Let's talk: editor@tmv.in
విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

విండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు ప్రకటన

Shaik Mohammad Shaffee
26 సెప్టెంబర్, 2025

వెస్టిండీస్‌తో స్వదేశంలో జరగనున్న రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌కు భారత క్రికెట్ జట్టును చీఫ్ సెలెక్టర్ అజిత్ అగార్కర్ గురువారం ప్రకటించారు. అక్టోబర్ 2 నుంచి అహ్మదాబాద్‌లో ప్రారంభం కానున్న ఈ సిరీస్‌కు 15 మంది సభ్యులతో కూడిన పూర్తి స్థాయి జట్టును ఎంపిక చేశారు. ఇంగ్లాండ్ టూర్‌లో టీమిండియాకి టెస్టు కెప్టెన్‌గా వ్యవహరించిన శుభ్‌మన్ గిల్, విండీస్‌తో సిరీస్‌లోనూ సారథ్యం వహించబోతున్నారు.

ఆసియా కప్ ఫైనల్ సెప్టెంబర్ 28న ఉన్నప్పటికీ.. గిల్, మరికొందరు కీలక ఆటగాళ్లు కేవలం కొద్ది రోజుల్లోనే టెస్ట్ జట్టుతో కలవాల్సి ఉంటుంది. జట్టులో గిల్‌తో పాటు యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, రవీంద్ర జడేజా, వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్, మహ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్ వంటి ఆటగాళ్లు ఉన్నారు. ఇంగ్లాండ్‌తో టెస్టు సిరీస్‌లో ఆశించిన స్థాయిలో రాణించలేకపోయిన కరుణ్ నాయర్‌కు జట్టులో చోటు దక్కలేదు. కరుణ్ నాయర్ స్థానంలో యంగ్ బ్యాటర్ దేవ్‌దత్ పడిక్కల్‌ని ఎంపిక చేశారు సెలెక్టర్లు.

ఆల్-రౌండర్ రవీంద్ర జడేజాను జట్టుకు వైస్-కెప్టెన్ ప్రకటించారు. అతడి అనుభవం, ఆల్‌రౌండ్ నైపుణ్యాలను పరిగణనలోకి తీసుకుని ఈ బాధ్యత అప్పగించారు. స్టార్ వికెట్ కీపర్ కమ్ బ్యాట్స్‌మెన్ రిషభ్ పంత్ గాయం నుంచి ఇంకా కోలుకుంటున్నందున ఈ సిరీస్‌కు దూరమయ్యారు. దీంతో ఆయన స్థానంలో ధ్రువ్ జురెల్‌ని వికెట్ కీపర్‌గా ఎంచుకున్నారు.

అలాగే ఆండర్సన్-టెండూల్కర్ ట్రోఫీలో అద్భుత ప్రదర్శన చేసిన పేసర్ ప్రసిద్ధ్ కృష్ణకు తుది జట్టులో చోటు దక్కింది. ఆస్ట్రేలియా 'ఏ'తో జరిగిన రెండో మ్యాచ్‌లో తలకు గాయమై మైదానాన్ని వీడవలసి వచ్చినప్పటికీ, అతడి ఫామ్‌ను పరిగణలోకి తీసుకున్నారు. సాయి సుదర్శన్, నితీష్ కుమార్ రెడ్డి వంటి యువ ఆటగాళ్లు జట్టులో భాగమయ్యారు. వాషింగ్టన్ సుందర్, అక్షర్ పటేల్, కుల్దీప్ యాదవ్‌‌‌.. స్పిన్నర్ల కోటాలో టీమ్‌లో చోటు సంపాదించుకున్నారు.

వెస్టిండీస్‌తో టెస్ట్ సిరీస్‌కు భారత జట్టు

శుభ్‌మన్ గిల్ (కెప్టెన్), రవీంద్ర జడేజా (వైస్-కెప్టెన్), యశస్వి జైస్వాల్, కేఎల్ రాహుల్, సాయి సుదర్శన్, దేవదత్ పడిక్కల్, ధ్రువ్ జురెల్, వాషింగ్టన్ సుందర్, జస్ప్రీత్ బుమ్రా, అక్షర్ పటేల్, నితీష్ కుమార్ రెడ్డి, ఎన్. జగదీశన్, మహమ్మద్ సిరాజ్, ప్రసిద్ధ్ కృష్ణ, కుల్దీప్ యాదవ్

భారత్, వెస్టిండీస్ జట్ల మధ్య టెస్ట్ క్రికెట్‌లో సుదీర్ఘ చరిత్ర ఉంది. ఈ రెండు జట్లు అనేక చారిత్రక మ్యాచ్‌లలో తలపడ్డాయి. వెస్టిండీస్ ఒకప్పుడు టెస్ట్ క్రికెట్‌లో తిరుగులేని శక్తిగా ఉండేది. అయితే గత రెండు దశాబ్దాలుగా భారతదేశం ఆధిపత్యాన్ని ప్రదర్శిస్తోంది. ఇప్పటివరకు భారత్, వెస్టిండీస్ జట్లు టెస్ట్ క్రికెట్‌లో 100 మ్యాచ్‌లలో తలపడ్డాయి. ఇందులో భారత్ 23 మ్యాచ్‌లలో గెలవగా, వెస్టిండీస్ 30 మ్యాచ్‌లలో గెలిచింది. 47 మ్యాచ్‌లు డ్రా ముగిశాయి. టీమిండియా చివరిసారిగా జూలై 2023లో వెస్టిండీస్‌తో రెండు టెస్ట్ మ్యాచ్‌ల సిరీస్‌లో తలపడింది. ఈ సిరీస్‌ను భారత్ 1-0 తేడాతో గెలుచుకుంది.