
రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ పథకానికి క్యాబినెట్ ఆమోదం
స్వావలంబనను పెంచడానికి ప్రపంచ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ మార్కెట్లో భారతదేశాన్ని కీలక పాత్ర పోషించే దేశంగా నిలపడానికి ఉద్దేశించిన ఒక ముఖ్యమైన కార్యక్రమంలో భాగంగా, ప్రధాన మంత్రి నరేంద్ర మోడీ అధ్యక్షతన కేంద్ర మంత్రివర్గం బుధవారం రూ. 7,280 కోట్ల ఆర్థిక వ్యయంతో 'సింటర్డ్ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ తయారీని ప్రోత్సహించే పథకాన్ని' ఆమోదించింది.
ఈ మొట్టమొదటి ప్రయత్నం భారతదేశంలో 6,000 మెట్రిక్ టన్నుల ప్రతి సంవత్సరం సమీకృత రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీని స్థాపించాలని లక్ష్యంగా పెట్టుకుంది.
కేంద్ర మంత్రివర్గ నిర్ణయాలపై విలేకరులకు వివరించిన సమాచార, ప్రసార శాఖ మంత్రి అశ్విని వైష్ణవ్ దీనిని "చాలా ముఖ్యమైన, వ్యూహాత్మక నిర్ణయం"గా అభివర్ణించారు.
ఈ పథకం యొక్క మొత్తం ఆర్థిక వ్యయం రూ. 7280 కోట్లు, ఇందులో రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ విక్రయాలపై ఐదేళ్లపాటు రూ. 6,450 కోట్ల అమ్మకాల అనుసంధాన ప్రోత్సాహకాలు 6,000 ఎమ్ టిపిఏ రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ సౌకర్యాలను ఏర్పాటు చేయడానికి రూ. 750 కోట్ల మూలధన రాయితీ ఉన్నాయి.
పథకం యొక్క మొత్తం వ్యవధి, సమీకృత రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ సౌకర్యాన్ని ఏర్పాటు చేయడానికి రెండేళ్ల క్లిష్ట కాలంతో పాటు, రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ విక్రయాలపై ప్రోత్సాహకాలను పంపిణీ చేయడానికి ఐదేళ్ల కాలంతో కలిపి, కేటాయింపు తేదీ నుండి ఏడు సంవత్సరాలు ఉంటుందని అధికారిక ప్రకటన తెలిపింది.
ఈ పథకం గ్లోబల్ పోటీ బిడ్డింగ్ ప్రక్రియ ద్వారా మొత్తం సామర్థ్యాన్ని ఐదుగురు లబ్ధిదారులకు కేటాయించాలని కాబినేట్ ఆమోదించింది. ప్రతి లబ్ధిదారునికి గరిష్టంగా 1,200 ఎమ్ టిపిఏ సామర్థ్యం కేటాయించబడుతుంది.
రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ లు అత్యంత శక్తివంతమైన శాశ్వత అయస్కాంతాలలో ఒకటి అలాగే ఎలక్ట్రిక్ వాహనాలు, పునరుత్పాదక శక్తి, ఎలక్ట్రానిక్స్, ఏరోస్పేస్, రక్షణ రంగాల అనువర్తనాలకు అత్యంత కీలకం.
ఈ పథకం రేర్ ఎర్త్ ఆక్సైడ్లను లోహాలుగా, లోహాలను మిశ్రమాలుగా, మిశ్రమాలను తుది రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ లుగా మార్చడంతో సహా సమీకృత రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ సౌకర్యాల సృష్టికి మద్దతు ఇస్తుంది.
"భారత ప్రభుత్వం తీసుకున్న ఈ చొరవ దేశీయరేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ తయారీ వ్యవస్థను బలోపేతం చేయడానికి, ప్రపంచ మార్కెట్లలో పోటీతత్వాన్ని పెంచడానికి ఒక మైలురాయి లాంటిది. రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ ఉత్పత్తిలో దేశీయ సామర్థ్యాలను పెంపొందించడం ద్వారా, ఈ పథకం దేశీయ పరిశ్రమలకు రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్ సరఫరా గొలుసును సురక్షితం చేయడమే కాక, దేశం యొక్క నికర సున్నా 2070 లక్ష్యానికి కూడా మద్దతు ఇస్తుంది" అని ప్రకటన పేర్కొంది.
"ఇది వికసిత్ భారత్ @2047 లక్ష్యానికి అనుగుణంగా, సాంకేతికంగా స్వావలంబన కలిగిన, ప్రపంచ పోటీతత్వం ఉన్న స్థిరమైన పారిశ్రామిక స్థావరాన్ని నిర్మించాలనే ప్రభుత్వ తిరుగులేని నిబద్ధతను ఇది ప్రతిబింబిస్తుంది," అని ఈ ప్రకటన సారాంశం.
భారతదేశం ప్రస్తుతం రేర్ ఎర్త్ పర్మనెంట్ మ్యాగ్నెట్స్ దిగుమతులపై, ప్రధానంగా చైనా నుండి, ఎక్కువగా ఆధారపడుతోంది. ప్రతిపాదిత ప్రోత్సాహక యంత్రాంగం దేశంలో అభివృద్ధి చెందని ప్రాసెసింగ్, శుద్ధి, మ్యాగ్నెట్ తయారీ సామర్థ్యాలలో పెట్టుబడికి మద్దతు ఇస్తుందని భావిస్తున్నారు.
