Let's talk: editor@tmv.in
లోక్‌సభలో అదనపు గ్రాంట్లకు ఆమోదం - ఎల్పీజీ సంక్షోభంపై రాజకీయ వాగ్వాదం

లోక్‌సభలో అదనపు గ్రాంట్లకు ఆమోదం - ఎల్పీజీ సంక్షోభంపై రాజకీయ వాగ్వాదం

Dantu Vijaya Lakshmi Prasanna
14 మార్చి, 2026

లోక్‌సభ శుక్రవారం 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించిన రెండో విడత సప్లిమెంటరీ డిమాండ్స్ ఫర్ గ్రాంట్స్‌కు ఆమోదం తెలిపింది. ఈ ప్రతిపాదన కింద కేంద్ర ప్రభుత్వం రూ.2 లక్షల 81 వేల కోట్లకు పైగా అదనపు ఖర్చు చేయడానికి అనుమతి కోరింది. ఈ నిధులను ప్రధానంగా ఎరువుల సబ్సిడీ, ఆహార సబ్సిడీ, రక్షణ సేవల ఖర్చులు మరియు ఇతర ప్రభుత్వ కార్యక్రమాలకు వినియోగించనున్నారు. దీనితో పాటు అప్రోప్రియేషన్ బిల్–2026ను కూడా సభ ఆమోదించింది.

లోక్‌సభలో జరిగిన చర్చకు సమాధానం ఇస్తూ కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ మాట్లాడుతూ, ఈ సప్లిమెంటరీ డిమాండ్స్‌లో మొత్తం 61 గ్రాంట్లు ఉన్నాయని తెలిపారు. ప్రభుత్వం దేశ ఆర్థిక వ్యవస్థను బలపరిచినందువల్ల వివిధ ఆర్థిక షాకులను ఎదుర్కొనే సామర్థ్యం పెరిగిందని ఆమె చెప్పారు. ఫిస్కల్ కన్సాలిడేషన్ లక్ష్యాలను పాటిస్తూ దేశ ఆర్థిక స్థిరత్వాన్ని కాపాడుతున్నామని ఆమె పేర్కొన్నారు.

ప్రపంచవ్యాప్తంగా ఏర్పడుతున్న ఆర్థిక సంక్షోభాలు, సరఫరా గొలుసు అంతరాయాలను ఎదుర్కొనేందుకు ఎకనామిక్ స్టెబిలైజేషన్ ఫండ్ ఏర్పాటు చేస్తున్నామని మంత్రి తెలిపారు. దీనికి ప్రారంభంగా రూ.57,381 కోట్లు ప్రతిపాదించగా, మొత్తం నిధి రూ.1 లక్ష కోట్ల వరకు పెంచాలని ప్రభుత్వం లక్ష్యంగా పెట్టుకుంది. ఇతర మంత్రిత్వ శాఖల పొదుపు నిధులను కూడా ఈ ఫండ్‌లో జమ చేయనున్నట్లు ఆమె వెల్లడించారు.

ఈ సప్లిమెంటరీ గ్రాంట్లలో రక్షణ సేవల కోసం రూ.41,430 కోట్లు కేటాయించారు. అదనంగా మాజీ సైనికుల ఆరోగ్య సేవల కోసం అమలు చేస్తున్న ఎక్స్ సర్వీస్ మెన్ కంట్రీబ్యూటరీ హెల్త్ స్కీమ్‌కు రూ.6,140 కోట్లు ఇచ్చారు. రాష్ట్రాల స్థానిక సంస్థలకు రూ.37,886 కోట్ల గ్రాంట్ ఇవ్వగా, రైతులకు ఎరువుల కొరత లేకుండా ఉండేందుకు ఎరువుల సబ్సిడీ కోసం రూ.19,230 కోట్లు కేటాయించారు. అలాగే విక్సిత్ భారత్- జి రామ్ జి చట్టం అమలుకు రూ.30 వేల కోట్ల అదనపు నిధులు కేటాయించబడ్డాయి.ఈ పథకం ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి రానుందని మంత్రి పేర్కొన్నారు.

ప్రపంచ సంక్షోభాల నేపథ్యంలో పార్టీల మధ్య భేదాలు పక్కన పెట్టి జాతీయ ప్రయోజనాల కోసం కలిసి పనిచేయాలని మంత్రి సభ్యులకు విజ్ఞప్తి చేశారు. ప్రధానమంత్రి నరేంద్ర మోడీ దేశ ప్రజలకు ఎలాంటి ఇబ్బందులు రాకుండా నిరంతరం కృషి చేస్తున్నారని ఆమె పేర్కొన్నారు.

లోక్‌సభ సప్లిమెంటరీ డిమాండ్స్‌కు ఆమోదం తెలిపిన తర్వాత అప్రోప్రియేషన్ బిల్-2026ను కూడా ఆమోదించింది. ఈ బిల్ ద్వారా 2025–26 ఆర్థిక సంవత్సరానికి సంబంధించి కన్సాలిడేటెడ్ ఫండ్ ఆఫ్ ఇండియా నుంచి అదనపు నిధులను ఖర్చు చేయడానికి ప్రభుత్వానికి అధికారం లభిస్తుంది. అనంతరం సభను సోమవారం ఉదయం 11 గంటలకు తిరిగి సమావేశమయ్యేలా వాయిదా వేశారు.

ఇక మరోవైపు పార్లమెంట్‌లో ఎల్పీజీ సంక్షోభంపై తీవ్ర రాజకీయ వాగ్వాదం చోటు చేసుకుంది. ఈ సందర్భంలో ఎంపీ నిషికాంత్ దుబే లోక్‌సభలో ప్రతిపక్ష నాయకుడు రాహుల్ గాంధీపై విమర్శలు చేశారు. పార్లమెంట్ భవనం వద్ద ఉన్న “మకర్ ద్వార్” వద్ద టీ, కాఫీ తాగుతూ సహచరులతో కలిసి పిక్నిక్ చేసినట్టు ఆరోపిస్తూ “పార్లమెంట్ పిక్నిక్ స్థలం కాదు” అని రాహుల్ గాంధీని ఉద్దేశించి వ్యాఖ్యానించారు.

ఇదే సమయంలో ఎల్పీజీ సంక్షోభంపై ప్రతిపక్ష ఎంపీలు పార్లమెంట్ ప్రాంగణంలో నిరసన ప్రదర్శనలు చేపట్టారు. తృణమూల్ కాంగ్రెస్ ఎంపీలు ఉదయం 10.30 ప్రాంతంలో పార్లమెంట్ భవనం బయట పోస్టర్లు పట్టుకుని “ఎల్పీజీ సంక్షోభం” అంటూ నినాదాలు చేశారు. కాంగ్రెస్, ఇతర ఇండియా బ్లాక్ పార్టీల ఎంపీలు కూడా ఈ నిరసనలో పాల్గొన్నారు.

తృణమూల్ కాంగ్రెస్ ఎంపీ మహువా మొయిత్రా మాట్లాడుతూ దేశంలో ఎల్పీజీ తీవ్రమైన కొరత ఉందని ఆరోపించారు. చాలా చోట్ల ప్రజలు గ్యాస్ సిలిండర్ల కోసం క్యూలో నిలబడాల్సి వస్తోందని ఆమె అన్నారు. ప్రభుత్వం రెండు రోజులలో సిలిండర్లు అందుతాయని చెబుతోందని, కానీ ప్రజలు అలా పొందడం లేదని ఆమె విమర్శించారు.

ప్రస్తుతం పశ్చిమ ఆసియా సంక్షోభం కారణంగా వాణిజ్య ఎల్పీజీ సరఫరాలో అంతరాయం ఏర్పడింది. దీనివల్ల దేశంలోని హోటల్ రంగం తీవ్రంగా ప్రభావితమైందని సమాచారం. అయితే ప్రభుత్వం పరిస్థితిని సమర్థంగా ఎదుర్కొంటామని చెబుతోంది. ప్రధాని నరేంద్ర మోడీ ప్రజలు ఆందోళన చెందాల్సిన అవసరం లేదని, ప్రజల ప్రయోజనాలను కాపాడుతామని ఇప్పటికే హామీ ఇచ్చారు.

లోక్‌సభలో అదనపు గ్రాంట్లకు ఆమోదం - ఎల్పీజీ సంక్షోభంపై రాజకీయ వాగ్వాదం - Tholi Paluku