
‘రియల్ ఎస్టేట్’ పెట్టుబడుల్లో భారత్ జోరు: రూ.2.3 లక్షల కోట్లకు చేరిన మార్కెట్ విలువ
భారతదేశంలో రియల్ ఎస్టేట్ పెట్టుబడుల తీరు మారుతోంది. గతంలో కేవలం ఇళ్లు, స్థలాలు కొనడం మాత్రమే తెలిసిన మన దేశంలో, ఇప్పుడు 'రీట్స్' (రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్టులు) అనే కొత్త విధానం ఊపందుకుంది. తాజా నివేదిక ప్రకారం, భారత రీట్స్ల మొత్తం ఆస్తుల విలువ (గ్రాస్ ఆసెట్ వాల్యూ) సుమారు రూ.2.3 లక్షల కోట్లకు చేరింది. ఈ విలువతో మార్కెట్ క్యాపిటలైజేషన్ పరంగా భారత్, హాంకాంగ్ను కూడా అధిగమించింది.
అసలు 'రీట్స్' అంటే ఏమిటి?
'రీట్స్' అనేది ఒక "అద్దె ఇల్లు" లాంటిది. కానీ ఇక్కడ మనం ఒక చిన్న ఇల్లు కాకుండా, కోట్లాది రూపాయల విలువైన పెద్ద పెద్ద ఐటీ పార్కులు, షాపింగ్ మాల్స్, భారీ ఆఫీస్ బిల్డింగ్లలో భాగస్వామి అవుతాము.
సాధారణంగా ఒక సామాన్యుడు ఒంటరిగా ఇలాంటి పెద్ద బిల్డింగ్లను కొనలేడు. అందుకే, మ్యూచువల్ ఫండ్స్లో లాగా చాలా మంది కలిసి కొంచెం కొంచెం డబ్బును ఒక చోట జమ చేస్తారు. ఆ డబ్బుతో ఒక సంస్థ పెద్ద పెద్ద కమర్షియల్ బిల్డింగ్లను కొంటుంది. ఆ బిల్డింగ్ల ద్వారా వచ్చే అద్దెను, పెట్టుబడి పెట్టిన వారికి వారి వాటా ప్రకారం లాభాల రూపంలో ప్రతి నెలా లేదా మూడు నెలలకు ఒకసారి పంచుతారు. అంటే, భవనం మనది కాకపోయినా, దాని నుంచి వచ్చే అద్దె ఆదాయంలో మనకూ వాటా వస్తుంది.. ఇదే ‘రీట్స్’ అర్థం.
హాంగ్కాంగ్ను మించిన భారత మార్కెట్
అనారాక్ క్యాపిటల్ విడుదల చేసిన నివేదిక ప్రకారం, 2025 సెప్టెంబర్ 30 నాటికి భారత రీట్స్ ఈక్విటీ మార్కెట్ క్యాప్ సుమారు రూ.1.66 లక్షల కోట్లకు చేరింది. ఆసక్తికరమైన విషయం ఏమిటంటే, భారత్లో రీట్స్కు అనువైన ఆస్తుల్లో ఇప్పటివరకు కేవలం 32 శాతం మాత్రమే లిస్టింగ్లో ఉన్నప్పటికీ, హాంకాంగ్ మార్కెట్ను మించగలిగింది.
గత ఐదేళ్లలో భారత రీట్స్ సూచీల వార్షిక సగటు ధర రాబడి (ప్రైస్ రిటర్న్) 8.9 శాతం కంటే ఎక్కువగా నమోదైంది. ఇది సింగపూర్, జపాన్, హాంకాంగ్ వంటి అభివృద్ధి చెందిన దేశాల రీట్స్ మార్కెట్లతో పోలిస్తే మెరుగైన ప్రదర్శనగా నివేదిక పేర్కొంది. అదే కాలంలో అనేక అభివృద్ధి దేశాలు తక్కువ, ప్రతికూల రాబడులను నమోదు చేశాయి.
అనారాక్ క్యాపిటల్ సీఈఓ శోభిత్ అగర్వాల్ మాట్లాడుతూ, వడ్డీ రేట్ల పెరుగుదల, మార్కెట్ ఊగిసలాటల మధ్య కూడా భారత రీట్స్ స్థిరంగా మంచి రాబడులను అందిస్తున్నాయని అన్నారు. ఇప్పటివరకు లిస్టైన మొదటి నాలుగు రీట్స్ యూనిట్ ధరలు 25 శాతం నుంచి 61 శాతం వరకు పెరిగాయని తెలిపారు. తాజాగా లిస్టైన నాలెడ్జ్ రీట్స్ ఇప్పటికే సుమారు 12 శాతం లాభం ఇచ్చిందన్నారు.
యూనిట్ ధరల పెరుగుదలతో పాటు క్రమమైన ఆదాయం రావడంతో, గత 12 నెలల్లో పెట్టుబడిదారులకు అందిన డిస్ట్రిబ్యూషన్ యీల్డ్ 5.1 నుంచి 6 శాతం మధ్యలో ఉన్నట్లు నివేదిక వెల్లడించింది. 2025-26 ఆర్థిక సంవత్సర రెండో త్రైమాసికంలో భారత్లోని ఐదు రీట్స్ కలిపి రూ.2,331 కోట్లను పెట్టుబడిదారులకు పంపిణీ చేశాయి. ఇది గత ఏడాదితో పోలిస్తే సుమారు 70 శాతం వృద్ధిగా నమోదైంది.
అనారాక్ క్యాపిటల్లో ఇన్వెస్ట్మెంట్ బ్యాంకింగ్ విభాగం మేనేజింగ్ డైరెక్టర్ విశాల్ సింగ్ మాట్లాడుతూ, రాబోయే రోజుల్లో స్టాక్ మార్కెట్ సూచీల్లో రీట్స్లను చేర్చే అవకాశాలు ఉన్నాయని చెప్పారు. అలాగే దేశీయ పెట్టుబడిదారులు ఈ రంగంలో ఎక్కువగా పెట్టుబడి పెడుతున్నారని తెలిపారు. ఈ రెండు కారణాల వల్లే, రియల్ ఎస్టేట్ ఇన్వెస్ట్మెంట్ ట్రస్ట్ రంగం త్వరలోనే 20 బిలియన్ డాలర్ల మార్కెట్ విలువను దాటే దిశగా వేగంగా ముందుకెళ్తోందని ఆయన అన్నారు.
నిబంధనల ప్రకారం రీట్స్ తమ నికర లభ్యమయ్యే నగదు ప్రవాహంలో కనీసం 90 శాతం పెట్టుబడిదారులకు పంపిణీ చేయాల్సి ఉంటుంది. ఈ నిబంధన వల్ల ఇవి స్థిర ఆదాయం అందించే పెట్టుబడి సాధనాలుగా మారాయి. దీని ద్వారా పెద్ద పెట్టుబడిదారులతో పాటు సాధారణ రిటైల్ పెట్టుబడిదారులకు కూడా ఉన్నత స్థాయి వాణిజ్య రియల్ ఎస్టేట్లో పెట్టుబడి పెట్టే అవకాశం లభిస్తోంది.
ప్రస్తుతం భారత రీట్స్ ఆస్తుల్లో ఆక్యుపెన్సీ రేటు 90 నుంచి 96 శాతం మధ్యలో ఉండటం గమనార్హం. 2025-26 రెండో త్రైమాసికంలో దేశవ్యాప్తంగా జరిగిన మొత్తం ఆఫీస్ లీజింగ్లో 20 శాతం కంటే ఎక్కువ భాగం ఈ రీట్స్ ద్వారానే జరిగిందని నివేదిక పేర్కొంది. ఇది భారత రీట్స్ రంగం ఎంత వేగంగా ఎదుగుతోందో స్పష్టంగా చూపిస్తోంది.
సామాన్యుడికి లాభం ఏంటి?
గతంలో రియల్ ఎస్టేట్ అంటే కేవలం ధనవంతులకు మాత్రమే సాధ్యమయ్యే పని. కానీ ఈ రీట్స్ పుణ్యమా అని చిన్న చిన్న పెట్టుబడిదారులు కూడా పెద్ద పెద్ద కమర్షియల్ ఆస్తుల్లో భాగస్వాములు కావడానికి మార్గం సుగమం అయింది. రాబోయే రోజుల్లో ఈ మార్కెట్ మరింత పెరిగి, సామాన్యులకు స్థిరమైన ఆదాయాన్ని ఇచ్చే ఒక నమ్మకమైన మార్గంగా మారుతుందని నిపుణులు చెబుతున్నారు.
