Let's talk: editor@tmv.in
విద్యార్థులకు విపక్షాలు అండగా నిలవాలి: నేహాబోరా

విద్యార్థులకు విపక్షాలు అండగా నిలవాలి: నేహాబోరా

Pinjari Chand
18 ఆగస్టు, 2026

జార్ఖండ్‌లో ఆందోళన చేస్తున్న విద్యార్థులతో పాటు హైదరాబాద్‌లోని నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లా విద్యార్థులకు విపక్ష పార్టీలు సంఘీభావం ప్రకటించాలని ఆల్‌ ఇండియా స్టూడెంట్స్‌ అసోసియేషన్‌ (ఐసా) అధ్యక్షురాలు నేహా బోరా కోరారు. ఆదివారం హైదరాబాద్‌లో పీటీఐతో ఆమె మాట్లాడుతూ.. ప్రజల డిమాండ్లను పార్లమెంట్‌లో లేవనెత్తి, క్షేత్రస్థాయిలో వినిపిస్తున్న గొంతుకలను బలోపేతం చేయడం ఎంపీల బాధ్యత అన్నారు. జార్ఖండ్‌లో జేపీఎస్‌సీ-జేఎస్‌ఎస్‌సీ సంస్కరణల వేదిక ఆధ్వర్యంలో విద్యార్థులు, ఉద్యోగార్థులు జూలై 25 నుంచి ఆందోళన చేస్తున్నారు. నియామక పరీక్షల్లో పారదర్శకత పాటించాలని, జార్ఖండ్‌ పబ్లిక్‌ సర్వీస్‌ కమిషన్‌ (జేపీఎస్‌సీ), జార్ఖండ్‌ స్టాఫ్‌ సెలక్షన్‌ కమిషన్‌ (జేఎస్‌ఎస్‌సీ) పనితీరులో సంస్కరణలు చేపట్టాలని వారు డిమాండ్‌ చేస్తున్నారు. పలు పరీక్షలను రద్దు చేయడంతో పాటు సీబీఐ లేదా రాష్ట్రం వెలుపల నుంచి రిటైర్డ్‌ హైకోర్టు న్యాయమూర్తులతో స్వతంత్ర దర్యాప్తు చేపట్టాలని కోరుతున్నారు.

యువత ఆగ్రహానికి ప్రతిబింబం జంతర్‌‌మంతర్‌‌ ఆందోళన

నల్సార్‌ యూనివర్సిటీ ఆఫ్‌ లాలోని కొందరు విద్యార్థులు ఈ ఏడాది జూలైలో వర్సిటీ స్నాతకోత్సవానికి సుప్రీంకోర్టు ప్రధాన న్యాయమూర్తి సూర్యకాంత్‌ను ముఖ్య అతిథిగా ఆహ్వానించే ప్రతిపాదనను వ్యతిరేకిస్తూ ఉపకులపతి, రిజిస్ట్రార్‌, అధ్యాపకులకు లేఖ రాశారని బోరా తెలిపారు. అలాగే హైదరాబాద్‌లోని ఇంగ్లిష్‌ అండ్‌ ఫారిన్‌ లాంగ్వేజెస్‌ యూనివర్సిటీ (ఈఎఫ్‌ఎల్‌యూ)లో ఆగస్టు 14న ఏబీవీపీ, ఎన్‌ఎస్‌యూఐ సభ్యుల మధ్య ఘర్షణ చోటుచేసుకోగా, కనీసం ఏడుగురు విద్యార్థులు గాయపడ్డారు. ఈ ఘటనపై కేసులు నమోదయ్యాయి.

ఢిల్లీలో జంతర్‌ మంతర్‌ వద్ద నీట్‌ పేపర్‌ లీక్‌లకు వ్యతిరేకంగా జరిగిన విద్యార్థుల ఆందోళనలో తాను, కార్యకర్త సోనమ్‌ వాంగ్‌చుక్‌తో కలిసి 23 రోజుల పాటు నిరాహార దీక్ష చేసిన విషయాన్ని బోరా గుర్తుచేశారు. ఆ నిరసన కేవలం పేపర్‌ లీక్‌లకు సంబంధించినది కాదని, దేశ విద్యా వ్యవస్థలో నెలకొన్న సంక్షోభం, నిరుద్యోగ సమస్యపై యువతలో ఉన్న ఆగ్రహానికి ప్రతిబింబమని ఆమె పేర్కొన్నారు.

విద్యార్థులకు విపక్షాలు అండగా నిలవాలి: నేహాబోరా - Tholi Paluku