Let's talk: editor@tmv.in
రూ.53.47 లక్షల కోట్లతో వార్షిక ఆర్థిక ప్రణాళిక

రూ.53.47 లక్షల కోట్లతో వార్షిక ఆర్థిక ప్రణాళిక

Pinjari Chand
2 ఫిబ్రవరి, 2026

ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ఆదివారం 2026–27 ఆర్థిక సంవత్సరానికి రూ. 53.47 లక్షల కోట్ల కేంద్ర బడ్జెట్‌ను ప్రవేశపెట్టారు. ఇది ప్రస్తుత ఆర్థిక సంవత్సరంతో పోలిస్తే 7.7 శాతం అధికం. సవరించిన అంచనాల (ఆర్ఈ) ప్రకారం, 2025–26 ఆర్థిక సంవత్సరానికి బడ్జెట్ పరిమాణం రూ. 49.64 లక్షల కోట్లు, ఇది గతేడాది ఫిబ్రవరిలో అంచనా వేసిన రూ. 50.65 లక్షల కోట్ల కంటే తక్కువ. 2024–25లో బడ్జెట్ పరిమాణం రూ. 46.52 లక్షల కోట్లుగా ఉంది. 2026–27లో మొత్తం ప్రభుత్వ వ్యయం రూ. 53.47 లక్షల కోట్లుగా అంచనా వేయగా, ఋణేతర ఆదాయం (నాన్-డెబ్ట్ రిసీప్ట్స్) రూ. 36.5 లక్షల కోట్లుగా ఉంటుందని అంచనా. కేంద్ర ప్రభుత్వ నికర పన్ను ఆదాయం రూ. 28.7 లక్షల కోట్లుగా ఉంటుందని పేర్కొన్నారు. ఆర్థిక లోటును పూడ్చేందుకు, 2026–27లో డేటెడ్ సెక్యూరిటీల ద్వారా నికర మార్కెట్ అప్పులు రూ. 11.7 లక్షల కోట్లుగా అంచనా వేయగా, మిగిలిన నిధులు చిన్న పొదుపు పథకాలు, ఇతర వనరుల ద్వారా సమకూరుస్తామని మంత్రి తెలిపారు. మొత్తం మార్కెట్ అప్పులు రూ. 17.2 లక్షల కోట్లుగా ఉంటాయని చెప్పారు.

ప్రస్తుత ఆర్థిక సంవత్సరానికి (2025–26) జీడీపీలో 4.4 శాతంగా నిర్ణయించిన ఆర్థిక లోటు లక్ష్యాన్ని ప్రభుత్వం సాధిస్తుందని సీతారామన్ స్పష్టం చేశారు. 2026–27లో ఆర్థిక లోటు జీడీపీలో 4.3 శాతం, అంటే రూ. 16.95 లక్షల కోట్లుగా అంచనా వేశారు. బడ్జెట్ పద్దుల ప్రకారం, 2026–27 ఆర్థిక సంవత్సరానికి దేశ జీడీపీ రూ. 393 లక్షల కోట్లకు పైగా ఉంటుందని అంచనా, ఇది 2025–26 అడ్వాన్స్ అంచనాల కంటే 10 శాతం అధికం.

ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ సామాజిక అవసరాలకు ఎలాంటి లోటు లేకుండా ప్రభుత్వం ముందుకెళ్తోందని మంత్రి తెలిపారు. 2030–31 నాటికి రుణ–జీడీపీ నిష్పత్తిని 50±1 శాతానికి తీసుకెళ్లే లక్ష్యానికి అనుగుణంగా, 2026–27లో అది 55.6 శాతంగా ఉండగా, 2025–26లో 56.1 శాతంగా ఉందని చెప్పారు. రుణ–జీడీపీ నిష్పత్తి క్రమంగా తగ్గితే వడ్డీ చెల్లింపుల భారం తగ్గి, ప్రాధాన్య రంగాలపై ఎక్కువ ఖర్చు చేయడానికి అవకాశం ఏర్పడుతుందని సీతారామన్ అన్నారు. ఇదిలా ఉండగా, 2025–26 సవరించిన అంచనాల ప్రకారం ఋణేతర ఆదాయం రూ. 34 లక్షల కోట్లు, నికర పన్ను ఆదాయం రూ. 26.7 లక్షల కోట్లుగా ఉన్నాయి. మొత్తం వ్యయం రూ. 49.6 లక్షల కోట్లు, ఇందులో మూలధన వ్యయం సుమారు రూ. 11 లక్షల కోట్లుగా ఉంది.

ఏప్రిల్ 1 నుంచి కొత్త ఆదాయపు పన్ను చట్టం అమల్లోకి

ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్–2025 ఏప్రిల్ 1 నుంచి అమల్లోకి వస్తుందని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ తెలిపారు. ఈ చట్టానికి సంబంధించిన నిబంధనలు, ఆదాయపు పన్ను రిటర్న్ (ఐటీఆర్) ఫార్ములు త్వరలోనే నోటిఫై చేస్తామని చెప్పారు. ఆరు దశాబ్దాలుగా అమలులో ఉన్న 1961 ఆదాయపు పన్ను చట్టాన్ని భర్తీ చేస్తూ, ఏప్రిల్ 1 నుంచి కొత్త చట్టం అమల్లోకి రానుంది. 2026–27 బడ్జెట్‌లో చేసిన పన్ను చట్టాల మార్పులన్నీ ఈ కొత్త చట్టంలో పొందుపరుస్తామని మంత్రి స్పష్టం చేశారు.

లోక్‌సభలో బడ్జెట్ ప్రసంగంలో ఆమె మాట్లాడుతూ ఈ ప్రత్యక్ష పన్నుల చట్టం (డైరెక్ట్ ట్యాక్స్ కోడ్) రికార్డు సమయంలో పూర్తయ్యింది. 2026 ఏప్రిల్ 1 నుంచి ఇన్‌కమ్ ట్యాక్స్ యాక్ట్–2025 అమల్లోకి వస్తుంది. సరళీకృత ఆదాయపు పన్ను నిబంధనలు, ఫార్ములు త్వరలో విడుదల చేస్తాం. వాటిని అర్థం చేసుకునేందుకు పన్ను చెల్లింపుదారులకు తగిన సమయం ఉంటుందని అన్నారు. కొత్తగా రూపొందించిన ఫార్ములు సాధారణ పౌరులు సులభంగా పన్ను నిబంధనలను పాటించేలా ఉంటాయని ఆమె తెలిపారు. ఈ కొత్త ఆదాయపు పన్ను చట్టం రెవెన్యూ న్యూట్రల్గా ఉంటుందని, అంటే పన్ను రేట్లలో ఎలాంటి మార్పులు లేవని మంత్రి చెప్పారు. ప్రత్యక్ష పన్ను చట్టాలను సులభంగా అర్థమయ్యేలా చేయడం, అయోమయాలను తొలగించడం ద్వారా న్యాయపోరాటాల అవకాశాలను తగ్గించడమే దీని లక్ష్యమని వివరించారు. 1961 చట్టంతో పోలిస్తే కొత్త చట్టంలో పాఠ్య పరిమాణం, సెక్షన్లు సుమారు 50 శాతం వరకు తగ్గించారు. అలాగే, అసెస్‌మెంట్ ఇయర్ – ప్రీవియస్ ఇయర్ అనే విభజనను తొలగించి, ఒకే ‘ట్యాక్స్ ఇయర్’ విధానాన్ని ప్రవేశపెట్టడం ద్వారా పన్ను గడువులను సరళీకృతం చేసినట్లు తెలిపారు. గడువు తర్వాత ఐటీఆర్ దాఖలు చేసినా, ఎలాంటి జరిమానా లేకుండా టిడిఎస్ రిఫండ్ పొందే వెసులుబాటు కూడా ఈ చట్టంలో కల్పించినట్లు మంత్రి వెల్లడించారు.

సవరించిన ఆదాయపు పన్ను రిటర్న్ దాఖలుకు గడువు పొడిగింపు ప్రతిపాదన

సవరించిన ఆదాయపు పన్ను (ఐటీఆర్) రిటర్న్ దాఖలు చేసేందుకు ఉన్న గడువును డిసెంబర్ 31 నుంచి మార్చి 31 వరకు పెంచాలని ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రతిపాదించారు. అయితే దీనికి స్వల్ప ఫీజు చెల్లించాల్సి ఉంటుందని తెలిపారు. 2026–27 బడ్జెట్‌లో భాగంగా, చిన్న పన్ను చెల్లింపుదారుల కోసం నియమావళి ఆధారిత ఆటోమేటెడ్ ప్రక్రియను అమలు చేయాలని ప్రభుత్వం నిర్ణయించినట్లు ఆమె తెలిపారు. మోటార్ యాక్సిడెంట్ క్లెయిమ్స్ ట్రిబ్యునల్ ఇచ్చే అవార్డు మొత్తాన్ని ఆదాయపు పన్ను నుంచి మినహాయించేందుకు ప్రతిపాదన చేసినట్లు సీతారామన్ వెల్లడించారు.

షేర్ బైబ్యాక్ ఆదాయంపై క్యాపిటల్ గెయిన్స్ పన్ను

షేర్ల బైబ్యాక్ ద్వారా పొందే ఆదాయం అన్ని రకాల షేర్‌హోల్డర్లకూ క్యాపిటల్ గెయిన్స్ పన్ను పరిధిలోకి వస్తుందని ఆర్థిక మంత్రి ప్రకటించారు. 2026–27 కేంద్ర బడ్జెట్‌ను లోక్‌సభలో ప్రవేశపెడుతూ, కమోడిటీ ఫ్యూచర్స్ లావాదేవీలపై వసూలు చేసే సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీటీ)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచాలని ప్రభుత్వం ప్రతిపాదించినట్లు ఆమె తెలిపారు.

అలాగే మినిమమ్ ఆల్టర్నేట్ ట్యాక్స్ (ఎంఏటీ)ను ఇకపై చివరి పన్ను (ఫైనల్ ట్యాక్స్)గా పరిగణించాలని, అదే సమయంలో ఎంఏటీ రేటును ప్రస్తుత 15 శాతం నుంచి 14 శాతానికి తగ్గించాలని ప్రతిపాదించారు. ఆదాయ లెక్కింపు, వెల్లడింపు ప్రమాణాలను చట్టంలో పొందుపరచేందుకు కార్పొరేట్ వ్యవహారాల మంత్రిత్వ శాఖ, సెంట్రల్ బోర్డ్ ఆఫ్ డైరెక్ట్ ట్యాక్సెస్ తో కలిసి ఒక సంయుక్త కమిటీ ఏర్పాటు చేయనున్నట్లు సీతారామన్ వెల్లడించారు. దేశంలోని ముఖ్యమైన ప్రదేశాల సమాచారాన్ని డిజిటల్ రూపంలో నమోదు చేయడానికి నేషనల్ డెస్టినేషన్ డిజిటల్ నాలెడ్జ్ గ్రిడ్ ఏర్పాటు చేయనున్నట్లు ఆర్థిక మంత్రి తెలిపారు.

విదేశీ ప్రయాణాలు, వైద్య ఖర్చులకు ఊరట… స్టాక్ మార్కెట్, మత్తుపదార్థాలపై భారం

కేంద్ర ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్ ప్రవేశపెట్టిన కేంద్ర బడ్జెట్ 2026–27లో సామాన్య ప్రజలకు ఊరట కలిగించే చర్యలతో పాటు, కొన్ని రంగాలపై పన్నుల భారం పెంచే ప్రతిపాదనలు ఉన్నాయి. వినియోగదారులు, ఎగుమతిదారులు, వ్యూహాత్మక పరిశ్రమలకు మద్దతు ఇస్తూనే, ఆర్థిక మార్కెట్లు, మత్తుపదార్థాల వంటి రంగాల నుంచి అదనపు ఆదాయం సమీకరించడమే లక్ష్యంగా ఈ ప్రతిపాదనలు రూపొందించారు.

బడ్జెట్‌లో భాగంగా విదేశీ టూర్ ప్యాకేజీలపై టాక్స్ కలెక్టెడ్ అట్ సోర్స్ (టీసీఎస్)ను గతంలో ఉన్న 5–20 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. కనీస పరిమితి లేకుండా ఈ తగ్గింపు వర్తించనుంది. ఇదే విధంగా, లిబరలైజ్డ్ రిమిటెన్స్ స్కీమ్ (ఎల్ఆర్ఎస్) కింద విదేశాల్లో విద్య, వైద్య చికిత్స కోసం పంపే డబ్బుపై టీసీఎస్ ను 5 శాతం నుంచి 2 శాతానికి తగ్గించారు. దీనివల్ల విదేశాల్లో చదువుతున్న విద్యార్థులు, వైద్య అవసరాల కోసం డబ్బు పంపే కుటుంబాలకు నగదు ఒత్తిడి తగ్గనుంది.

ఆరోగ్య రంగానికి ప్రాధాన్యతనిస్తూ, 17 క్యాన్సర్, తీవ్రమైన వ్యాధుల మందులపై బేసిక్ కస్టమ్స్ డ్యూటీని పూర్తిగా మాఫీ చేశారు. అలాగే, మరో 7 అరుదైన వ్యాధులను డ్యూటీ-ఫ్రీగా మందులు, ప్రత్యేక వైద్యాహారం దిగుమతి చేసుకునే జాబితాలో చేర్చారు.

శుభ్ర శక్తి, స్వదేశీ తయారీని ప్రోత్సహించేందుకు, సోలార్ గ్లాస్ తయారీలో ఉపయోగించే సోడియం యాంటిమోనేట్‌పై కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ఇచ్చారు. అలాగే, న్యూక్లియర్ పవర్ ప్రాజెక్టులకు 2035 వరకు కస్టమ్స్ డ్యూటీ మాఫీని పొడిగించారు. పౌర విమానాల తయారీకి ఉపయోగించే భాగాలు, ఇంజిన్లపై కూడా బేసిక్ కస్టమ్స్ డ్యూటీ మినహాయింపు ప్రకటించారు. వినియోగదారుల ఎలక్ట్రానిక్స్ రంగానికి ఊతమిస్తూ, మైక్రోవేవ్ ఓవెన్ల తయారీలో ఉపయోగించే కొన్ని భాగాలపై డ్యూటీ మాఫీ కల్పించారు.

అంతర్జాతీయ ప్రయాణికులకు ఊరటగా, వ్యక్తిగత వినియోగం కోసం దిగుమతి చేసే వస్తువులపై కస్టమ్స్ డ్యూటీని 20 శాతం నుంచి 10 శాతానికి తగ్గించారు. ఇక ఎగుమతిదారులకు మద్దతుగా, టెక్స్టైల్, లెదర్ రంగాల ఎగుమతిదారులకు ఎగుమతి బాధ్యతలను పూర్తి చేసుకునే గడువును 6 నెలల నుంచి ఒక సంవత్సరానికి పెంచారు.

పెరిగే వస్తువులు

అయితే, ఆదాయ సమీకరణ చర్యల్లో భాగంగా స్టాక్ మార్కెట్ ఫ్యూచర్స్ లావాదేవీలపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీసీ)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచారు. ఆప్షన్లపై కూడా ఎస్టీసీ పెంపు ప్రకటించారు. అలాగే, మద్యం, ఖనిజాలు, స్క్రాప్ విక్రయాలపై టీసీఎస్ ను 1 శాతం నుంచి 2 శాతానికి పెంచారు.

పొగాకు ఉత్పత్తుల విషయంలో చివింగ్ టొబాకో, గుట్కా వంటి ఉత్పత్తులపై నేషనల్ కేలమిటీ కంటింజెంట్ డ్యూటీ (ఎన్సీసీడీ)ను 25 శాతం నుంచి 60 శాతానికి పెంచారు. అయితే, నోటిఫికేషన్ ద్వారా వాస్తవ భారం 25 శాతానికే పరిమితం చేస్తామని ప్రభుత్వం స్పష్టం చేసింది.

మొత్తంగా, బడ్జెట్ 2026–27 ప్రజల జీవన ప్రమాణాలను మెరుగుపరచడం, దేశీయ తయారీ, ఎగుమతులకు ప్రోత్సాహం ఇవ్వడం, అదే సమయంలో ఆర్థిక క్రమశిక్షణను పాటిస్తూ ఆదాయ వనరులను బలోపేతం చేయడం లక్ష్యంగా రూపొందించినట్లు ప్రభుత్వం తెలిపింది.

వీబీ-జీ రాంజీకు రూ.95,692 కోట్ల కేటాయింపు–ఎంజీ ఎన్రేగా కి రూ.30,000 కోట్ల బడ్జెట్

కేంద్ర ప్రభుత్వం కొత్తగా ప్రవేశపెట్టిన వీబీ-జీ రాంజీ పథకం కోసం రూ. 95,692.31 కోట్ల కేటాయించింది. ఈ పథకంలో ఏడాదికి 125 రోజుల పని హామీ ఇస్తూ, రెండేళ్లుగా అమలులో ఉన్న ఎంజీ ఎన్రేగాకు ప్రత్యామ్నాయంగా తీసుకురానుంది. ఎంజీ ఎన్రేగా ఈ మధ్యంతరంలో కొనసాగుతుంది, ప్రస్తుతం పెండింగ్ పనులు పూర్తయ్యేవరకు. 2025–26లో ఎంజీ ఎన్రేగా కి మొత్తం ఖర్చు రూ. 88,000 కోట్లు గా అంచనా వేశారు, మొదటి కేటాయింపు రూ. 86,000 కోట్లు ఉండగా. గ్రామీణ అభివృద్ధి శాఖ మొత్తం బడ్జెట్ రూ.1,94,368.81 కోట్లుగా నిర్ణయించింది. ఇది గత సంవత్సరం కేటాయింపుతో పోలిస్తే సుమారు 3.5% పెరుగుదల.

ప్రధాన ఇతర గ్రామీణ పథకాలు:

• పీఎంజీఎస్వై : రూ.19,000 కోట్లు (మునుపటి ఏడాది సమానం)

• డే–ఎన్ఆర్ఎల్ఎం: రూ.19,200 కోట్లు (మునుపటి ఏడాది రూ.19,005 కోట్లు)

• పీఎంఏవై–జీ: రూ.54,916.70 కోట్లు (మునుపటి ఏడాది రూ.54,832 కోట్లు)

ఈ బడ్జెట్ చారిత్రకమైనది. దీని ద్వారా 2047 నాటికి స్వయం సమర్థవంతమైన, అభివృద్ధి చెందిన గ్రామాలు సృష్టించవచ్చు. ప్రధానంగా పునరుద్దరణలపై దృష్టి పెట్టామని రూరల్ అభివృద్ధి మంత్రిత్వ శాఖ మంత్రి శివరాజ్ సింగ్ చౌహాన్ అన్నారు. అలాగే, 16వ ఫైనాన్స్ కమిషన్ సిఫార్సుల ఆధారంగా పంచాయతీలకు అదనంగా రూ.55,990 కోట్లు కేటాయించారు. కేంద్రం, రాష్ట్రాల సమన్వయం ద్వారా వీబీ–జీ రాం జీ కి మొత్తం ఖర్చు రూ.1,51,000 కోట్లు అయ్యే అవకాశం ఉంది.

కమోడిటీ ఫ్యూచర్లపై ఎస్టీటీ పెంపుతో కుప్పకూలిన సెన్సెక్స్, నిఫ్టీ

కమోడిటీ ఫ్యూచర్లపై సెక్యూరిటీస్ ట్రాన్సాక్షన్ ట్యాక్స్ (ఎస్టీసీ)ను 0.02 శాతం నుంచి 0.05 శాతానికి పెంచాలని కేంద్ర బడ్జెట్‌లో ప్రతిపాదించడంతో, ఆదివారం మధ్యాహ్న ట్రేడింగ్‌లో దేశీయ స్టాక్ మార్కెట్ సూచీలు సెన్సెక్స్, నిఫ్టీ తీవ్రంగా పడిపోయాయి. బడ్జెట్ ప్రసంగంలో ఆర్థిక మంత్రి నిర్మలా సీతారామన్, అన్ని రకాల షేర్‌హోల్డర్లకు బైబ్యాక్ ద్వారా వచ్చే ఆదాయాన్ని క్యాపిటల్ గెయిన్స్‌గా పన్ను విధిస్తామని ప్రకటించారు.

ఉదయం ట్రేడింగ్‌లో హెచ్చుతగ్గులు ఎదుర్కొన్న 30 షేర్ల బీఎస్‌ఈ సెన్సెక్స్, బడ్జెట్ ప్రవేశపెట్టే సమయంలో కొంతమేర కోలుకున్నప్పటికీ, ఆ లాభాలను నిలబెట్టుకోలేకపోయింది. అనంతరం 2,370.36 పాయింట్లు (2.88 శాతం) పడిపోయి, 80,000 స్థాయిని దాటి దిగజారి 79,899.42 వద్ద మధ్యాహ్న ట్రేడింగ్‌లో కొనసాగింది. అదేవిధంగా, 50 షేర్ల ఎన్ఎస్‌ఈ నిఫ్టీ 748.9 పాయింట్లు (2.95 శాతం) క్షీణించి, 24,571.75 వద్ద ట్రేడైంది.

నష్టాల్లో ఉన్న షేర్లు

సెన్సెక్స్‌లోని 30 కంపెనీలలో భారత్ ఎలక్ట్రానిక్స్ షేరు అత్యధికంగా 6.50 శాతం నష్టపోయింది. స్టేట్ బ్యాంక్ ఆఫ్ ఇండియా, హెచ్‌సీఎల్ టెక్, టాటా స్టీల్, ఏషియన్ పెయింట్స్, ఎటర్నల్ షేర్లు కూడా నష్టాల్లో కొనసాగాయి.

లాభాల్లో ఉన్నవి

మరోవైపు సన్ ఫార్మా, కొటక్ మహీంద్రా బ్యాంక్, టాటా కన్సల్టెన్సీ సర్వీసెస్ (టీసీఎస్) షేర్లు లాభాల్లో నిలిచాయి.

నిపుణుల అభిప్రాయం

చాయిస్ ఈక్విటీ బ్రోకింగ్ టెక్నికల్ రీసెర్చ్ అనలిస్ట్ ఆకాష్ షా మాట్లాడుతూ ఫ్యూచర్స్ అండ్ ఆప్షన్స్‌లో ముఖ్యంగా ఎస్టీటీ పెంపు నిర్ణయం, సమీప కాలంలో విదేశీ పోర్ట్‌ఫోలియో ఇన్వెస్టర్ల (ఎఫ్పీఐ) పెట్టుబడులపై స్వల్ప ప్రతికూల ప్రభావం చూపే అవకాశం ఉంది. ముఖ్యంగా హై-ఫ్రీక్వెన్సీ, డెరివేటివ్ ఆధారిత గ్లోబల్ ఫండ్స్‌పై ఇది ఎక్కువగా ప్రభావం చూపవచ్చు అని తెలిపారు.

విదేశీ పెట్టుబడులు

ఎక్స్చేంజ్ గణాంకాల ప్రకారం, శుక్రవారం విదేశీ సంస్థాగత ఇన్వెస్టర్లు (ఎఫ్ఐఐలు) రూ. 2,251.37 కోట్లు విలువైన షేర్లను కొనుగోలు చేశారు. ఆసియా మార్కెట్లు ఆదివారం సెలవు కారణంగా తెరుచుకోలేదు. అమెరికా మార్కెట్లు శుక్రవారం నష్టాల్లో ముగిశాయి.

గత ట్రేడింగ్ పరిస్థితి

శుక్రవారం సెన్సెక్స్ 296.59 పాయింట్లు (0.36 శాతం) తగ్గి 82,269.78 వద్ద ముగిసింది.

నిఫ్టీ 98.25 పాయింట్లు (0.39 శాతం) పడిపోయి 25,320.65 వద్ద స్థిరపడింది.

కేంద్ర బడ్జెట్ 2026–27 : రంగాల వారీ కేటాయింపులు (రూ. కోట్లలో)