
వరల్డ్ టైటిల్కు అడుగు దూరంలో తన్వి శర్మ
భారత యువ షట్లర్ తన్వి శర్మ వరల్డ్ టైటిల్కు అడుగు దూరంలో నిలిచింది. గౌహతి వేదికగా జరుగుతున్న బీడబ్ల్యూఎఫ్ వరల్డ్ జూనియర్ ఛాంపియన్షిప్స్ 2025లో తన్వి అద్భుత ప్రదర్శనతో ఫైనల్లోకి ప్రవేశించింది. నేషనల్ సెంటర్ ఆఫ్ ఎక్సలెన్స్లో శనివారం జరిగిన బాలికల సింగిల్స్ సెమీఫైనల్లో చైనాకు చెందిన లియు సి యాపై తిరుగులేని విజయాన్ని నమోదు చేసింది.
16 ఏళ్ల తన్వి, కేవలం అరగంటలో ఆసియా జూనియర్ ఛాంపియన్షిప్స్ రజత పతక విజేత లియు సి యాను 15-11, 15-9 తేడాతో ఓడించింది. దీని ద్వారా అపర్ణ పోపట్, మాజీ ప్రపంచ నంబర్ 1 సైనా నెహ్వాల్ అడుగుజాడల్లో నడుస్తూ, ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ టైటిల్ పోరుకు చేరిన మూడో భారతీయ మహిళా క్రీడాకారిణిగా రికార్డు సృష్టించింది.
టాప్ సీడ్ అయిన తన్వి, ఇప్పుడు ఫైనల్లో రెండో సీడ్ అయిన థాయిలాండ్కు చెందిన అన్యపట్ పిచిట్ప్రీచాసక్తో తలపడనుంది. అన్యపట్ మరో సెమీఫైనల్లో తన దేశానికే చెందిన యాతవీమిన్ కెట్క్లియంగ్పై 10-15, 15-11, 15-5 తేడాతో విజయం సాధించింది.
17 ఏళ్ల తర్వాత ప్రపంచ జూనియర్ ఛాంపియన్షిప్స్ పతకాన్ని ఖాయం చేసుకున్న తొలి భారతీయ మహిళా క్రీడాకారిణిగా నిలిచిన తన్వి, సెమీఫైనల్లో తొలి పాయింట్ నుంచే దూకుడుగా ఆడింది. లియును అంచనా వేయడానికి వీల్లేకుండా, నెట్ ముందు నుండి పదునైన క్రాస్-కోర్ట్ షాట్లు ఆడింది. ఈ వ్యూహం అద్భుతంగా పని చేయడంతో తొలి గేమ్లో 7-3 ఆధిక్యాన్ని సాధించింది. లియు 8-7తో తేడాను తగ్గించినా, తన్వి ఒత్తిడికి గురి కాలేదు. ఆమె లియుకి ఏమాత్రం కుదురుకునే అవకాశం ఇవ్వకుండా, కేవలం 13 నిమిషాల్లో క్రాస్-కోర్ట్ స్మాష్తో తొలి గేమ్ను ముగించింది. రెండో గేమ్లో మరింత దూకుడుగా ఆడిన తన్వి, త్వరగా 12-4 ఆధిక్యాన్ని సంపాదించింది. ఈ దశలో కొన్ని తప్పిదాలు చేసినా, కోచ్ సలహా మేరకు చక్కటి స్మాష్లతో తిరిగి పట్టు సాధించి, ఫైనల్ బెర్త్ను ఖాయం చేసుకుంది.
విజయానంతరం తన్వి మాట్లాడుతూ, "ఈ రోజు నేను ఆడిన తీరు చాలా సంతృప్తికరంగా ఉంది. 12-4 వద్ద కొన్ని పొరపాట్లు చేశాను. అప్పుడు కోచ్ నా షాట్లను లైన్ల లోపల ఆడేలా దృష్టి పెట్టాలని చెప్పారు, అది పని చేసింది" అని అన్నారు.
