Let's talk: editor@tmv.in
లండన్ పర్యటనకు సిద్ధమవుతున్న ఆంధ్రా పర్యాటకం

లండన్ పర్యటనకు సిద్ధమవుతున్న ఆంధ్రా పర్యాటకం

Praveen Kumar
2 నవంబర్, 2025

ఆంధ్రప్రదేశ్ పర్యాటక సామర్థ్యం వచ్చే వారం ప్రపంచవ్యాప్తంగా దృష్టిని ఆకర్షించనుంది, ఎందుకంటే రాష్ట్రం లండన్‌లో జరిగే వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025లో పాల్గొనడానికి సిద్ధమవుతోంది. నవంబర్ 4 నుండి 6 వరకు జరగనున్న ఈ పర్యటనకు పర్యాటక, సాంస్కృతిక, సినిమాటోగ్రఫీ మంత్రి కందుల దుర్గేష్ నాయకత్వం వహించనున్నారు. ఆయన దాదాపు 30 మంది అంతర్జాతీయ ప్రతినిధులతో చర్చలు జరిపే అవకాశం ఉంది. ఆంధ్రప్రదేశ్‌ను ప్రపంచ పర్యాటక వేదికపై నిలపడానికి చేపట్టిన పునరుద్ధరణ ప్రయత్నాలలో భాగంగా అధికారులు ఈ చర్యను అభివర్ణించారు.

గ్లోబల్ టూరిజంపై దృష్టి సారించిన ప్రాంతాలు

ప్రపంచంలోనే అతిపెద్ద ట్రావెల్ అండ్ టూరిజం ఎగ్జిబిషన్‌లలో ఒకటైన వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో ఆంధ్రప్రదేశ్ ప్రాతినిధ్యం వహిస్తుందని సమాచార, ప్రజా సంబంధాల శాఖ అక్టోబర్ 31న అధికారికంగా ప్రకటించింది. ఏటా లండన్‌లో జరిగే ఈ వరల్డ్ ట్రావెల్ మార్కెట్ కు 180కి పైగా దేశాల నుండి వేలాది మంది ప్రతినిధులు, పెట్టుబడిదారులు, ట్రావెల్ నిపుణులు హాజరవుతారు.

అధికారుల సమాచారం ప్రకారం, మంత్రి దుర్గేష్ ఆంధ్రప్రదేశ్ పర్యాటక ప్రణాళికను (టూరిజం రోడ్‌మ్యాప్) సమర్పించనున్నారు. ముఖ్యంగా వారసత్వ, పర్యావరణ, ఆధ్యాత్మిక పర్యాటకంపై దృష్టి సారించడంతో పాటు, ఆతిథ్య రంగంలో విదేశీ పెట్టుబడి అవకాశాలను అన్వేషించనున్నారు. ఈ ప్రతినిధి బృందంలో ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్, టూరిజం ఇన్‌ఫ్రాస్ట్రక్చర్ డివిజన్ నుండి సీనియర్ అధికారులు ఉంటారు. వీరు విశాఖపట్నం, తిరుపతి, అమరావతి, మరియు అరకు లోయ వంటి ముఖ్య ప్రాంతాల సమాచారాన్ని ప్రదర్శిస్తారు,అలాగే వాటిని వివరిస్తారు.

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ లో రాష్ట్రం పాల్గొనడం అంతర్జాతీయ పర్యాటక మార్కెట్లలో ఆంధ్రప్రదేశ్ ఉనికిని పునఃస్థాపించడానికి ఒక ముఖ్యమైన అడుగుగా దీనిని ఆంధ్ర ప్రదేశ్ ప్రభుత్వం భావిస్తుంది. ప్రభుత్వం ఇచ్చే ప్రదర్శనలో "పెట్టుబడికి సిద్ధంగా ఉన్న" ప్రాజెక్టులపై దృష్టి పెట్టే అవకాశం ఉంది, వీటిలో బాగా అభివృద్ధి చెందిన మౌలిక సదుపాయాలు, కనెక్టివిటీ, పర్యాటక సౌకర్యాలు ఉన్నాయి.

అధికారులు వెల్లడించిన సమాచారం ప్రకారం, విశాఖపట్నం బీచ్,(క్రూయిజ్ టూరిజం కేంద్రంగా) తిరుపతి ఆధ్యాత్మికత (దేవాలయ పర్యాటకం కోసం), అమరావతి (వారసత్వ రాజధాని ప్రాంత పర్యాటకం కోసం), అరకు లోయ పర్యావరణ (ఎకో),(కాఫీ ఆధారిత పర్యాటకం కోసం) ప్రచారం చేయబడతాయి ఈ ప్రాంతాలను వాటి అందుబాటు, పర్యాటక మౌలిక సదుపాయాలు, ప్రైవేట్ పెట్టుబడికి సంసిద్ధత ఆధారంగా ఎంపిక చేశారు.

2025 ప్రతినిధి బృందం దాదాపు దశాబ్దంలో ఆంధ్రప్రదేశ్ నుండి మంత్రి నేతృత్వంలో వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనడం ఇదే తొలిసారి. గతంలో, 2017 మరియు 2022లో పర్యాటక అధికారులు రాష్ట్రం తరపున పాల్గొన్నారు, ఆ సమయంలో 'ఇన్‌క్రెడిబుల్ ఇండియా పెవిలియన్'లో ప్రచార సామగ్రి మరియు గమ్యస్థానాల (డెస్టినేషన్) చిత్రాలను ప్రదర్శించారు.

2017లో ఆంధ్రప్రదేశ్ పాల్గొన్న తరువాత, ముఖ్యంగా తిరుపతి, విశాఖపట్నం, మరియు అమరావతి వద్ద పర్యాటకుల రాకలో కొంత వృద్ధి నమోదైంది. దీనికి కారణం పర్యాటక మంత్రిత్వ శాఖ యొక్క బౌద్ధ సర్క్యూట్ కార్యక్రమం ద్వారా పెరిగిన ప్రచారమే. అయితే, పర్యాటక మౌలిక సదుపాయాలలో ప్రత్యక్ష విదేశీ పెట్టుబడి పరిమితంగానే ఉంది.

గండికోట ప్రాజెక్ట్ ఇంకా కాగితాలకే పరిమితం

వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025లో ఆంధ్రప్రదేశ్ ప్రపంచ పెట్టుబడిదారులను ఆకర్షించాలని లక్ష్యంగా పెట్టుకున్నప్పటికీ, రాష్ట్రంలోని అత్యంత ఆకర్షణీయమైన దేశీయ గమ్యస్థానాలలో ఒకటైన గండికోట, దీనిని "భారతదేశపు గ్రాండ్ కాన్యన్" అని పిలుస్తారు. దాని పర్యాటక మాస్టర్‌ప్లాన్‌కు ప్రభుత్వ ఆమోదం కోసం ఇంకా వేచి చూస్తోంది.

కడప జిల్లాలో ఉన్న గండికోట, పెన్నార్ నదిచే ఏర్పడిన అద్భుతమైన లోయ (గారి్జ) మరియు 12వ శతాబ్దానికి చెందిన పురాతన గండికోట కోట కారణంగా ప్రాచుర్యం పొందింది. దాని సహజ సౌందర్యం, పెరుగుతున్న దేశీయ పర్యాటకుల సంఖ్య ఉన్నప్పటికీ, గండికోట ఇంటిగ్రేటెడ్ టూరిజం ప్రాజెక్ట్ ఆంధ్రప్రదేశ్ టూరిజం డెవలప్‌మెంట్ కార్పొరేషన్ కింద ప్రతిపాదన దశలోనే ఉంది. ఈ ప్రాజెక్ట్, మొదట 2017లో ఆసియన్ డెవలప్‌మెంట్ బ్యాంక్ సహాయంతో కూడిన పర్యాటక ప్రణాళిక కింద రూపొందించబడింది. ఇందులో రివర్‌ఫ్రంట్ ఎకో-రిసార్ట్‌లు, అడ్వెంచర్ స్పోర్ట్స్ జోన్‌లు, వీక్షణ డెక్‌లు మరియు కోట ప్రాంతాన్ని సమీప కొండ ప్రాంతాలకు కలిపే రోప్‌వే వ్యవస్థను ఏర్పాటు చేయాలని ప్రతిపాదించారు. ఆ సమయంలో దీని అంచనా వ్యయం ₹50 నుండి ₹60 కోట్లుగా ఉంది.

2019లో ప్రభుత్వం మారిన తరువాత, ఈ ప్రతిపాదనను రాష్ట్ర పర్యాటక విధానం 2020 - 25కు అనుగుణంగా ఎకో-అడ్వెంచర్ టూరిజం ప్రాజెక్టుగా తిరిగి వర్గీకరించారు. దాని వివరణాత్మక ప్రాజెక్ట్ రిపోర్ట్ సవరణ కోసం ఏపిటిడిసి కి తిరిగి పంపబడింది. డీపీఆర్ 2023 చివరలో పూర్తయింది, కానీ రాష్ట్ర ఎన్నికలకు ముందు క్యాబినెట్ స్థాయి ఆమోదం పొందలేదు. సవరించిన డిపిఆర్ ఇంకా సమీక్షలో ఉందని, ఈ ప్రాజెక్టును ప్రజా-ప్రైవేట్ భాగస్వామ్యం (పిపిపి) కింద అభివృద్ధి చేయాలా లేక ప్రభుత్వ నిధులతో చేయాలా అనే దానిపై చర్చలు కొనసాగుతున్నాయని అధికారులు ధృవీకరించారు.

పరిపాలనా, పర్యావరణ ఆలస్యం

ఏపిటీడీసి అంతర్గత సమీక్ష (ఆగస్టు 2024) ప్రకారం, ఈ ప్రాజెక్టు ఆలస్యానికి అనేక పరిపాలనా అనుమతులు, భూ కేటాయింపు సమస్యలే కారణం. గండికోట కోట చుట్టూ ఉన్న సుమారు 60 ఎకరాల భూమి రాష్ట్ర పురావస్తు శాఖ పరిధిలోకి వస్తుంది, దీనికి అంతర్-విభాగ బదిలీ అవసరం. అదనంగా, పెన్నార్ రివర్‌ఫ్రంట్ అభివృద్ధి భాగానికి పర్యావరణ ప్రభావ అంచనా నిబంధనల ప్రకారం పర్యావరణ అనుమతి అవసరం.

గండికోట ప్రాజెక్టు "పెట్టుబడి సంసిద్ధతలో ఇంకా ప్రాథమిక దశలోనే" ఉన్నందున వరల్డ్ ట్రావెల్ మార్కెట్ 2025లో ప్రదర్శించబడటం లేదని ఒక సీనియర్ పర్యాటక అధికారి పేర్కొన్నారు. ఈ సంవత్సరం దృష్టి "అంతర్జాతీయ సహకారాన్ని తక్షణమే ఆకర్షించే సామర్థ్యం ఉన్న ప్రాజెక్టులపై" ఉందని ఆ అధికారి తెలిపారు. అయితే, గండికోట లాంబసింగి మరియు కొండవీడు కోటతో పాటు దీర్ఘకాలిక ప్రణాళికలో "ఎకో-అడ్వెంచర్ టూరిజం క్లస్టర్ ఫేజ్-2 " లో భాగంగా ఉంటుందని ప్రభుత్వం సూచించింది. అన్ని అనుమతులు మరియు తుది నిధుల నమూనా పూర్తయిన తర్వాత, సవరించిన మాస్టర్‌ప్లాన్‌కు క్యాబినెట్ స్థాయి ఆమోదం 2026 ప్రారంభంలో లభించే అవకాశం ఉంది.

ఆదాయ సామర్థ్యం, దృక్పథం (ఔట్‌లుక్)

ప్రపంచ పర్యాటక ప్రదర్శన నుండి మినహాయించబడినప్పటికీ, గండికోట దేశీయ పర్యాటకం ద్వారా గణనీయమైన ఆదాయాన్ని ఆర్జిస్తోంది. 2024 నాటి గణాంకాల ప్రకారం, ఈ ప్రాంతాన్ని ఏటా దాదాపు 3.5 నుండి 4 లక్షల మంది పర్యాటకులు సందర్శిస్తున్నారు, దీని ద్వారా స్థానికంగా దాదాపు ₹5 నుండి ₹6 కోట్ల ఆదాయం లభిస్తోంది. పూర్తిస్థాయి అభివృద్ధి జరిగితే, గండికోట సందర్శకుల సంఖ్య ఏడాదికి 10 లక్షలకు చేరి, ₹25 నుండి ₹30 కోట్ల వార్షిక ఆదాయాన్ని మరియు స్థానిక నివాసితులకు గణనీయమైన ఉపాధి అవకాశాలను అందించగలదని పర్యాటక అధికారులు అంచనా వేస్తున్నారు.

కడప - గండికోట రహదారి మెరుగుదల, కడప విమానాశ్రయం విస్తరణ పూర్తి కావడం వలన అందుబాటు మరింత మెరుగుపడుతుందని, భవిష్యత్తులో అంతర్జాతీయ పర్యాటక ప్రమోషన్లలో గండికోటకు చోటు దక్కుతుందని అధికారులు విశ్వసిస్తున్నారు.

ప్రపంచ గుర్తింపు దిశగా ఒక అడుగు

ఆంధ్రప్రదేశ్ వరల్డ్ ట్రావెల్ మార్కెట్‌లో పాల్గొనడానికి సిద్ధమవుతున్న తరుణంలో, సంస్కృతి, ఆధ్యాత్మికత, ప్రకృతి మరియు ఆధునిక ఆతిథ్యాన్ని కలిపి, రాష్ట్రాన్ని వైవిధ్యభరితమైన పర్యాటక గమ్యస్థానంగా రీబ్రాండింగ్ చేయడంపై దృష్టి సారించారు.

ఈ సంవత్సరం విశాఖపట్నం, తిరుపతి వంటి ప్రముఖ గమ్యస్థానాలను ప్రపంచానికి ప్రదర్శిస్తున్నప్పటికీ, గండికోట వంటి ప్రాజెక్టులు రాష్ట్రం యొక్క దీర్ఘకాలిక పర్యాటక విజన్ యొక్క తదుపరి దశను సూచిస్తాయి. పునరుద్ధరించిన అంతర్జాతీయ భాగస్వామ్యం మరియు కొనసాగుతున్న మౌలిక సదుపాయాల ప్రణాళికతో, ఆంధ్రప్రదేశ్ పర్యాటక రంగం ప్రపంచ గుర్తింపు దిశగా పయనిస్తోంది. అయితే దాని అత్యంత అద్భుతమైన సహజ సంపదలలో కొన్ని పూర్తి అభివృద్ధి కోసం ఇంకా వేచి చూడాల్సి ఉంది.

లండన్ పర్యటనకు సిద్ధమవుతున్న ఆంధ్రా పర్యాటకం - Tholi Paluku