Let's talk: editor@tmv.in
షాంఘై విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు.. చైనా వివరణ

షాంఘై విమానాశ్రయంలో భారత మహిళకు వేధింపులు.. చైనా వివరణ

Shaik Mohammad Shaffee
26 నవంబర్, 2025

షాంఘై విమానాశ్రయంలో అరుణాచల్ ప్రదేశ్‌కు చెందిన ఒక భారతీయ మహిళను వేధించారనే ఆరోపణలను చైనా ప్రభుత్వం మంగళవారం ఖండించింది. చైనా సరిహద్దు తనిఖీ అధికారులు చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే వ్యవహరించారని పేర్కొంది.

అసలేం జరిగింది?

యుకేలో నివసించే భారతీయ పౌరురాలు పేమ వాంగ్జోమ్ థాంగ్‌డోక్ నవంబర్ 21న లండన్ నుంచి జపాన్‌కు ప్రయాణిస్తుండగా, షాంఘైలో విమానం మారడానికి మూడు గంటల సమయం పట్టింది. ఈ సమయంలో ఆమె పాస్‌పోర్ట్‌లో పుట్టిన ప్రదేశంగా 'అరుణాచల్ ప్రదేశ్' అని ఉండటంతో ఇమ్మిగ్రేషన్ అధికారులు దానిని "చెల్లనిది"గా ప్రకటించి, తనను 18 గంటల పాటు అదుపులోకి తీసుకున్నారని ఆమె ఆరోపించారు. ఈ 18 గంటలూ తనను వేధించారని, ఇది చాలా బాధాకరమైన అనుభవం అని ఆమె సోషల్ మీడియాలో పోస్టులు చేశారు.

చైనా వివరణ

ఈ ఘటనపై చైనా విదేశాంగ మంత్రిత్వ శాఖ ప్రతినిధి మావో నింగ్ స్పందించారు. థాంగ్‌డోక్‌పై ఎటువంటి నిర్బంధ చర్యలు తీసుకోలేదని, ఆరోపించినట్లుగా ఆమెను అదుపులోకి తీసుకోలేదని, వేధించలేదని తెలిపారు. "సరిహద్దు తనిఖీ అధికారులు చట్టాలకు, నిబంధనలకు అనుగుణంగానే తనిఖీ ప్రక్రియలను పూర్తి చేశారు. చట్టాన్ని అమలు చేయడంలో ఎలాంటి దుర్వినియోగం జరగలేదు. ఆ మహిళ చట్టపరమైన హక్కులు పూర్తిగా రక్షించబడ్డాయి" అని మావో నింగ్ చెప్పారు. ఆమెకు ఎయిర్‌లైన్ భోజనం, విశ్రాంతి సౌకర్యాలు కూడా అందించాయని తెలిపారు. ప్రవేశించే, నిష్క్రమించే వ్యక్తులపై తనిఖీలు చేయడం అనేది ప్రపంచవ్యాప్తంగా అన్ని దేశాల సరిహద్దు అధికారుల సాధారణ విధి అని ఆమె సమర్థించారు.

భారత్ తీవ్ర అభ్యంతరం

ఈ ఘటన జరిగిన రోజే భారత్.. బీజింగ్‌లోనూ, ఢిల్లీలోనూ చైనాకు తీవ్ర నిరసన తెలిపింది. "అరుణాచల్ ప్రదేశ్ అనేది నిస్సందేహంగా భారత భూభాగం. అక్కడి నివాసితులు భారతీయ పాస్‌పోర్టు కలిగి ఉండటానికి, వాటితో ప్రయాణించడానికి పూర్తిగా అర్హులు" అని భారత్ గట్టిగా చెప్పింది. షాంఘైలోని భారత కాన్సులేట్ కూడా స్థానికంగా ఈ విషయాన్ని అధికారుల దృష్టికి తీసుకెళ్లి, ఆ ప్రయాణికురాలికి పూర్తి సహాయం అందించింది. భారత్ నిరసనపై మావో నింగ్ స్పందిస్తూ, జాంగ్నాన్ (అరుణాచల్‌కు చైనా పేరు) తమ భూభాగమేనని పునరుద్ఘాటించారు.

ఈ విషయంపై అరుణాచల్ ప్రదేశ్ ముఖ్యమంత్రి పెమా ఖండూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇది "అంతర్జాతీయ నిబంధనలను ఉల్లంఘించడమే కాకుండా, భారతీయ పౌరుల గౌరవాన్ని అవమానించడం" అని ఆయన సోషల్ మీడియాలో పోస్ట్ చేశారు.