Let's talk: editor@tmv.in
వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన

వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన

Shaik Mohammad Shaffee
31 అక్టోబర్, 2025

మొంథా తుఫాను ప్రభావంతో తెలంగాణ రాష్ట్రంలోని పలు జిల్లాల్లో కుండపోత వాన కురిసింది. ముఖ్యంగా ఉమ్మడి వరంగల్​ జిల్లాలో భారీ వర్షాలు పడ్డాయి. వరంగల్​, హన్మకొండల్లో రికార్డు స్థాయిలో వర్షం పడటంతో వరద ముంచెత్తింది. ఈ క్రమంలో మంత్రి కొండా సురేఖ గురువారం వరంగల్ పరిధిలోని ఎన్‌ఎన్ నగర్, బీఆర్ నగర్ వరద ముంపు ప్రాంతాల్లో జిల్లా కలెక్టర్ డా.సత్య శారద, అదనపు కలెక్టర్ సంధ్యారాణితో కలిసి క్షేత్ర స్థాయిలో పర్యటించారు.

వరద ముంపు ప్రాంత బాధితులను పరామర్శించి, కొనసాగుతున్న సహాయక చర్యలను ప్రత్యక్షంగా సమీక్షించారు. ప్రజలు ఎలాంటి ఆందోళన చెందవద్దని, ప్రతి బాధిత కుటుంబానికి అన్ని విధాల సహాయం అందించేందుకు ప్రభుత్వం పూర్తిగా కట్టుబడి ఉందని వారికి భరోసా ఇచ్చారు.

ఈ సందర్భంగా మంత్రి కొండా సురేఖ మీడియాతో మాట్లాడుతూ, “మొంథా తుఫాను కారణంగా తెలంగాణ రాష్ట్రంలో కురిసిన భారీ వర్షాలు తీవ్రమైన వరదలను సృష్టించాయి. దీంతో కాలనీలు, రహదారులు తీవ్రంగా ప్రభావితమయ్యాయి. అధికారులు ప్రజలను పునరావాస శిబిరాలకు తరలించేందుకు ప్రయత్నిస్తున్నప్పటికీ, చాలా మంది నివాసితులు తమ ఇళ్లను వదిలి వెళ్లడానికి నిరాకరిస్తున్నారు” అని ఆమె తెలిపారు.

“అధికారులు, సంబంధిత విభాగాలు రాత్రంతా పనిచేస్తూ ఎన్‌డీఆర్‌ఎఫ్ బృందాలతో సమన్వయం చేసి ప్రజలకు హెచ్చరికలు అందిస్తున్నాయి. ఎన్‌జీఓలు కూడా ఆహారం, సహాయం అందిస్తున్నాయి. పాఠశాలలు, ఫంక్షన్ హాళ్లు వంటి ప్రదేశాలలో తాత్కాలిక ఆశ్రయ కేంద్రాలు ఏర్పాటు చేశాం. అలాగే వైద్య సదుపాయాలు కూడా అందిస్తున్నాం” అని ఆమె అన్నారు.

“పరిస్థితి సాధారణ స్థితికి వచ్చే వరకు ప్రభుత్వం బాధితుల బాధ్యతను తీసుకుంటుంది. ఆహారం, ఇతర అవసరాల కోసం సహాయం అందించడానికి ప్రభుత్వం సిద్ధంగా ఉంది. రక్షణ బృందాలు, పడవలు, డ్రోన్లను ఉపయోగించి ఆహారం పంపిణీ చేస్తున్నాం” అని మంత్రి కొండా సురేఖ వివరించారు.

వరంగల్ జిల్లాలో ముందస్తు చర్యలు: కలెక్టర్

వరంగల్ జిల్లా కలెక్టర్ డాక్టర్ సత్య శారద మాట్లాడుతూ, మొంథా తుఫాను ప్రభావాన్ని ముందే ఊహించి, ప్రజల భద్రత కోసం ముందస్తు జాగ్రత్త చర్యలు తీసుకున్నట్లు తెలిపారు. వరంగల్ జిల్లాలో సగటు వర్షపాతం దాదాపు 29 సెంటీమీటర్లుగా నమోదైందని, పరిస్థితిని రెండు రోజుల ముందే అంచనా వేసి జాగ్రత్త చర్యలు ప్రారంభించామని కలెక్టర్ తెలిపారు. అన్ని మార్కెట్లు, పాఠశాలలకు సెలవులు ప్రకటించామన్నారు. రోగులు, ప్రసవ తేదీ దగ్గర పడుతున్న గర్భిణీ స్త్రీలందరినీ సురక్షిత ప్రాంతాలకు తరలించామని, లోతట్టు ప్రాంతాల ప్రజలను కూడా షెల్టర్ జోన్‌లకు తరలించినట్లు తెలిపారు. ప్రస్తుతం జలమయమైన ప్రాంతాలలో ఆరోగ్య సమస్యలు తలెత్తకుండా చూడటం, నిరంతరం ఆహార వసతి కల్పించడంపై దృష్టి సారించినట్లు కలెక్టర్ తెలిపారు.

వరంగల్ వరద ప్రభావిత ప్రాంతాల్లో మంత్రి కొండా సురేఖ పర్యటన - Tholi Paluku