
లిక్కర్ పాలసీ కేసులో కేజ్రీవాల్ స్పందించాలి: హైకోర్టు
ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విచారణ కోర్టు చేసిన వ్యాఖ్యలను తొలగించాలంటూ దాఖలైన పిటిషన్పై స్పందించేందుకు మాజీ ముఖ్యమంత్రి అరవింద్ కేజ్రీవాల్, మాజీ ఉప ముఖ్యమంత్రి మనీశ్సిసోడియా తదితరులకు ఢిల్లీ హైకోర్టు చివరి అవకాశం ఇచ్చింది. ఈ కేసులో ఈడీ దాఖలు చేసిన పిటిషన్పై విచారణ చేపట్టిన న్యాయమూర్తి స్వరాణ కాంత శర్మ, స్పందన దాఖలు చేయడానికి ఇదే చివరి అవకాశం అని పేర్కొన్నారు. తదుపరి విచారణ ఏప్రిల్ 22న జరపనున్నట్లు తెలిపారు.
గత విచారణ సందర్భంగా సమయం ఇచ్చినా ప్రతివాదుల్లో చాలా మంది కౌంటర్ దాఖలు చేయలేదని కోర్టు గమనించింది. వినోద్ చౌహాన్ తప్ప మిగిలినవారు ఎవరూ స్పందించలేదని ఈడీ తరఫు న్యాయవాది అదనపు సొలిసిటర్ జనరల్ ఎస్.వి. రాజు కోర్టుకు తెలిపారు. గత నెల 19న ఈడీ పిటిషన్పై స్పందించేందుకు కేజ్రీవాల్, ఇతరులకు కోర్టు ఏప్రిల్ 2 వరకు గడువు ఇచ్చింది. తమపై విచారణ కోర్టు చేసిన వ్యాఖ్యలు అవసరం లేని విధంగా ఉన్నాయని ఈడీ తన పిటిషన్లో పేర్కొంది. ఆ కేసులో తాము పార్టీగా లేమని, తమ వాదనలు వినకుండా కోర్టు వ్యాఖ్యలు చేయడం సరైనది కాదని తెలిపింది. ఈ వ్యాఖ్యలు అలాగే కొనసాగితే ప్రజలకు కూడా నష్టం జరుగుతుందని ఈడీ వాదించింది. అందువల్ల మనీలాండరింగ్ చట్టం కింద ఈడీ చేసిన దర్యాప్తుకు సంబంధించిన వ్యాఖ్యలను తొలగించాలని కోరింది.
ఇక ఫిబ్రవరి 27న విచారణ కోర్టు ఇచ్చిన తీర్పులో కేజ్రీవాల్, సిసోడియా తదితరులను ఢిల్లీ లిక్కర్ పాలసీ కేసులో విముక్తి కల్పించింది. సీబీఐ దాఖలు చేసిన కేసులో సరైన ఆధారాలు లేవని కోర్టు పేర్కొంది. ఆరోపణలు కేవలం ఊహాగానాలపై ఆధారపడి ఉన్నాయని, వాటికి సరైన ఆధారాలు లేవని కోర్టు వ్యాఖ్యానించింది. ఇలాంటి పరిస్థితుల్లో పూర్తి స్థాయి క్రిమినల్ విచారణకు నిందితులను గురిచేయడం న్యాయసమ్మతం కాదని పేర్కొంది. అదేవిధంగా సరైన ఆధారాలు లేకుండా మనీలాండరింగ్ చట్టం కింద అరెస్టులు చేయడం వ్యక్తిగత స్వేచ్ఛపై ప్రభావం చూపుతుందని కోర్టు అభిప్రాయపడింది. ప్రివెన్షన్ ఆఫ్ మనీ లాండరింగ్ యాక్ట్ కింద ఉన్న అధికారాలు విస్తృతమైనవైనా అవి రాజ్యాంగ హామీలను అతిక్రమించకూడదని కోర్టు స్పష్టం చేసింది.
