
విజయవాడలో క్రిస్మస్ హై టీ
విజయవాడలో ఈనెల 22వ తేదీన క్రిస్మస్ హై టీ కార్యక్రమాన్ని ప్రభుత్వం నిర్వహించేందుకు అన్ని ఏర్పాట్లు చేస్తున్నట్లు రాష్ట్ర న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి ఎన్ ఎండి ఫరూక్ వెల్లడించారు. తాడేపల్లి లోని న్యాయ మైనారిటీ సంక్షేమ శాఖ మంత్రి క్యాంపు కార్యాలయంలో మైనారిటీ సంక్షేమ శాఖ ఉన్నతాధికారులతో హైటీ ఏర్పాట్లపై మంత్రి ఫరూక్ సమీక్షించారు. క్రిస్మస్ పర్వదినాన్ని పురస్కరించుకొని ముందస్తు వేడుకల్లో భాగంగా హైటీ కార్యక్రమాన్ని విజయవాడలోని ఏ-ప్లస్ కన్వెన్షన్ లో నిర్వహిస్తున్నట్లు తెలిపారు. ముఖ్యఅతిథిగా రాష్ట్ర ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు హాజరవుతారని, పొరపాట్లు లేకుండా ఎన్టీఆర్ జిల్లా కలెక్టర్ ఆధ్వర్యంలో జాగ్రత్తగా ఏర్పాటు చేయాలని అధికారులను, సిబ్బందిని మంత్రి ఫరూక్ ఆదేశించారు. ఈ సమావేశంలో క్రిస్టియన్ ఫైనాన్స్ కార్పొరేషన్ ఎండి, మైనార్టీ కార్పొరేషన్ ఎండి, వక్ఫ్ బోర్డు సీఈవో, ఉర్దూ అకాడమీ డైరెక్టర్, మైనారిటీ కమిషన్ కార్యదర్శి పాల్గొన్నారు.
