
రెండురోజుల పాటు భారీ వర్షాలు: డీఎంవో ప్రఖర్ జైన్
ఆగ్నేయ బంగాళాఖాతంలో ఏర్పడిన అల్పపీడనం గడిచిన 3గంటల్లో పశ్చిమ- వాయువ్య దిశగా నెమ్మదిగా కదులుతుందని విపత్తుల నిర్వహణ సంస్థ మేనేజింగ్ డైరెక్టర్ ప్రఖర్ జైన్ తెలిపారు. ఆదివారానికి ఆగ్నేయ, దాని ప్రక్కనే ఉన్న మధ్య బంగాళాఖాతంలో తీవ్రవాయుగుండంగా రూపాంతరం చెందుతుందని పేర్కొన్నారు. ఇది సోమవారం ఉదయానికి పశ్చిమ-మధ్య బంగాళాఖాతంలో తుపానుగా బలపడే అవకాశం ఉందని వెల్లడించారు. మత్స్యకారులు సముద్రంలోకి వేటకు వెళ్ళరాదని హెచ్చరించారు.
దీని ప్రభావంతో రాష్ట్రంలో కొన్ని ప్రాంతాల్లో ఆదివారం-సోమవారం భారీ వర్షాలు, ఆదివారం భారీ నుంచి అతిభారీవర్షాలు, సోమవారం అత్యంత భారీ వర్షాలు కురిసే అవకాశం ఉందన్నారు. తీరం వెంట బలమైన ఈదురుగాలులు వీస్తాయని ప్రజలు అప్రమత్తంగా ఉండాలని సూచించారు. రైతులు వ్యవసాయ పనుల్లో తగిన జాగ్రత్తలు తీసుకోవాలన్నారు. లోతట్టు ప్రాంత ప్రజలు అలెర్ట్ గా ఉండాలన్నారు. తుపాను సమయంలో అత్యవసరం అయితే తప్ప బయటకు రావొద్దని, ఇంట్లోనే సురక్షితంగా ఉండాలని ప్రఖర్ జైన్ విజ్ఞప్తి చేశారు.
