Let's talk: editor@tmv.in
సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి: సీఎం రేవంత్ రెడ్డి

సంక్షేమ పథకాల లబ్ధిదారులకు ఫేషియల్ రికగ్నిషన్ తప్పనిసరి: సీఎం రేవంత్ రెడ్డి

Dantu Vijaya Lakshmi Prasanna
4 మార్చి, 2026

ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మంగళవారం డాక్టర్ బీఆర్ అంబేద్కర్ రాష్ట్ర సచివాలయంలో ప్రజాపాలన–ప్రగతి ప్రణాళికపై నిర్వహించిన జిల్లా కలెక్టర్లు, ఇతర అధికారుల సమావేశంలో పాల్గొన్నారు. సమావేశం ప్రారంభంలో తెలంగాణ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి కె.రామకృష్ణారావు ముఖ్యమంత్రికి పుష్పగుచ్ఛం అందించి స్వాగతం పలికారు.

ఈ సదస్సులో ముఖ్య మంత్రి రేవంత్ రెడ్డి మాట్లాడుతూ, సంక్షేమ పథకాల లబ్ధిదారుల ఫేషియల్ రికగ్నిషన్ (ముఖ గుర్తింపు) ద్వారా అర్హులు కాని వారిని తొలగించే ప్రక్రియను వెంటనే ప్రారంభించాలని అధికారులను ఆదేశించారు.

ఈ సందర్భంగా, అర్హులైన లబ్ధిదారులు తప్పకుండా పథకాల లాభాలు పొందేలా చూడాలి, కానీ అర్హులు కాని వారు లబ్ది పొందకూడదు అన్నారు. ఇప్పటికే సుమారు మూడు లక్షల అర్హలు కాని సామాజిక భద్రతా పెన్షన్ లబ్ధిదారులు ఫేషియల్ రికగ్నిషన్ ద్వారా తొలగించబడ్డారని ఆయన పేర్కొన్నారు. గతంలో సాంకేతిక పరిజ్ఞానం సరైన రీతిలో ఉపయోగించని కారణంగా పెద్ద సంఖ్యలో అర్హులు కాని వారు లబ్ది పొందారని ఆయన అన్నారు.

ఈ సమావేశంలో అధికారులకు ముఖ్య మంత్రి కొన్ని సూచనలు చేశారు. రైతులకు సౌర పంప్‌సెట్ల ఉపయోగాన్ని వివరించి అవగాహన పెంచాలని, రూఫ్‌టాప్ సౌర ప్లాంట్లు ఏర్పాటు చేసి గ్రిడ్ కు కనెక్ట్ చేసుకుని ఆదాయం పొందే విధానంపై విద్యుత్ శాఖ గ్రామాల్లో అవగాహన కల్పించాలని అధికారులకు తెలిపారు. అలాగే హైదరాబాద్, సైబర్‌బాద్, మల్కాజిగిరి మునిసిపల్ కార్పొరేషన్లు, ఇతర పట్టణాలలో పనిచేసే మహిళా, బాలిక, బాలురు హాస్టల్స్ వివరాలను అధికారులచే నమోదు చేయించాలన్నారు.

విద్యా సంస్థల్లో డ్రగ్స్, మాదక పదార్థాలు, ఈ సిగరేట్స్ వాడకం ఉంటే, సంబంధిత విద్యా సంస్థలు బాధ్యత వహించాలి. విద్యా సంస్థల్లో శిక్షకులు, పీఈటి టీచర్లతోపాటు సైకాలజిస్ట్‌లను కూడా నియమించాలి అన్నారు. పాఠశాల బస్సులు, ఇతర వాహనాల ఫిట్‌నెస్ పరీక్షలు పూర్తిగా నిర్వహించాలి. రాష్ట్రం నడిపే ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ వాహనాల డ్రైవర్ల కోసం కంటి పరీక్షలు జరగాలి. రహదారుల లో గుంతలు, పాక్‌హోల్స్ మరమ్మతు చేయడం ద్వారా రోడ్డు ప్రమాదాలు తగ్గించాలి అని సూచించారు.

ఈ సమావేశంలో ప్రజాపాలనను మరింత సమర్థవంతంగా అమలు చేయడం, అభివృద్ధి కార్యక్రమాల పురోగతిని వేగవంతం చేయడంపై ప్రముఖంగా చర్చించారు.

ప్రత్యేక 99 రోజుల కార్యక్రమం

తెలంగాణ ప్రభుత్వం ప్రకటించినట్లుగా, మార్చి 6 నుంచి జూన్ 12 వరకు 99 రోజుల ప్రత్యేక కార్యక్రమం “ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక” నిర్వహిస్తోంది. ఈ కార్యక్రమాన్ని ఐదు దశల్లో అమలు చేయడానికి రాష్ట్ర ప్రణాళికా శాఖ కార్యాచరణను రూపొందించింది. కార్యక్రమ పర్యవేక్షణ కోసం ప్రత్యేక మొబైల్ యాప్‌ను ఉపయోగిస్తారు.

ఈ కార్యక్రమం ఐదు దశల్లో అమలు అవుతుంది. ఏప్రిల్ 2 నుంచి గ్రామ స్థాయిలో గ్రామ సభలు, ఏప్రిల్ 16 నుంచి మండల స్థాయి కార్యక్రమాలు, మే 2 నుంచి నియోజకవర్గ స్థాయి కార్యక్రమాలు, మే 22 నుంచి జిల్లా స్థాయి కార్యక్రమాలు, తరువాత జూన్ 2న తెలంగాణ ఆవిర్భావ వేడుకలు జరుపుతారు.

దీనిలో ప్రధాన అంశాలుగా గ్రామస్థాయి నుంచి రాష్ట్ర స్థాయి పరిశుభ్రత, ప్రభుత్వ కార్యాలయాల్లో పెండింగ్ ఫైల్స్ తీర్చిదిద్దడం, ఆరోగ్యం, సంక్షేమం, పిల్లల భద్రత, డ్రగ్స్ నియంత్రణ, రైతుల సంక్షేమం, విద్య, యువత, క్రీడలు, మహిళలు, పర్యావరణం, రోడ్డు భద్రత వంటి అంశాలు ఉంటాయన్నారు.

ముందుగా మార్చి 6న అన్ని ఉమ్మడి జిల్లాల కేంద్రాల్లో మంత్రుల నేతృత్వంలో సన్నాహక సమావేశాలు నిర్వహించబడతాయి. 99 రోజుల వ్యవధిలో, శాఖల వారీగా అభివృద్ధి పనుల ప్రారంభోత్సవాలు, శంకుస్థాపనలు చేపట్టబడతాయి. ఈ 99 రోజుల కార్యక్రమం కోసం ప్రత్యేక మొబైల్ యాప్ ‘ప్రజా పాలన - ప్రగతి ప్రణాళిక’ రూపొందించబడిందన్నారు.

ఈ సదస్సులో మంత్రులు ఎన్. ఉత్తమ్ కుమార్ రెడ్డి, పొంగులేటి శ్రీనివాస రెడ్డి, దామోదర రాజనర్సింహ, కొమటిరెడ్డి వెంకట్ రెడ్డి, పొన్నం ప్రభాకర్, డి. శ్రీధర్ బాబు, వాకిటి శ్రీహరి, జూపల్లి కృష్ణారావు, కొండా సురేఖ, సీతక్క, అన్ని జిల్లాల కలెక్టర్లు, ఇతర అధికారులు పాల్గొన్నారు.