
‘సంఘటన్’ను మాత్రమే ప్రశంసించాను: దిగ్విజయ్ సింగ్
సంఘ్ (ఆర్ఎస్ఎస్) సంఘటనా శక్తిని ప్రశంసించారనే విమర్శల నేపథ్యంలో కాంగ్రెస్ సీనియర్ నాయకుడు దిగ్విజయ్ సింగ్ శనివారం స్పష్టీకరణ ఇచ్చారు. తాను ప్రశంసించింది సంఘటనా వ్యవస్థను (కలిసికట్టుగా పని చేసే సమూహాం) మాత్రమేనని, ఆర్ఎస్ఎస్ ను లేదా ప్రధాని నరేంద్ర మోడీని కాదని ఆయన తేల్చి చెప్పారు. ఆర్ఎస్ఎస్ కు, మోడీకి తాను గతంలోనూ వ్యతిరేకమేనని, భవిష్యత్తులో కూడా అలాగే కొనసాగుతానని స్పష్టం చేశారు. తన సోషల్ మీడియా పోస్ట్ను కొందరు తప్పుగా అర్థం చేసుకున్నారని దిగ్విజయ్ సింగ్ అన్నారు. నేను సంఘటనా శక్తిని మాత్రమే ప్రశంసించాను. ఆర్ఎస్ఎస్ కీ, మోడీజీ కీ నేను వ్యతిరేకిని. నేను ఎప్పుడూ ఆర్ఎస్ఎస్, మోడీకి వ్యతిరేకంగానే ఉన్నాను, అలాగే ఉంటాను. ఒక సంస్థను బలోపేతం చేయడాన్ని ప్రశంసించడం తప్పేనా? అని ఆయన వ్యాఖ్యానించారు.
ఫోటో షేర్ చేయడంతోనే
ఈ వివాదానికి కారణం దిగ్విజయ్ సింగ్ సోషల్ మీడియా వేదిక ఎక్స్ లో పంచుకున్న ఒక పాత ఫోటో. ఆ ఫోటోలో 1990ల కాలానికి చెందిన దృశ్యం ఉంది. గుజరాత్లో జరిగిన ఒక కార్యక్రమంలో అప్పటి బీజేపీ సీనియర్ నేత ఎల్.కె. అద్వానీ సమీపంలో, నేలపై కూర్చున్న యువ నరేంద్ర మోడీ కనిపిస్తారు. ఈ ఫోటోను తాను క్వోరా వెబ్సైట్లో చూసినట్టు దిగ్విజయ్ సింగ్ పేర్కొన్నారు.
ఆ ఫోటోపై స్పందిస్తూ ఆయన ఇలా రాశారు
ఆర్ఎస్ఎస్ కు చెందిన ఒక గ్రాస్రూట్ స్వయంసేవక్, జనసంఘ్ కార్యకర్త ఎలా రాష్ట్ర ముఖ్యమంత్రిగా, చివరకు దేశ ప్రధాని స్థాయికి ఎదిగాడు? ఇది సంస్థాగత శక్తి ఫలితం. ఇదే సంఘటన్ పవర్. ఈ పోస్టులో ఆయన కాంగ్రెస్ అధ్యక్షుడు మల్లికార్జున ఖర్గే, ఎంపీలు రాహుల్ గాంధీ, ప్రియాంక గాంధీ వాద్రా, జైరాం రమేష్, అలాగే ప్రధాని మోడీని కూడా ట్యాగ్ చేయడం రాజకీయంగా మరింత చర్చకు దారి తీసింది.
కాంగ్రెస్ పై బీజేపీ విమర్శలు
దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలను అవకాశంగా తీసుకున్న బీజేపీ, కాంగ్రెస్పై తీవ్ర విమర్శలు గుప్పించింది. బీజేపీ జాతీయ ప్రతినిధి సీఆర్ కేశవన్ మాట్లాడుతూ, దిగ్విజయ్ సింగ్ వ్యాఖ్యలు కాంగ్రెస్ పార్టీ అంతర్గత వ్యవస్థ ఎంత అధికారవాదంతో నడుస్తుందో బయటపెట్టాయని అన్నారు. దిగ్విజయ్ సింగ్ చేసిన ఈ ట్వీట్ కాంగ్రెస్ పార్టీలోని నిజాలను బయటపెట్టింది. పార్టీని ఒక కుటుంబం నియంతృత్వంగా నడుపుతోందని ఇది స్పష్టం చేస్తోంది. దీనిపై రాహుల్ గాంధీ స్పందిస్తారా? అని కేశవన్ ప్రశ్నించారు. గమనించదగ్గ విషయం ఏమిటంటే, ఈ నెల ప్రారంభంలోనే దిగ్విజయ్ సింగ్ కాంగ్రెస్ పార్టీ కేంద్రీకృత వ్యవస్థను తగ్గించి,
‘వికేంద్రీకృత, ప్రాగ్మాటిక్ పాలన విధానం’ అవలంబించాలని పార్టీ నాయకత్వానికి సూచించారు.
