికి సంబంధించి ఏవైనా సమస్యలు వస్తే అవి ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లి పరిష్కరించేందుకు తాను ఎల్లప్పుడూ కృషి చేస్తానని ఎంపీ కేశినేని శివనాథ్ భరోసా ఇచ్చారు.
ఇంటి కల నెరవేర్చుకోండి
అమరావతి ప్రాపర్టీ షోలో నగర భవిష్యత్ రూపురేఖలు ప్రతిబింబించబడ్డాయని, సొంత ఇంటి కల నెరవేర్చుకోవాలనుకునే వారికి ఈ ప్రాపర్టీ షో ఒక గొప్ప అవకాశమని ఎంపీ కేశినేని శివనాథ్ పేర్కొన్నారు. నగర వాసులు తప్పక ప్రాపర్టీ షోను సందర్శించి, సద్వినియోగం చేసుకోవాలని పిలుపునిచ్చారు.
ఈ కార్యక్రమంలో నార్కెడో ఏపీ ప్రెసిడెంట్ గద్దె చక్రథర్, నారెడ్కో ఎగ్జిక్యూటివ్ వైస్ ప్రెసిడెంట్ పరుచూరి కిరణ్, నారెడ్కో ఏపీ సెక్రటరీ మామిడి సీతారామయ్య, నారెడ్కో సెంట్రల్ జోన్ ప్రెసిడెంట్ సందీప్ మండవ, సెక్రటరీ ఎస్.వి.రమణ, కోశాధికారి పి.వి.కృష్ణ, ఆర్గనైజింగ్ సెక్రటరీ వి.వంశీ కృష్ణ, ఎగ్జిక్యూటివ్ సెక్రటరీ జి.హరి ప్రసాద్ రెడ్డి లతో పాటు తదితరులు పాల్గొన్నారు.
