
విద్యుత్ బదిలీల ఉత్కంఠ: నేడు యాజమాన్యం, ఉద్యోగ సంఘాల కీలక భేటీ
తెలంగాణ దక్షిణ ప్రాంత విద్యుత్ పంపిణీ సంస్థలో సాధారణ బదిలీల చుట్టూ నెలకొన్న వివాదం కీలక మలుపు తిరిగింది. బదిలీల మార్గదర్శకాలపై ఉద్యోగ సంఘాలు వ్యక్తం చేస్తున్న తీవ్ర అభ్యంతరాల నేపథ్యంలో, చర్చల ద్వారా సమస్యను పరిష్కరించేందుకు యాజమాన్యం సిద్ధమైంది. ఈ మేరకు జనవరి 28, 2026 (బుధవారం) ఉదయం 10:30 గంటలకు ఉమ్మడి ఫోరం ప్రతినిధులతో సమావేశం నిర్వహించనున్నట్లు తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ చీఫ్ ఇంజనీర్ (హెచ్ఆర్టీ & ట్రైనింగ్) ప్రకటించారు.
హైదరాబాద్ మింట్ కాంపౌండ్లోని తెలంగాణ స్టేట్ సదర్న్ పవర్ డిస్ట్రిబ్యూషన్ కంపెనీ లిమిటెడ్ కార్పొరేట్ కార్యాలయం, బీ–బ్లాక్, 5వ అంతస్తులో సమావేశం నిర్వహించనున్నట్లు లేఖలో పేర్కొన్నారు. సాధారణ బదిలీల మార్గదర్శకాలు, ఉద్యోగ సంఘాలు ప్రస్తావించిన సమస్యలపై చర్చించడమే ఈ సమావేశం ప్రధాన ఉద్దేశమని తెలిపారు.
ఇటీవల బదిలీలపై ఉద్యోగుల్లో ఆందోళనలు వ్యక్తమవుతున్న నేపథ్యంలో ఈ భేటీ ప్రాధాన్యం సంతరించుకుంది. యాజమాన్యం, సంఘాల మధ్య చర్చల ద్వారా పరిష్కారం దొరుకుతుందా అన్నది ఆసక్తిగా మారింది.
