
రోడ్ల నాణ్యతలో రాజీపడితే చర్యలు తప్పవు: గడ్కరీ హెచ్చరిక
రహదారుల నిర్మాణంలో నాణ్యతకు అత్యున్నత ప్రాధాన్యత ఇవ్వాలని, లేకుంటే కాంట్రాక్టర్లపై కఠిన చర్యలు తీసుకోవాల్సి వస్తుందని కేంద్ర రహదారుల రవాణా, జాతీయ రహదారుల శాఖ మంత్రి నితిన్ గడ్కరీ స్పష్టం చేశారు.
గుజరాత్లోని గాంధీనగర్లో గురువారం ఎన్హెచ్ఏఐ అధికారులు, కాంట్రాక్టర్లతో సమీక్షా సమావేశం నిర్వహించిన ఆయన... నాణ్యత లేకుండా పనులు చేస్తే కనీసం క్షమాపణలు కూడా ఉండవని స్పష్టం చేశారు. గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ సమక్షంలో జరిగిన ఈ సమావేశంలో గడ్కరీ మాట్లాడుతూ ప్రజల సౌకర్యం, భద్రతే ముఖ్యం.రోడ్లు త్వరగా పూర్తి కావాలి. కానీ నాణ్యతలో రాజీ ఉండకూడదు. గడువు దాటితే, నాణ్యత తగ్గితే ఎవరైనా సారీ అని చెప్పి బయటపడలేరని హెచ్చరించారు. అంతకుముందు సబరకాంఠ జిల్లా హిమ్మత్ నగర్లో నెలవంకి జాతీయ రహదారి-48లో నిర్మాణంలో ఉన్న భాగాన్ని, మోతీపుర ఫ్లైఓవర్, అండర్పాస్ పనులను ఆయన పరిశీలించారు. ఇక్కడ కూడా నాణ్యతలో రాజీ లేదు అని అధికారులను ఆదేశించారు. గురువారం సౌత్ గుజరాత్లోని సూరత్కు చేరుకున్న గడ్కరీ, అక్కడ నేషనల్ హైవే ఆధ్వర్యంలో చేపట్టిన పనులను పరిశీలించారు.
గుజరాత్కు రూ.20,000 కోట్లు
సమావేశంలో గుజరాత్ ముఖ్యమంత్రి భూపేంద్ర పటేల్ కూడా పాల్గొన్నారు. రాష్ట్రంలో జాతీయ రహదారులు మొత్తం ట్రాఫిక్లో 35శాతం భారాన్ని మోస్తున్న నేపథ్యంలో అవసరమైన చోట విస్తరణ పనులు జరిగేలా చూడాలని కోరారు. జాతీయ రహదారుల నిర్మాణం, రీసర్ఫేసింగ్ సహా సంబంధిత ప్రాజెక్టులకు రూ. 20,000 కోట్లు కేటాయిస్తామని నితిన్ గడ్కరీ హామీ ఇచ్చారు. ముఖ్యంగా అహ్మదాబాద్-ముంబై, రాజ్కోట్-గోండల్-జెట్పూర్, అహ్మదాబాద్-ఉదయ్పూర్ మార్గాల్లో పనులు వేగవంతం చేయాలని గుజరాత్ సీఎం కోరారు
