
సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి వేడుకలు: గిరిజన వేషధరణలో జగిత్యాల కలెక్టర్
జగిత్యాల జిల్లా గిరిజన సంక్షేమ శాఖ ఆధ్వర్యంలో జిల్లా సమీకృత కార్యాలయ సముదాయంలో గిరిజనుల ఆధ్యాత్మిక ఆరాధ్య గురువు సంత్ శ్రీ సేవాలాల్ మహారాజ్ 287వ జయంతి ఉత్సవాలను శుక్రవారం ఘనంగా నిర్వహించారు.ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథిగా జిల్లా కలెక్టర్ బి. సత్య ప్రసాద్ హాజరై వేడుకలను ప్రారంభించారు.
ఈ సందర్భంగా కలెక్టర్ మాట్లాడుతూ, సేవాలాల్ మహారాజ్ బోధనలు గిరిజన సమాజానికి నైతిక విలువలు, మంచి సంస్కృతి, సాంప్రదాయాల పరిరక్షణకు మార్గదర్శకంగా నిలిచాయని పేర్కొన్నారు. చెడు అలవాట్లను విడిచిపెట్టి, మంచి అలవాట్లను అలవర్చుకోవాలని, ఉన్నతమైన జీవన విధానాన్ని ఆచరించాలని ఆయన సూచించారు. 287 సంవత్సరాల తరువాత కూడా వారి జయంతిని ఘనంగా జరుపుకోవడం, వారి ఆలోచనలు, సందేశాలు గిరిజన తెగలకు ఇప్పటికీ స్ఫూర్తినిస్తోన్నదానికి నిదర్శనమని తెలిపారు. సమాజం సేవాలాల్ మహారాజ్ చూపిన మార్గంలో ముందుకు సాగాలని ఆయన ఆకాంక్షించారు.
ఈ కార్యక్రమంలో భాగంగా గిరిజన చిన్నారులు సాంప్రదాయ వేషధారణలో నృత్య ప్రదర్శనలు ఇచ్చి అందరినీ ఆకట్టుకున్నారు. జిల్లా కలెక్టర్ కూడా గిరిజన సాంప్రదాయ దుస్తులు ధరించి చిన్నారుల ప్రదర్శనలను అభినందించడం విశేషంగా నిలిచింది. కళాకారుల పాటలు, సాంస్కృతిక కార్యక్రమాలు వేడుకలకు ప్రత్యేక ఆకర్షణగా మారాయి.
