
రెండో రోజుకు చేరుకున్నప్రభుత్వ హైర్ వాహనాల డ్రైవర్ల సమ్మె!
తెలంగాణలో వివిధ ప్రభుత్వ శాఖల్లో హైర్ ప్రాతిపదికన సేవలు అందిస్తున్న వాహన యజమాని-డ్రైవర్ల నిరవధిక సమ్మె రెండో రోజుకు చేరుకుంది. రాష్ట్రవ్యాప్తంగా 33 జిల్లాల్లో ప్రభుత్వ శాఖలకు హైర్పై వాహనాలు అందిస్తున్న వేలాది మంది డ్రైవర్లు సమ్మెలో పాల్గొంటున్నట్లు తెలంగాణ ఫోర్ వీలర్ డ్రైవర్స్ అసోసియేషన్ (టీజీఎఫ్డబ్ల్యూడీఏ) తెలిపింది. తమ న్యాయమైన డిమాండ్లపై ప్రభుత్వం ఇప్పటికైనా స్పందించి సమస్యకు శాశ్వత పరిష్కారం చూపాలని సంఘం నాయకులు కోరుతున్నారు.
సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ విడుదల చేసిన ప్రకటనలో, ప్రభుత్వం తమ సమస్యలను చాలా కాలంగా నిర్లక్ష్యం చేస్తోందని ఆవేదన వ్యక్తం చేశారు. హైర్ వాహనాల చార్జీల పెంపు, పెండింగ్ బిల్లుల చెల్లింపు వంటి అంశాలపై పలుమార్లు ప్రభుత్వ దృష్టికి తీసుకెళ్లినప్పటికీ ఇప్పటివరకు ఎలాంటి స్పష్టమైన నిర్ణయం తీసుకోలేదని పేర్కొన్నారు.
రవాణా శాఖ మంత్రి, ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి, ఆర్థిక శాఖ, రవాణా శాఖ ఉన్నతాధికారులకు పలుమార్లు వినతిపత్రాలు సమర్పించినా ఫలితం లేకపోవడంతో చివరి మార్గంగా నిరవధిక సమ్మె చేపట్టాల్సి వచ్చిందని తెలిపారు. రాష్ట్రంలోని అన్ని ప్రభుత్వ శాఖల్లో పనిచేస్తున్న హైర్ వాహన డ్రైవర్లు శాంతియుతంగా సమ్మె కొనసాగిస్తున్నారని చెప్పారు.
ప్రధాన డిమాండ్లు ఇవే
డ్రైవర్ల సంఘం ప్రభుత్వం ముందు రెండు కీలక డిమాండ్లను ఉంచింది. ప్రస్తుతం నెలకు చెల్లిస్తున్న రూ.34 వేల హైర్ చార్జీలను పెంచి రూ.55 వేలుగా నిర్ణయించాలని కోరుతోంది. అలాగే వివిధ ప్రభుత్వ శాఖల్లో నెలల తరబడి పెండింగ్లో ఉన్న హైర్ వాహనాల బిల్లులను వెంటనే విడుదల చేయాలని డిమాండ్ చేసింది.
సీఎం, డిప్యూటీ సీఎం జోక్యం చేసుకోవాలి
సమస్య తీవ్రతను దృష్టిలో ఉంచుకుని ముఖ్యమంత్రి, ఉప ముఖ్యమంత్రి తక్షణమే జోక్యం చేసుకుని సానుకూల నిర్ణయం తీసుకోవాలని టీజీఎఫ్డబ్ల్యూడీఏ విజ్ఞప్తి చేసింది. ప్రభుత్వం చర్చలకు ముందుకు వచ్చి సమస్యను పరిష్కరిస్తే వేలాది డ్రైవర్ల కుటుంబాల జీవనోపాధి కాపాడబడుతుందని, ప్రభుత్వ సేవలు కూడా ఎలాంటి అంతరాయం లేకుండా కొనసాగుతాయని సంఘం అభిప్రాయపడింది.
అదుపులోకి తీసుకున్న డ్రైవర్ల విడుదల కోరిన సంఘం
సమ్మె సందర్భంగా అదుపులోకి తీసుకున్న హైర్ వాహన డ్రైవర్లను వెంటనే విడుదల చేయాలని తెలంగాణ పోలీసులను సంఘం వ్యవస్థాపక అధ్యక్షుడు షేక్ సలాహుద్దీన్ కోరారు. శాంతియుతంగా తమ హక్కుల కోసం ఉద్యమిస్తున్న డ్రైవర్లపై కఠిన చర్యలు తీసుకోకుండా ప్రభుత్వం చర్చల ద్వారా సమస్యను పరిష్కరించాలని విజ్ఞప్తి చేశారు.
ప్రభుత్వం త్వరగా స్పందించి తమ న్యాయమైన డిమాండ్లను పరిష్కరిస్తుందని ఆశిస్తున్నామని, లేనిపక్షంలో సమ్మెను మరింత ఉధృతం చేసే దిశగా సంఘం నిర్ణయం తీసుకునే అవకాశం ఉందని టీజీఎఫ్డబ్ల్యూడీఏ సంకేతాలు ఇచ్చింది.
