
రూ. 3.25 కోట్ల అభివృద్ధి పనులకు శంకుస్థాపన చేసిన పటాన్చెరు ఎమ్మెల్యే
పటాన్చెరు నియోజకవర్గ పరిధిలోని అమీన్పూర్ మున్సిపాలిటీలో అభివృద్ధి పనులకు ఎమ్మెల్యే గూడెం మహిపాల్ రెడ్డి సోమవారం ఉదయం శ్రీకారం చుట్టారు. సుమారు రూ.3.25 కోట్ల అంచనా వ్యయంతో చేపట్టనున్న వివిధ రహదారి నిర్మాణ పనులకు ఆయన శంకుస్థాపన చేశారు.
నియోజకవర్గంలో రవాణా సౌకర్యాలను మెరుగుపరచడమే లక్ష్యంగా, అమీన్పూర్ డివిజన్ పరిధిలో సాయి అంబికా కాలనీ నుంచి ఐలాపూర్ తండా వరకు, అలాగే లాలా బాయి కాలనీ నుంచి బొల్లారం ఇండస్ట్రియల్ ఏరియా వరకు నూతనంగా సిసి, బిటి రోడ్ల నిర్మాణ పనులను ప్రారంభించారు. ఈ సందర్భంగా ఎమ్మెల్యే మాట్లాడుతూ, ఈ రహదారుల నిర్మాణం పూర్తయితే ఆయా కాలనీల ప్రజలకు, పారిశ్రామిక ప్రాంత ప్రయాణికులకు మెరుగైన రవాణా సౌకర్యం అందుబాటులోకి వస్తుందని తెలిపారు. నాణ్యతతో కూడిన పనులను నిర్ణీత గడువులోగా పూర్తి చేసి ప్రజలకు అందుబాటులోకి తీసుకురావాలని అధికారులను ఆయన ఆదేశించారు. నియోజకవర్గ అభివృద్ధికి నిరంతరం కృషి చేస్తామని ఎమ్మెల్యే పునరుద్ఘాటించారు.
