Let's talk: editor@tmv.in
రేపు 'రైతు భరోసా' నిధుల విడుదల

రేపు 'రైతు భరోసా' నిధుల విడుదల

Gaddamidi Naveen
21 మార్చి, 2026

తెలంగాణ రాష్ట్రంలోని అన్నదాతలకు ప్రభుత్వం తీపికబురు అందించింది. 'రైతు భరోసా' పెట్టుబడి సాయం పథకం కింద నిధుల విడుదలను మార్చి 22 నుంచి ప్రారంభించనున్నట్లు ముఖ్యమంత్రి ఎ. రేవంత్ రెడ్డి గురువారం ప్రకటించారు. రాష్ట్ర ప్రభుత్వం ఆధ్వర్యంలో నిర్వహించిన తెలుగు నూతన సంవత్సర 'ఉగాది' వేడుకల్లో ఆయన ఈ కీలక ప్రకటన చేశారు.

రాష్ట్రంలోని రైతుల పెట్టుబడి అవసరాలను తీర్చేందుకు ఈ పథకం కీలకంగా ఉపయోగపడుతుందని ప్రభుత్వం భావిస్తోంది. ఇప్పటికే మార్చి 15న ప్రభుత్వం రూ. 9,000 కోట్లను రైతుల బ్యాంకు ఖాతాల్లో జమ చేయనున్నట్లు ప్రకటించింది. గత రెండు సంవత్సరాల్లో ‘రైతు భరోసా’ ద్వారా రూ. 18,000 కోట్లను పంపిణీ చేసినట్లు సీఎం వివరించారు. ప్రతి ఎకరాకు సంవత్సరానికి రూ. 12,000 చొప్పున సాయం అందుతున్నట్లు చెప్పారు.

అలాగే, ‘సాదా బైనామా’ పద్ధతిలో కొనుగోలు చేసిన వ్యవసాయ భూములకు సంబంధించిన సమస్యలను రెవెన్యూ శాఖ త్వరలో పరిష్కరించనుందని తెలిపారు. దీని ద్వారా రైతులకు భూములపై హక్కులు స్పష్టత పొందే అవకాశం ఉంటుంది. రైతుల సంక్షేమానికి ప్రభుత్వం ప్రాధాన్యత ఇస్తోందని స్పష్టం చేసిన సీఎం, రూ. 2 లక్షల వరకు వ్యవసాయ రుణమాఫీ కార్యక్రమాన్ని పూర్తి చేసినట్లు చెప్పారు. ఈ చర్యల వల్ల 25 లక్షలకుపైగా కుటుంబాలు లబ్ధి పొందాయని తెలిపారు.

రాష్ట్రం ఐటీ, పరిశ్రమల రంగాల్లో అభివృద్ధి సాధించినప్పటికీ, ఇంకా 70 శాతం జనాభా వ్యవసాయంపై ఆధారపడుతున్నదని సీఎం పేర్కొన్నారు. కేంద్ర ప్రభుత్వం విడుదల చేసిన గణాంకాల ప్రకారం, తెలంగాణలో రైతుల అప్పు భారం దేశంలోనే తక్కువగా ఉండటం గర్వకారణమని ఆయ‌న‌ అన్నారు.

రేపు 'రైతు భరోసా' నిధుల విడుదల - Tholi Paluku