
రేపు హైదరాబాద్లో ‘యువ భారత్ రన్’
భాగ్యనగరం మరో భారీ క్రీడా సంబరానికి వేదిక కాబోతోంది. (రేపు) ఆదివారం ఉదయం 6:00 గంటల నుంచి ‘యువ భారత్ రన్’ ఘనంగా జరగనుంది. పాఠశాల విద్యార్థులు, కళాశాల యువత, జెన్-జీ ప్రతినిధులు, చిన్నపిల్లలు వారి కుటుంబాలను ఏకతాటిపైకి తెస్తూ.. భారతదేశపు అతిపెద్ద యువజన ఫిట్నెస్ ఉద్యమంగా ఇది ఆవిర్భవిస్తోంది.
ప్రపంచ ఆరోగ్య సంస్థ గణాంకాల ప్రకారం, భారతీయ యువతలో 72శాతం మంది శారీరక శ్రమకు దూరంగా ఉంటున్నారు. అంతేకాకుండా, ఊబకాయంలో భారత్ ప్రపంచంలోనే రెండో స్థానంలో ఉంది. నేటి యువత సోషల్ మీడియాలో చురుగ్గా ఉంటున్నప్పటికీ, నిజ జీవితంలో తోటివారితో కలిసి కదిలే సందర్భాలు తగ్గిపోతున్నాయి. ఈ ధోరణిని మార్చి, యువతలో క్రమశిక్షణ, ఆరోగ్యం, చురుకైన జీవనశైలిని పెంపొందించడమే ఈ ‘యువ భారత్ రన్’ ప్రధాన లక్ష్యం.
రికార్డు స్థాయిలో భాగస్వామ్యం
ఈ విడత రన్లో సుమారు 12,000 మందికి పైగా యువకులు వారి కుటుంబ సభ్యులు పాల్గొంటారని అంచనా. ఈ ఈవెంట్లో ప్రత్యేక ఆకర్షణగా 5 కిలోమీటర్ల పేస్డ్ రన్ ఉంటుంది. ఇందులో అనుభవజ్ఞులైన రన్నర్ల మార్గదర్శకత్వంలో యువకులు పరుగు తీస్తారు. ఈ రన్ ద్వారా ఫిట్నెస్, శారీరక చురుకుదనం వంటి అంశాలను యువత రోజువారీ జీవితంలో భాగంగా మార్చే లక్ష్యాన్ని నిర్వాహకులు ముందుంచారు. కేవలం పాల్గొనడం మాత్రమే కాకుండా, సహనశక్తి, పట్టుదల వంటి విలువలను కూడా ఈ కార్యక్రమం ద్వారా పెంపొందించాలని భావిస్తున్నారు.
ఈ వినూత్న కార్యక్రమానికి యువ పారిశ్రామికవేత్త, విద్యావేత్త యశస్వి మల్కా నాయకత్వం వహిస్తున్నారు. "యువ భారత్ రన్ అనేది కేవలం ఒక రోజు జరిగే ఈవెంట్ కాదు, ఇది జెన్-జీ ఫిట్నెస్ ఉద్యమానికి ఆరంభం. మన పిల్లలు, విద్యార్థులు ఆరోగ్యంగా ఉంటేనే నవ భారతం బలంగా ఉంటుంది," అని యశస్వి మల్కా తన దార్శనికతను పంచుకున్నారు.
ఈ కార్యక్రమానికి ఢిల్లీ పబ్లిక్ స్కూల్ (డీపీఎస్) పల్లవి గ్రూప్ ఆఫ్ ఇన్స్టిట్యూషన్స్ మద్దతుగా నిలిచాయి. బీజేపీ డెప్యూటీ ఫ్లోర్ లీడర్, ఎమ్మెల్సీ, డీపీఎస్ చైర్మన్ మల్కా కొమరయ్య మార్గదర్శకత్వంలో యువజన అభివృద్ధి లక్ష్యంగా ఈ రన్ సాగుతోంది. దీనికి కేంద్ర ప్రభుత్వ ‘ఫిట్ ఇండియా’ యువజన వ్యవహారాల మంత్రిత్వ శాఖకు చెందిన ‘మై భారత్’ ప్లాట్ఫాం మద్దతు లభిస్తోంది.
ఈ పరుగు కేవలం శారీరక దృఢత్వానికే పరిమితం కాకుండా, మానసిక ఆరోగ్యంపై కూడా దృష్టి సారించింది. ఇందులో హార్ట్ఫుల్నెస్ మెడిటేషన్ పార్ట్నర్గా చేరింది. వ్యాయామంతో పాటు ధ్యానం ద్వారా అంతర్గత ప్రశాంతతను ఎలా పొందాలో యువతకు తెలియజేయడం దీని ఉద్దేశ్యం. 'ది నైలు మైల్' వ్యవస్థాపకుడు అనంత్ సంజీవ్ దూగర్ ఈ ఈవెంట్ మేనేజ్మెంట్ బాధ్యతలను నిర్వహిస్తున్నారు. ఈ వార్షిక వేదిక ద్వారా పాఠశాలలు, కళాశాలలు, తల్లిదండ్రులు ఏకమై ఆరోగ్యకరమైన రేపటి తరాన్ని నిర్మిస్తారని ఆశిద్దాం.
కార్యక్రమ వివరాలు
తేదీ: 29 మార్చి
సమయం: ఉదయం 6:00 గంటల నుంచి ప్రారంభం
వేదిక: హైదరాబాద్లోని నెక్లెస్ రోడ్, పీపుల్స్ ప్లాజా
