
రేపు డీజీసీఏ ముందుకు ‘ఇండిగో’ సీఈవో
ఇండిగో విమానాల కార్యకలాపాల్లో ఇటీవల ఏర్పడిన భారీ అంతరాయాలపై విచారణ జరుపుతున్న డైరెక్టరేట్ జనరల్ ఆఫ్ సివిల్ ఏవియేషన్ నియమించిన ప్యానెల్, బుధవారం ఇండిగో సంస్థ సీఈవో పీటర్ ఎల్బర్స్, సీఓఓ ఇసిడ్రె పోర్కేరాస్ లను హాజరుకావాల్సిందిగా సమన్లు జారీ చేసే అవకాశం ఉన్నట్లు ఒక అధికారి తెలిపారు. సంజయ్ బ్రహ్మానే (జాయింట్ డీజీ), అమిత్ గుప్తా (డిప్యూటీ డీజీ), కపిల్ మాంగ్లిక్ (సీనియర్ ఫ్లైట్ ఆపరేషన్స్ ఇన్స్పెక్టర్), లోకేశ్ రాంపాల్ (ఎఫ్ఓఐ)లతో కూడిన నలుగురు సభ్యుల కమిటీ, భారీ స్థాయిలో ఏర్పడిన ఈ అంతరాయానికి కారణాలను గుర్తించడమే లక్ష్యంగా విచారణ చేయనుంది.
ప్యానెల్ నిర్వహించాల్సిన ప్రధాన బాధ్యతలు
• మానవ వనరుల యాజమాన్యంలో లోపాలు
• క్రూ రోస్టరింగ్ వ్యవస్థల్లో మార్పులు
• పైలట్ల డ్యూటీ గంటలు, విశ్రాంతి కాలానికి సంబంధించి కొత్త నిబంధనలు అమలు చేయడానికి సంస్థ తగిన సిద్ధత కలిగి ఉందా అన్న విశ్లేషణ
• ఎఫ్డీటిఎల్ సవరణల అమలులో గ్యాప్లు, బాధ్యతల నిర్ధారణ
డిసెంబర్ 5న డీజీసీఏ చీఫ్ ఫైజ్ అహ్మద్ కిడ్వాయి ఈ ప్యానెల్ను ప్రకటించారు. ఒక వర్గం తెలిపిన మేరకు ఈ వారంలో బుధవారం ఇండిగో సీఈవో పీటర్ ఎల్బర్స్, సీవోవో ఇసిడ్రె పోర్కేరాస్ లను డీజీసీఏ ప్యానెల్ విచారణలో భాగంగా పిలిచే అవకాశం ఉందని సమాచారం. ఇందుకు సంబంధించి ఇప్పటికే డీజీసీఏ ఇద్దరికీ షోకాజ్ నోటీసులు జారీచేసి, సోమవారం సాయంత్రం 6 గంటలలోపు సమాధానం ఇవ్వాలని ఆదేశించింది.
ఫ్లైట్ రద్దుల నేపథ్యం
గత శుక్రవారం ఇండిగో దాదాపు 2,300 విమానాల్లో 1,600 విమానాలను రద్దు చేయాల్సి వచ్చింది. దీనిపై డీజీసీఏ కు సమర్పించిన నివేదికలో ఫ్లైట్ డ్యూటీ టైం లిమిటేషన్స్ (ఎఫ్డీటీఎల్) సవరణల రెండో దశ అమల్లో ముఖ్యంగా సమస్యలు రావడం, వాటిని ముందుగానే పూర్తిగా అంచనా వేయలేకపోవడం, క్రూ ప్లానింగ్, రోస్టరింగ్ సిద్ధత తగినంతగా లేకపోవడం వల్లే ఈ అంతరాయాలు పెరిగాయని పేర్కొంది. ఈ కమిటీ 15 రోజుల్లో నివేదిక సమర్పించాల్సి ఉంటుంది.
ఎఫ్డీటీఎల్ కొత్త నిబంధనలు ఏమిటి?
• ప్రతి వారం 48 గంటల విశ్రాంతి తప్పనిసరి
• రాత్రి గంటల వ్యవధి పెంపు
• రాత్రి ల్యాండింగ్స్ సంఖ్యను 6 నుంచి 2కి తగ్గింపు
దేశీయ ఎయిర్లైన్స్ ఇండిగో, ఎయిర్ ఇండియా మొదట ఈ నిబంధనలకు వ్యతిరేకతను చూపాయి. అయితే ఢిల్లీ హైకోర్టు ఆదేశాలతో, డీజీసీఏ ఆలస్యంగా అయినా దశల వారీగా అమలు చేస్తోంది. ఈ నిబంధనలను అసలు మార్చి 2024 నుంచే అమల్లోకి తేవాల్సి ఉన్నా, పైలట్లు, అదనపు సిబ్బంది అవసరాన్ని చూపుతూ ఎయిర్లైన్స్ దశలవారీ అమలు కోరిన తర్వాత, జూలై 1, నవంబర్ 1 నుంచి రెండు దశల్లో ప్రవేశపెట్టారు. ఇండిగోకు ఫిబ్రవరి 10 వరకు రెండో దశ నిబంధనలలో తాత్కాలిక సడలింపులు కూడా లభించాయి.
