Let's talk: editor@tmv.in
శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు ప్రధాని, ఉపరాష్ట్రపతి హాజరు

శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు ప్రధాని, ఉపరాష్ట్రపతి హాజరు

Praveen Kumar
6 నవంబర్, 2025

భగవాన్ శ్రీ సత్యసాయి బాబా గారి శత జయంతి ఉత్సవాలకు సన్నాహాలు జరుగుతున్న నేపథ్యంలో, శ్రీ సత్యసాయి జిల్లాలోని పుట్టపర్తి ఆధ్యాత్మిక పట్టణంగా, ప్రపంచ భక్తి కేంద్రంగా రూపాంతరం చెందుతోంది. ఈ ఉత్సవాలు నవంబర్ 13 నుండి 24, 2025 వరకు పుట్టపర్తి, సత్యసాయి బాబా జిల్లాలో జరగనున్నాయి. ఈ కార్యక్రమానికి దాదాపు 140 దేశాల నుండి భక్తులు తరలివచ్చే అవకాశం ఉంది, ఇది ప్రశాంతి నిలయంలో జరగనున్న అతిపెద్ద ఆధ్యాత్మిక సమావేశాలలో ఒకటిగా నిలవనుంది.

ప్రముఖులు హాజరావుతారని * *అంచనాలు, ప్రత్యేక ఏర్పాట్లు

శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ఈ ఉత్సవాలను నిర్వహిస్తోంది. వారి అంచనా ప్రకారం, ఈ 12 రోజుల వ్యవధిలో మూడు నుండి నాలుగు లక్షల మంది భక్తులు పుట్టపర్తిని సందర్శించవచ్చు. విదేశీ ప్రతినిధులు, ప్రభుత్వ అధికారులు, ప్రముఖులు సహా 10,000 మందికి పైగా ప్రత్యేక ఆహ్వానితులు హాజరు కానున్నారు. ప్రపంచవ్యాప్తంగా ఉన్న సాయి కేంద్రాల నుండి సుమారు 1,500 మంది అంతర్జాతీయ ప్రతినిధులు శ్రీ సత్యసాయి ఇంటర్నేషనల్ ఆర్గనైజేషన్ ద్వారా అధికారికంగా వారి పేర్లు నమోదు చేసుకున్నారు.

భక్తులకు ఉచిత భోజనం, వసతి రవాణా సౌకర్యాలను కల్పించడానికి ట్రస్ట్ ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం విస్తృత ఏర్పాట్లు చేస్తున్నాయి. పట్టణం నలుమూలలా తాత్కాలిక షెల్టర్లు, సామూహిక భోజనశాలలు ఏర్పాటు చేస్తున్నారు. నాలుగు లక్షల కంటే ఎక్కువ మంది సందర్శకుల అంచనా రద్దీని దృష్టిలో ఉంచుకుని, భద్రత మరియు ట్రాఫిక్ నిర్వహణ చర్యలను బలోపేతం చేశారు.

ప్రధానమంత్రి, ఉపరాష్ట్రపతి పర్యటన

• ప్రధానమంత్రి నరేంద్ర మోదీ నవంబర్ 19న జరిగే ముఖ్య కార్యక్రమంలో పాల్గొంటారు. ఆయన పుట్టపర్తిని సందర్శించడం ఇదే తొలిసారి. ఈ సందర్భంగా, శ్రీ సత్యసాయి హిల్ వ్యూ స్టేడియంలో జరిగే భారీ కార్యక్రమంలో ఆయన పాల్గొంటారు. ఈ పర్యటనలో శ్రీ సత్యసాయి బాబా గౌరవార్థం ₹100 స్మారక నాణెం, పోస్టల్ స్టాంప్‌ను విడుదల చేయనున్నారు. ఈ రెండు స్మారక వస్తువులకు భారత ప్రభుత్వం ఆమోదం తెలిపింది. కాగా ఈ నాణాన్ని ఇండియా గవర్నమెంట్ మింట్, హైదరాబాద్, స్టాంప్‌ను పోస్టల్ శాఖ తయారు చేస్తున్నాయి.

• భారత ఉపరాష్ట్రపతి సి.పి. రాధాకృష్ణన్ నవంబర్ 22న జరిగే ఉత్సవాలకు హాజరవుతారు. శ్రీ సత్యసాయి ఇన్స్టిట్యూట్ ఆఫ్ హైయర్ లెర్నింగ్ యొక్క 44వ స్నాతకోత్సవానికి ఆయన ముఖ్య అతిథిగా విచ్చేస్తారు. సెప్టెంబర్ 2025లో పదవీ బాధ్యతలు స్వీకరించిన తర్వాత పుట్టపర్తిలో ఆయనకు ఇది మొదటి అధికారిక పర్యటన అవుతుంది. ఈ స్నాతకోత్సవం సాయి బాబా 1981లో స్థాపించిన ఉచిత, విలువలతో కూడిన ఉన్నత విద్యకు సంస్థ యొక్క నిరంతర నిబద్ధతను తెలియజేస్తుంది.

చరిత్ర, వారసత్వం & సేవ

• శ్రీ సత్యసాయి సెంట్రల్ ట్రస్ట్ ₹1,000 కోట్లకు పైగా కార్పస్‌తో పనిచేస్తోంది. భక్తులు పెట్టుబడుల ద్వారా ఈ నిధులు సమకూరుతున్నాయి. అన్ని కార్యకలాపాలు సాయి బాబా ఆశయాలకు అనుగుణంగా, అన్ని రంగాలలో ఉచితంగా, అత్యున్నత నాణ్యతతో కూడిన సేవలను అందించేందుకు నిర్వహించబడుతున్నాయని మేనేజింగ్ ట్రస్టీ ఆర్.జె. రత్నాకర్ తెలిపారు.

• పుట్టపర్తి, వైట్‌ఫీల్డ్ (బెంగళూరు)లోని శ్రీ సత్యసాయి సూపర్ స్పెషాలిటీ ఆసుపత్రులలో ట్రస్ట్ రోబోటిక్ - అసిస్టెడ్ గుండె శస్త్రచికిత్సలను కూడా ప్రారంభించింది. ప్రపంచంలోనే మొట్టమొదటి ఉచిత రోబోటిక్ కార్డియాక్ సర్జరీలు ఇవేనని భావిస్తున్నారు.

• భారతదేశం, విదేశాల నుండి వేలాది మంది యువ వాలంటీర్లు ఈ ఏర్పాట్లలో పాల్గొంటున్నారు. సాయి యూత్ వింగ్ ఇప్పటికే 60 భారతీయ నగరాల్లో "100వ పుట్టినరోజు రైడ్ అండ్ రన్" ప్రచారాన్ని నిర్వహించింది, ప్రతి ప్రాంతంలో 3,000 నుండి 5,000 మంది పాల్గొన్నారు. శత జయంతి సందర్భంగా జన నిర్వహణ, ఆతిథ్యం మరియు సేవా కార్యక్రమాల కోసం పుట్టపర్తిలో 50,000 మందికి పైగా వాలంటీర్లు మోహరించనున్నారు.

• నవంబర్ 23, భగవాన్ శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతిని పురస్కరించుకుని, ఆంధ్రప్రదేశ్ ప్రభుత్వం ఆ రోజును రాష్ట్ర వేడుకగా ప్రకటించింది.

ఈ శత జయంతి ఉత్సవాలు, ప్రధాని, ఉపరాష్ట్రపతి, 140 దేశాల భక్తుల భాగస్వామ్యంతో, ఆధ్యాత్మికత, సేవ, జాతీయ గుర్తింపుతో చారిత్రక సమ్మేళనంగా పరిగణించబడుతున్నాయి, ఇది శ్రీ సత్యసాయి బాబా జీవితం, బోధనల యొక్క శాశ్వతమైన ప్రపంచ ప్రభావాన్ని మరోసారి ధృవీకరిస్తుంది.

శ్రీ సత్యసాయి బాబా 100వ జయంతి ఉత్సవాలకు ప్రధాని, ఉపరాష్ట్రపతి హాజరు - Tholi Paluku