
వైభవంగా సోమనాథ్ ‘శౌర్యయాత్ర’
సోమనాథ్ స్వాభిమాన పర్వ్ సందర్భంగా నిర్వహించిన ‘శౌర్య యాత్ర’లో ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం పాల్గొన్నారు. ఈ సందర్భంగా సోమనాథ్లోని శంఖ్ సర్కిల్ వద్ద వేలాది మంది ప్రజలు హర హర మహాదేవ్, జై సోమనాథ్ అనే దివ్య నినాదాల మధ్య పూలవర్షంతో ప్రధానికి ఘన స్వాగతం పలికారు. శంఖ్ సర్కిల్ నుంచి హమీర్సింహ్ సర్కిల్ వరకు రోడ్డు ఇరువైపులా నిలిచిన ప్రజలకు ప్రధాని అభివాదం చేస్తూ ముందుకు సాగారు. అధికారిక ప్రకటన ప్రకారం సోమనాథ్ చరిత్రలోనే ఇదే అత్యంత ఘనంగా నిర్వహించిన శౌర్య యాత్రగా నిలిచింది. ఇది ‘ఏక్ భారత్, శ్రేష్ఠ భారత్’ భావనకు ప్రతీకగా నిలిచింది. యాత్ర మార్గమంతా దేశంలోని వివిధ రాష్ట్రాల కళాకారులు తమ సాంస్కృతిక ప్రదర్శనలతో భారతదేశం వైవిధ్యభరితమైన వారసత్వాన్ని ప్రదర్శించారు. ఈ కార్యక్రమంలో ప్రధాని మోడీతో పాటు గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్, ఉప ముఖ్యమంత్రి హర్ష్ సంఘవి, ప్రతినిధి మంత్రి జీతూ వఘాణి, విద్యాశాఖ మంత్రి ప్రద్యుమన్ వజా పాల్గొన్నారు. ఈ వేడుక సోమనాథ్ స్వాభిమాన పర్వ్ ప్రాముఖ్యతను, ప్రజల్లో గర్వభావాన్ని నింపింది.
108 గుర్రాలతో యాత్ర
అనంతరం ప్రధాని మోడీ సోమనాథ్ ఆలయంలో ప్రత్యేక ప్రార్థనలు నిర్వహించారు. అలాగే వీర హమీర్జీ గోహిల్, సర్దార్ వల్లభభాయ్ పటేల్ విగ్రహాలకు పుష్పాంజలి ఘటించారు. ఏడీ 1299లో జఫర్ ఖాన్ నేతృత్వంలో జరిగిన దండయాత్ర సమయంలో సోమనాథ్ ఆలయాన్ని కాపాడుతూ వీర హమీర్జీ గోహిల్ తన ప్రాణాలను అర్పించారు. 1026 జనవరిలో మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై చేసిన తొలి దాడి తర్వాత వెయ్యేళ్లుగా నిరంతరంగా కొనసాగిన విశ్వాసం, ధైర్యానికి గుర్తుగా దేశవ్యాప్తంగా నాలుగు రోజుల పాటు నిర్వహిస్తున్న జాతీయ స్మరణ కార్యక్రమాల్లో భాగంగా ప్రధాని ఈ శౌర్య యాత్రలో పాల్గొన్నారు. ‘శౌర్య యాత్ర’ సోమనాథ్ స్వాభిమాన పర్వ్లో భాగంగా నిర్వహించే ప్రతీకాత్మక ఊరేగింపు. ఇది శౌర్యం, త్యాగం, శతాబ్దాల పాటు అనేక కష్టాలను ఎదుర్కొని సోమనాథ్ను నిలబెట్టిన అజేయ ఆత్మవిశ్వాసానికి ప్రతిరూపంగా నిలుస్తుంది. యాత్రకు ముందు గుజరాత్ పోలీస్ మౌంటెడ్ యూనిట్కు చెందిన 108 గుర్రాలు ఈ కార్యక్రమంలో పాల్గొనేందుకు సోమనాథ్కు చేరుకున్నాయి.
జనవరి 8 నుంచి జనవరి 11, 2026 వరకు నిర్వహించిన సోమనాథ్ స్వాభిమాన పర్వ్, 1026లో మహ్మద్ గజనీ సోమనాథ్ ఆలయంపై చేసిన తొలి దాడికి వెయ్యేళ్లు పూర్తైన సందర్భంగా నిర్వహించారు. ఆ దాడితో ఆలయం మళ్లీ మళ్లీ ధ్వంసం కావడం, తిరిగి నిర్మించడం అనే దీర్ఘ చరిత్రకు నాంది పలికింది. అయినప్పటికీ సోమనాథ్ ఆలయం ప్రజల సామూహిక స్మృతిలో శాశ్వతంగా నిలిచింది. ఆలయాన్ని ఎన్నిసార్లు ధ్వంసం చేసినా, తిరిగి పునర్నిర్మించిన ఈ చరిత్ర ప్రపంచంలోనే అపూర్వమైనదిగా నిలుస్తూ, దాని ఆధ్యాత్మిక, సాంస్కృతిక ప్రాధాన్యతను చాటుతోంది. 1947 నవంబర్ 12న, దీపావళి రోజున (కార్తీక శుద్ధ పాడ్యమి) సర్దార్ వల్లభభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ అవశేషాలను సందర్శించి, భారతదేశ సాంస్కృతిక ఆత్మవిశ్వాసాన్ని పునరుద్ధరించేందుకు ఆలయ పునర్నిర్మాణం అత్యంత అవసరమని పేర్కొన్నారు. ప్రజల సహకారంతో చేపట్టిన పునర్నిర్మాణ పనులు 1951 మే 11న పూర్తయ్యాయి. అప్పటి రాష్ట్రపతి రాజేంద్ర ప్రసాద్ సమక్షంలో ప్రస్తుత సోమనాథ్ ఆలయ ప్రతిష్ఠాపన జరిగింది.
ఆ శక్తులు ఇంకా క్రియాశీలంగానే ఉన్నాయి : ప్రధాని మోడీ
స్వాతంత్ర్యం తర్వాత గుజరాత్లోని సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణాన్ని వ్యతిరేకించిన శక్తులు ఇప్పటికీ క్రియాశీలంగానే ఉన్నాయని ప్రధాని నరేంద్ర మోడీ ఆదివారం అన్నారు. అటువంటి శక్తులను ఓడించాలంటే దేశం అప్రమత్తంగా, ఐక్యంగా, శక్తివంతంగా ఉండాల్సిన అవసరం ఉందని ఆయన స్పష్టం చేశారు. సోమనాథ్ చరిత్ర విధ్వంసం, పరాజయాల కథ కాదని, విజయాలు, పునరుజ్జీవనాల చరిత్ర అని ఆయన పేర్కొన్నారు. కాలచక్రం తిరిగింది. మౌలికవాద దండయాత్రకారులు ఈ రోజు చరిత్ర పుస్తకాల పుటలకే పరిమితమయ్యారు. కానీ సోమనాథ్ ఆలయం ఇప్పటికీ గర్వంగా నిలిచే ఉందని ప్రధాని అన్నారు. ద్వేషం, దౌర్జన్యం, ఆవేశంతో నిండిన నిజమైన చరిత్రను మన నుంచి దాచిపెట్టారు. ఆలయంపై దాడి కేవలం దోపిడీ కోసం జరిగిందని మనకు బోధించారని వ్యాఖ్యానించారు. స్వాతంత్ర్యం అనంతరం సర్దార్ వల్లభభాయ్ పటేల్ సోమనాథ్ ఆలయ పునర్నిర్మాణానికి సంకల్పం తీసుకున్నప్పుడు, ఆయన మార్గంలో అనేక అడ్డంకులు సృష్టించారని మోడీ గుర్తు చేశారు.
