
శూర్పణఖ దహనం చేస్తాం
ఇటీవల భర్తలను అన్యాయంగా చంపిన భార్యల తీరుకు నిరసనగా ఇండోర్ లో శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహిస్తామని పౌరుష్ సంస్థ అధ్యక్షుడు అశోక్ దశోరా తెలిపారు. ఇటీవల మధ్యప్రదేశ్ రాష్ట్రానికి చెందిన సోనమ్ రఘువంశీ, ముస్కాన్, నికితా సింఘానియా తదితర పది మంది మహిళలు తమ భర్తలను అత్యంత క్రూరంగా చంపి ఇండోర్ కు చెడ్డ పేరు తెచ్చారు. దీంతో భర్తలను కర్కశంగా చంపిన పదిమంది మహిళలతో కూడిన పోస్టర్ ను విడుదల చేశారు. అందులో హనీమూన్ కు భర్తను తీసుకెళ్లి మర్డర్ చేసిన సోనమ్, మరో ఘటనలో భర్తను చంపి డ్రమ్ములో వేసిన ముస్కాన్ ఫోటోలున్నాయి. దీంతో వీరి దిష్టిబొమ్మలను కూడా దహనం చేస్తామని అశోక్ తెలిపారు. భవిష్యత్తులో ఇలాంటి సిగ్గుమాలిన పనులు ఎవరూ చేయకూడదని హెచ్చరించారు.
ఆగ్రహం వ్యక్తం చేసిన ఎన్జీవో
దసరా పండుగకు ఎవరైనా రావణ దహనాలు చేస్తారు. కానీ ఈ పురుష హక్కుల సంస్థ శూర్పణఖ దహన కార్యక్రమం నిర్వహించడం చాలా పెద్ద తప్పు అని జ్వాలా అనే ఎన్జీవో అధ్యక్షురాలు దివ్యాగుప్తా మండిపడ్డారు. మహిళలందరికీ ఈ పదిమంది నిందితులు ఏమైనా ప్రతినిధులా? అని ప్రశ్నించారు. మరి నిత్యం పురుషుల చేతిలో వేధింపులకు గురవుతున్న మహిళల పరిస్థితి ఏమిటి? వారు ఈ విధంగానే చేయాలా అని నిలదీశారు. ఇటువంటి అనాలోచిత కార్యక్రమాలకు ఎవరు అనుమతిస్తున్నారని ఆగ్రహం వ్యక్తం చేశారు. ఇలాంటి కార్యక్రమాలు చేయడం మంచిది కాదన్నారు.
